ETV Bharat / state

ukraine crisis: తిండి దొరక్క.. నీరు లేక.. తెలుగు విద్యార్థుల అవస్థలు

author img

By

Published : Mar 1, 2022, 9:42 PM IST

ukraine crisis
telugu students in ukraine

ukraine crisis: ఉక్రెయిన్​ నుంచి స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. రొమేనియా సరిహద్దుకు వచ్చేందుకు.. రైళ్లు, బస్సులో వందలాది మంది విద్యార్థులు క్యూకడుతున్నారు. బాంబుల మోతలు... క్షిపణుల చప్పుళ్లతో భయం భయంగా ఉక్రెయిన్​ను వీడి స్వదేశం వైపు ప్రయాణం సాగిస్తున్నారు.

ukraine crisis: ఉక్రెయిన్​లో మెడిసిన్​ చదివేందుకు వెళ్లి అక్కడే చిక్కుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థులు స్వదేశానికి చేరుకునే విషయంలో నిరీక్షణ తప్పడం లేదు. ప్రస్తుతం కొందరు తెలుగు విద్యార్థులు రొమేనియా సరిహద్దుల్లోని శిబిరాల్లో తలదాచుకోగా.. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులూ అందులో ఉన్నారు. ఓ వైపు బాంబుల మోతలు.. మరోపక్క క్షిపణుల చప్పుళ్ల మధ్య క్షణం క్షణం భయం భయంగా.. ప్రయాణం చేస్తున్నారు. వందల కిలోమీటర్ల కొద్దీ అనేక వ్యయప్రయాసల కోర్చి మరీ స్వదేశానికి వచ్చేందుకు ప్రయాణాలు సాగిస్తున్నారు. తిండిలేక, కనీసం తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు.

ఉక్రెయిన్ నుంచి రొమేనియా, పొలాండ్ సరిహద్దు ప్రాంతాలకు చేరుకునేందుకు తెలుగు విద్యార్థులకు నానా అవస్థలు తప్పడం లేదు. వీరిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన పలువురు విద్యార్థులున్నారు. చదువుకున్న యూనివర్సిటీల నుంచి అన్నీ సర్దుకొని.. రెండు రోజుల క్రితమే బయలుదేరినా.. ఇంకా చాలా మంది రొమేనియా చేరుకోలేదు.

ఇంకా బంకర్లలోనే..

వందల మంది బస్సులు, రైళ్లలో సరిహద్దులకు చేరుతుండడంతో వాహనాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్​ జామ్​ అవుతోంది. దీంతో చేసేదేంలేక.. నడుచుకుంటూనే విద్యార్థులంతా రొమేనియాలోకి చేరుకుంటున్నారు. అక్కడా పడిగాపులు తప్పడం లేదు. భారత్​ బయలుదేరే విమానాల కోసం గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఆది, సోమవారాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువులు విద్యార్థులు స్వస్థలాలకు చేరుకున్నారు. వారిలో ఒకరిద్దరు మాత్రమే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారున్నారు. ఇంకా చాలామంది చేరుకోవాల్సి ఉంది. ఉక్రెయిన్​లో బంకర్లలో తలదాచుకుంటున్నవారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంది.

కన్నవారి ఎదురుచూపులు..

ఉన్నత విద్యకోసం ఉక్రెయిన్​ వెళ్లిన తమ బిడ్డల కోసం కన్నవారు, బంధువులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఉక్రెయిన్​లో రోజురోజుకు మారుతున్న పరిస్థితులతో తమ బిడ్డల పరిస్థితి తలుచుకుని తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. కడుపు నిండా తిన్నారో లేదో కంటి నిండా నిద్రపోతున్నారో లేదో అన్న బెంగ కన్నవారిని వెంటాడుతోంది. తమ బిడ్డలను త్వరగా ఇంటికి చేర్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చెందిన మల్లం వివేక్​.. ఆదివారం దిల్లీకి చేరుకొగా.. సోమవారం ఉదయం భద్రాచలంలోని తన ఇంటికి చేరుకున్నారు.

ఇదీచూడండి: Russia ukraine war: 'ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటపడ్డాం..'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.