ETV Bharat / sports

యూఎస్‌ ఓపెన్‌ షురూ.. ప్లిస్కోవా, కెర్బర్​ శుభారంభం

author img

By

Published : Sep 1, 2020, 7:51 AM IST

sports latest news
యుఎస్‌ ఓపెన్‌ షురూ.. ప్లిస్కోవా, కెర్బర్​ శుభారంభం

ఒకవైపు కరోనా పడగ... మరోవైపు వరుసపెట్టి వైదొలుగుతున్న స్టార్‌ క్రీడాకారులు.. అసలు టోర్నీ మొదలవుతుందా అనే సందేహం! మొదలైనా ఇబ్బందులు తప్పవన్న ఆందోళన..! ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో యూఎస్‌ ఓపెన్‌ షురూ అయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌లు లేకుండానే ఫ్లషింగ్‌ మెడోస్‌లో మళ్లీ ఆట మొదలైంది.. అనుక్షణం అప్రమత్తతతో.. అడుగడుగునా జాగ్రత్తలతో.. అభిమానులు లేకుండా యూఎస్‌ ఓపెన్‌ కొత్తగా కనిపించింది. తొలిరోజు టాప్‌ సీడ్‌ ప్లిస్కోవాతో పాటు కెర్బర్‌, క్విటోవా శుభారంభం చేశారు.

చాన్నాళ్ల తర్వాత మళ్లీ టెన్నిస్‌లో సందడి.. న్యూయార్క్​ వేదికగా యూఎస్‌ ఓపెన్‌ ఆరంభమైంది! సోమవారం, తొలిరోజు టాప్‌సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) కెర్బర్‌ (జర్మనీ) ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో ప్లిస్కోవా 6-4, 6-0తో కలినినా (ఆర్మేనియా)ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఏడు ఏస్‌లు కొట్టిన ఈ చెక్‌ అమ్మాయి.. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసింది. రెండో సెట్లో ఆమె కలినినాకు ఒక్క గేమ్‌ కూడా గెలిచే అవకాశాన్ని ఇవ్వలేదు.

మరోవైపు పదిహేడో సీడ్‌ కెర్బర్‌ 6-4, 6-4తో టామ్‌జనోవిచ్‌ (ఆస్ట్రేలియా)ను వరుస సెట్లలో ఓడించింది. ఈ మ్యాచ్‌లో 15 విన్నర్లు కొట్టిన కెర్బర్‌.. అయిదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసింది.

మ్లదనోవిచ్‌ (ఫ్రాన్స్‌) కూడా తొలి రౌండ్‌ దాటింది. ఆమె 7-5, 6-2తో బాప్టిస్టె (అమెరికా)ను ఓడించింది.

వోండ్రుసోవా 6-1, 6-4తో మినెన్‌ (జర్మనీ)పై గెలిచి రెండోరౌండ్‌ చేరగా.. క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌), గ్రెచెవా (రష్యా), గర్సియా (ఫ్రాన్స్‌), లొండెరొ (అర్జెంటీనా) ముందంజ వేశారు.

పురుషుల సింగిల్స్‌లో బోర్నా కొరిచ్‌ (క్రొయేషియా) తొలి రౌండ్‌ దాటాడు. అతను 7-5, 6-3, 6-1తో అండుజర్‌ (స్పెయిన్‌)ను ఓడించాడు.

కోర్టులు మారాయి:

ఆర్థర్‌ యాషె స్టేడియంలో కోర్టుల ఉపరితలాన్ని మార్చారు. ఇందుకు అధునాతన పొలిమర్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దీని వల్ల గతంలో పోలిస్తే 20-30 శాతం ఎక్కువ వేగంతో బంతి పరుగెత్తనుంది. 1978 తర్వాత కోర్టు ఉపరితలాన్ని మార్చడం ఇదే తొలిసారి.

హాక్‌ఐ లైవ్‌:

పెద్ద కోర్టులకు మాత్రమే ఈసారి లైన్‌ అంపైర్లు ఉంటారు. మిగిలిన చోట్ల లైన్‌ అంపైర్ల స్థానంలో 'హాక్‌ ఐ లైవ్'‌ను ఉపయోగించుకోనున్నారు. బంతి లైన్‌ బయట పడిందో లేదో ఛైర్‌ అంపైర్లు దీని ద్వారా తెలుసుకుంటారు.

ప్రైజ్‌ మనీ తగ్గింది:

ఈసారి క్వాలిఫయింగ్‌తో పాటు మిక్స్‌డ్‌ డబుల్స్‌ను తీసేశారు. పురుషులు, మహిళల డబుల్స్‌లో పాల్గొనే వారి సంఖ్యను సగానికి తగ్గించారు. మొత్తం ప్రైజ్‌మనీ తగ్గిపోయింది. సింగిల్స్‌ విజేతకు 28 కోట్లకు బదులు రూ.22 కోట్లే ఇవ్వనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.