ETV Bharat / state

అసైన్డ్‌ ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ లేనట్లే!

author img

By

Published : Jan 5, 2021, 12:35 PM IST

ప్రభుత్వ అసైన్డ్‌ భూముల్లో ప్లాట్లకు రిజిస్ట్రేషన్ల నిలిపివేత యథావిధిగా కొనసాగనుంది. వీటిపై ఏడాదిన్నరగా ఆశలు పెట్టుకున్న వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. ఆదిలాబాద్ పాలనాధికారి కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో అధికారులు ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. అయితే ఈ భూముల్లో డీటీసీపీ ఆమోదం ఉన్న ప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. మరోపక్క ప్రైవేటు పట్టా భూముల్లోని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధన ఎత్తివేయడంతో రిజిస్ట్రేషన్లు జోరందుకున్నాయి.

assigned land registrations
assigned land registrations

రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ఆదిలాబాద్‌ జిల్లాలో ఎక్కువగా ప్రభుత్వ అసైన్డ్‌ భూములున్నాయి. జీవనోపాధి నిమిత్తం దశాబ్దాల కిందట సాగుకోసం ఇచ్చిన ఈ భూముల్లో కొంతకాలంగా స్థిరాస్తి వ్యాపారం మొదలైంది. గత ప్రభుత్వాలు జారీ చేసిన ప్రత్యేక ఉత్తర్వుల ప్రకారం 1954 కంటే ముందు అసైన్డ్‌ చేసిన భూములకు రెవెన్యూ పరంగా నిరభ్యంతర (ఎన్‌ఓసీ) పత్రాలు జారీ అయ్యాయి. దీంతో కొన్ని సంవత్సరాలుగా ఈ భూములను ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కొందరు ఎన్‌ఓసీ లేని భూముల్లోనూ ఇతర పట్టాల పేరుతో ప్లాట్లు చేసి అమ్మకాలు జరుపుతూ అక్రమ దందాను కొనసాగించారు.

ఎన్‌ఓసీలపై పేచి..

రెండు మూడు దశాబ్దాలుగా వీటికి ఎన్‌ఓసీలు జారీ అయ్యాయి. అప్పట్లో జిల్లా పాలనాధికారి నుంచి ఈ అసైన్డ్‌ భూములకు ఎన్‌ఓసీలు జారీ కాగా.. కొన్ని భూములకు జిల్లా సంయుక్త పాలనాధికారి, మరికొన్ని భూములకు ఆర్డీఓ, ఇంకొన్ని భూములకు తహసీల్దార్లు ఎన్‌ఓసీలు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. వీటిల్లోనూ నకిలీలు ఉన్నాయనే సందేహం వెలిబుచ్చుతూ రెండేళ్ల కిందట అప్పటి ఆదిలాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ జ్యోతి... జిల్లా పాలనాధికారికి నివేదించారు. దీనిపై అధ్యయనం చేసేందుకు అధికారులకు మూడు నెలలకు పైగా సమయం పట్టింది. ఎట్టకేలకు అప్పటి పాలనాధికారి దివ్యదేవరాజన్‌ ఎన్‌ఓసీ భూముల్లో రిజిస్ట్రేషన్లు నిలిపి వేయించారు. 2019 ఆగస్టు 5వ తేదీన దీనికి సంబంధించి ప్రత్యేక ఆదేశాలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి పంపించారు. ఫలితంగా దాదాపు ఏడాదిన్నరగా ఇవి నిల్చిపోయాయి..

పాత ఆదేశాలే అమలు...

తాజాగా ఎల్‌ఆర్‌ఎస్‌ లేని ప్లాట్లకు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు మొదలవడంతో మళ్లీ ఎన్‌ఓసీ భూముల వ్యవహారం తెరపైకి వచ్చింది. అధికారులు మాత్రం వీటి జోలికి వెళ్లడం లేదు. రెండ్రోజుల కిందట జిల్లా అదనపు పాలనాధికారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎన్‌ఓసీ భూములను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని ఆదేశించారని ఆదిలాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ ఫణీందర్‌ తెలిపారు. జిల్లా పట్టణ, ప్రణాళిక విభాగం (డిస్ట్రిక్‌ టౌన్‌ కంట్రీ ప్లానింగ్‌-డీటీసీపీ) ఆమోదం ఉండి, లేదా హైకోర్టు ఆదేశాలుంటే వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేస్తున్నట్లు వివరించారు. దీంతోపాటు ప్రభుత్వం ఈ ఎన్‌ఓసీ భూముల్లో ఇచ్చిన హౌజింగ్‌బోర్డు, హౌజింగ్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ, రాజీవ్‌స్వగృహ తదితర ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : కేటీఆర్‌ను సీఎం చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదు : బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.