ETV Bharat / state

Nagoba jatara 2022 : నాగోబా జాతర.. ఆలయానికి చేరుకున్న పవిత్ర జలాలు

author img

By

Published : Jan 28, 2022, 1:14 PM IST

Nagoba jatara 2022, nagoba arrangements
నాగోబా జాతర.. ఆలయానికి చేరుకున్న పవిత్ర జలాలు

Nagoba jatara 2022: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ఘట్టాలు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతరకు కావాల్సిన పవిత్ర జలాలను మెస్రం వంశీయులు ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలోని ఆలయానికి తీసుకొచ్చారు. ఈనెల 21 కాలినడకన పయనమై మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాలి గోదావరిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్ర దేవాలయానికి చేరుకున్నారు.

Nagoba jatara 2022: ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రత్యేక పూజలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాదేవిని మెస్రం వంశస్థులు భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. జాతరకు కావాల్సిన పవిత్ర జలాలను ఆలయానికి తీసుకొచ్చారు. ఈనెల 21 కాలినడకన పయనమై మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాలి గోదావరిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్ర దేవాలయానికి చేరుకున్నారు. పుష్యమాసంలో నిర్వహించే ప్రత్యేక పూజల్లో ఇవాళ ఉదయం నుంచే ఇంద్రాదేవికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. మెశ్రం వంశీయులు పండించిన వరి ధాన్యంతో దంపుడు బియ్యం, మినప్పప్పుతో తయారుచేసిన నైవేద్యాలను దేవికి సమర్పించారు. అనంతరం సామూహిక భోజనం చేసి ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా ఆలయ ప్రాంగణంలో మర్రి చెట్ల వద్దకు ప్రయాణమయ్యారు.

జాతర ప్రత్యేకతలేంటి..

కాలిక చెప్పుల్లేకుండా.. మెస్రం వంశీయులు నాగుపాముల్లా వంకలు తిరుగుతూ అడవి మార్గంలో తరలివెళ్తారు. జాతరలో భాగంగా గంగాజలం తీసుకురావడానికి ఇలా వెళ్తారు. తమతో పాటు చెట్టూ, పుట్ట, చేను పశుపక్షాదులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ జాతరకు శ్రీకారం చుడతారు. ఆత్మీయంగా పలకరించుకుంటూ ఏడాది పాటు ఎదురైన కష్టాలన్నీ మరిచి అమ్మవారి సన్నిధిలో ఆనందంగా గడుపుతారు. నియమ, నిష్టలను ప్రాణప్రదంగా భావించే మెస్రం వంశీయుల నాగోబా జాతరను ఘనంగా జరుపుకుంటారు.

మెస్రం వంశీయుల జీవనానికి నిలువుటద్దం...

నాగోబా జాతర మెస్రం వంశీయుల జీవన విధానం.. వారి ఆచార వ్యవహారాలకు ఇదో నిలువుటద్దం. దేశంలో ఏ ప్రాంతంలో ఉన్నవాళ్లైనా తరలివస్తారు. కొందరు ఎడ్లబళ్లపై చేరుకుంటారు. ప్రతిఏటా పుష్యమి శుక్లపక్షమి రోజున గంగాజలం కోసం 15 రోజుల పాటు కాలినడక సాగిస్తారు. గోదావరి జలాల సేకరణకు మంచిర్యాల జిల్లా జన్నారం పయనమయ్యారు. అక్కడ పవిత్ర గంగా జలాన్ని కడవల్లో నింపుకొని కేస్లాపూర్‌కు చేరుకుంటారు. పుష్యమి అమావాస్య రోజున అర్ధరాత్రి నాగదేవతను అభిషేకించి జాతర ప్రారంభిస్తారు.

నాగోబా జాతర కథేంటి?

ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం పూర్వం మెస్రం వంశీయుల్లో ఏడుగురు అన్నదమ్ములు కేస్లాపూర్‌లోని మేనమామ ఇంటికి వస్తారు. కష్టాల్లో ఉన్నా సాయం చేయలేదనే కోపంతో తన తండ్రిని చంపడానికి వస్తున్నారని భావించిన కూతురు ఇంద్రాదేవి పెద్దపులిగా మారి ఏడుగురి అన్నదమ్ముల్లో ఆరుగురిని హతమారుస్తుంది. చివరివాడు నాగేంద్రుడిని వేడుకోవడంతో ప్రాణాలతో బయటపడి కేస్లాపూర్‌ చేరుకుంటాడు. తనను కాపాడిన నాగేంద్రుడిని తమ గ్రామంలోనే కొలువుతీరాలని కోరుకోగా వెలసిన దేవతనే కేస్లాపూర్‌ నాగోబాగా ప్రసిద్ధి పొందింది.

కేస్లాపూర్‌ వేదికగా నాగోబా జాతర

నాగోబా మహాపూజతోనే మెస్రం వంశీయుల ఏడాదికాలపు జీవన ప్రస్థానం ప్రారంభమవుతుంది. పెళ్లి, పేరంటం, మంచి, చెడులతోపాటు కర్మకాండలు చేసి దైవాన్ని పూజిస్తారు. చనిపోయినవారికి నాగోబా సన్నిధానంలో కర్మకాండ చేయనంతవరకు పుణ్యప్రాప్తి లభించదనేది మెస్రం వంశీయుల నమ్మకం. దైవసన్నిధి చేరిన పూర్వీకులు.. కేస్లాపూర్‌ వేదికగా నాగోబా దేవతగా అవతరించారని వారిని పూజిస్తే ఎలాంటి ఆపద రాదని విశ్వసిస్తారు.

ఇదీ చదవండి: 'చెట్టు, పుట్ట, చేనుతో మమేకమే వారి జీవన విధానం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.