ETV Bharat / sports

మీరాబాయికి కోటి రూపాయల నజరానా

author img

By

Published : Jul 24, 2021, 9:50 PM IST

Updated : Jul 25, 2021, 6:22 AM IST

టోక్యో విశ్వక్రీడల్లో భారత్​కు తొలి పతాకాన్ని అందించిన వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్​ చానుకు.. సొంత రాష్ట్రం నుంచి భారీ నజరానా దక్కనుంది. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్​ సింగ్ కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించారు.

mirabai chanu
మీరాభాయ్ చాను

టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకంతో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన మీరాబాయి చానుకు మణిపుర్‌ సీఎం ఎన్‌ బీరెన్‌ సింగ్‌ భారీ నజరానా ప్రకటించారు. అసాధారణ ప్రతిభతో పతకం సాధించినందుకుగాను ఆమెకు రూ.కోటి నజరానాతో పాటు ఓ ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు సీఎం.. ఆమెతో వీడియోకాల్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా మీరాబాయి చాను తన విజయానందాన్ని ఆయనతో పంచుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించేందుకు ఇదో ఆరంభమని, రాబోయే రోజుల్లో బంగారు పతకాలు సాధిస్తానని చెప్పారు.

అనంతరం సీఎం బీరెన్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ''ఈ రోజు షిల్లాంగ్‌లో ఈశాన్య రాష్ట్రాల సీఎంల సమావేశంలో నీ గెలుపు గురించి అందరికీ వెల్లడించాను. అక్కడే ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా ఎంతో ఆనందించారు. దేశం గర్వించదగిన విషయమని ప్రశంసించారు. అమిత్‌ షాతో పాటు అంతా నిలబడి చప్పట్లతో అభినందనలు తెలిపారు'' అని వివరించారు.

ప్రస్తుతం రైల్వే టీసీగా పనిచేస్తున్న మీరాబాయి చానుకు ఆ ఉద్యోగానికి బదులుగా మరో కొత్త ఉద్యోగాన్ని రిజర్వు చేసి ఉంచుతున్నట్టు హామీ ఇచ్చారు. అమిత్‌ షాతో సమావేశమవుతానని, తనకో సర్‌ప్రైజ్‌ ఇస్తాం అంటూ ఆయన పేర్కొన్నారు.

Last Updated : Jul 25, 2021, 6:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.