ETV Bharat / state

Medaram Jatara 2022: మేడారానికి బయలుదేరిన పగిడిద్దరాజు..

author img

By

Published : Feb 15, 2022, 1:55 PM IST

Updated : Feb 15, 2022, 3:27 PM IST

Medaram Jatara 2022: మేడారం మహాజాతరకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే లక్షలాది మంది భక్తుల రాకతో కిటకిటలాడుతోంది. ఈనెల 16,17,18,19 తేదీల్లో కీకారణ్యం.. జనారణ్యమై కోలాహలంగా మారనుంది. మంగళవారం సాయంత్రమే పగిడిద్దరాజు.. సంప్రదాయ పద్దతిలో మేడారానికి బయలుదేరారు. కర్లపల్లి, లక్ష్మీపురం, మొద్దులగూడెం, పస్రా, ప్రాజెక్టునగర్‌, వెంగ్లాపూర్‌, నార్లాపూర్‌, చింతల్‌ క్రాస్‌రోడ్డు, పడగాపూర్‌, జంపన్నవాగు మీదుగా మేడారం చేరుకుంటారు.

medaram
medaram

Medaram Jatara 2022: నాలుగు రోజులపాటు మేడారంలో గద్దెలపై కొలువుదీరడానికి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లా గుండాల మండలం రాళ్లగడ్డ నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజుతో వడ్డెలు, తలపతులు గిరిజన సంప్రదాయాల మధ్య కాలినడకన పయనమయ్యారు. కొడవటంచ సమీపంలోని బర్లగుట్టపై పగిడిద్దరాజు కొలువై ఉన్నాడు. యాపలగడ్డకి చెందిన అరెం వంశస్తులు పగిడిద్దరాజును ఇలవేల్పుగా కొలుస్తారు. మేడారం జాతరకు మూడు రోజుల ముందుగానే యాపలగడ్డ ఆలయంలోని ఈలు, బల్లెం పడగలు, జేగంటలను సేకరించి కాలినడకన వారు బయలుదేరడం ఆనవాయితీ. తొలిరోజు రోళ్లగడ్డ, దేవళ్లగూడెం, లింగాల మీదుగా వెళ్లి కొడిశలలో బసచేస్తారు. రెండో రోజు పస్రా సమీపంలోని ఒడ్డుగూడెంలో బసచేస్తారు. మూడో రోజు మేడారంలోని సమ్మక్క గద్దెల మీదికి చేరుకుంటారు. అరెం వంశీయులు పగిడిద్ద రాజుతో మేడారం చేరుకున్న తర్వాత తొలి రోజు జాతర ప్రారంభమవుతుందని పూజారులు తెలిపారు. బుధవారం సారలమ్మ, గోవిందరాజు గద్దెలపైకి వచ్చే సమయానికి పగిడిద్దరాజు మేడారానికి చేరుకుంటారు. ఈ ముగ్గురు దేవతలను ఒకే సమయంలో అధికార లాంఛనాలతో గద్దెలపై చేర్చుతారు. దీంతో మహాజాతర ఆరంభమవుతుంది.

మార్గమధ్యలో గ్రామాలు ఇవే

మేడారం వెళ్లే దారిలో పూజారులకు 10 గ్రామాలు ఎదురవుతాయి. కర్లపల్లి, లక్ష్మీపురం, మొద్దులగూడెం, పస్రా, ప్రాజెక్టునగర్‌, వెంగ్లాపూర్‌, నార్లాపూర్‌, చింతల్‌ క్రాస్‌రోడ్డు, పడగాపూర్‌, జంపన్నవాగు మీదుగా చేరుకుంటారు.

రహస్య పూజల మధ్య

కాలినడక దారిలో ఎదురుపడే వాగులు, వంకల్లోని నీటిని దాటే ముందు ప్రత్యేకంగా జల పూజలు నిర్వహిస్తారు. గతంలో అధికారులు కాలినకన అంత దూరం నుంచి రావొద్దంటూ..ఏదైనా వాహనంలో రావాలని సూచించగా ఆచారం, సంప్రదాయాలను వదలబోమని చెప్పామని పూజారులు పేర్కొన్నారు. ఎంత కష్టమైనా కాలినడకనే పగిడిద్దరాజును గద్దెకు చేర్చడం తమ ఆచారమన్నారు. వెంగ్లాపూర్‌ చేరగానే పోలీసుల రోప్‌ పార్టీ పగిడిద్దరాజును బందోబస్తు మధ్య గద్దెల వద్దకు తీసుకెళ్తారు. దీంతో పగిడిద్దరాజు పూజారులు బహుదూరపు బాటసారులుగా జాతర చరిత్రలో నిలుస్తున్నారు.

70 కిలోమీటర్ల దూరం..

దట్టమైన అడవి గుండా 70 కిలోమీటర్ల దూరం 60 మంది పూజారులు పగడిద్దరాజును తీసుకెళ్తారు. నడకదారి లేకున్నా రాళ్లు రప్పలు దాటుతూ వెళ్తారు. 32 కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలోనే వీరి ప్రయాణం కొనసాగనుంది. మధ్యలో అడ్డొచ్చిన ఏడు వాగులు, వంకలను దాటుతారు. సుమారు 100 నుంచి 150 అడుగుల ఎత్తుతో నిటారుగా ఉన్న మూడు ఎత్తైన గుట్టలను ఎక్కి దిగుతారు. ఈ గుట్టల వద్దనే వీరికి అధిక సమయం పడుతుంది.

పగిడిద్దరాజు
లక్ష్మీపురం

జంపన్న రాక సైతం..

వనదేవతల మహాజాతర తొలిఘట్టం నేడు ప్రారంభం కానున్నది. సమ్మక్క దేవత, పగిడిద్దరాజుల పుత్రుడయిన జంపన్నను మంగళవారం సంప్రదాయ పద్ధతిలో తీసుకురానున్నారు. మేడారంలోని జంపన్నవాగు ఒడ్డున జంపన్నగద్దెపై జంపన్న కొలువుదీరి ఉన్న సంగతి తెలిసిందే. కన్నెపల్లికి చెందిన పోలెబోయిన సత్యం కుటుంబ సభ్యులు 2018 మహాజాతర నుంచి జంపన్నను గద్దెకు చేరుస్తున్నారు. అనధికారికంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి దేవాదాయశాఖ గుర్తింపు లేదు. అయినా పోలీసు యంత్రాంగం, ఆదివాసీ సంఘాలు జంపన్నను గద్దెకు చేర్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది.

ఎవరీ సమ్మక్క-సారలమ్మలు..

కాకతీయ సేనలు.. గిరిపుత్రులను వేధిస్తుంటే.. కత్తిపట్టి కదనరంగంలో దూకి వీర మరణం పొందిన ఆడబిడ్డలే సమ్మక్క-సారలమ్మలు. వందల ఏళ్లు దాటినా వారి త్యాగానికి జనం నీరాజనాలు పలుకుతూ దేవతలుగా పూజిస్తూ.. జాతర చేస్తున్నారు. 1944 వరకూ ఆదివాసీ గిరిజనులకే పరిమితమైనా.. ఆ తర్వాత జన జాతరగా మారిపోయింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందింది. మాఘ మాసంలో పౌర్ణమి రోజుల్లో ప్రతి రెండేళ్లోకోసారి.. ఈ జాతర జరుగుతుంది. మండ మెలిగే పండుగతో గత బుధవారం జాతర ప్రారంభమవగా.. వన దేవతల ఆగమనంతో.. అసలైన మహా జాతర మొదలు కానుంది.

ఇదీచూడండి: Head Constable Died in Medaram : గుండెపోటుతో మేడారం విధుల్లో ఉన్న హెడ్​కానిస్టేబుల్ మృతి

Last Updated :Feb 15, 2022, 3:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.