ETV Bharat / bharat

ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత లోక్​సభ ఎన్నికల పోలింగ్ - Lok Sabha Elections 2024

author img

By ETV Bharat Telugu Team

Published : May 20, 2024, 6:07 PM IST

Updated : May 20, 2024, 10:56 PM IST

Lok Sabha Election Phase 5 Polling : సార్వత్రిక ఎన్నికల ఐదో విడత పోలింగ్‌ ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరిగింది. జమ్ముకశ్మీర్‌లో ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబయిలో రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు ఓటు వేశారు.

Lok Sabha Election Phase 5 Polling
Lok Sabha Election Phase 5 Polling (ANI)

Lok Sabha Election Phase 5 Polling : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదోవిడత పోలింగ్‌ ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49నియోజకవర్గాల్లో ఓటింగ్‌ జరిగింది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలు, మహారాష్ట్ర 13, బంగాల్‌ 7, బిహార్‌, ఒడిశాలో 5చొప్పున, ఝార్ఖండ్‌ 3, జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లో ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్‌ జరిగింది. జమ్ముకశ్మీర్‌లో ప్రజలు తెల్లవారుజాము నుంచే ఓటింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉండటం వల్ల సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత మధ్య పోలింగ్‌ నిర్వహించారు. బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గలో ఎన్‌సీ అభ్యర్థి, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అభ్యర్థి మీర్ మహ్మద్ ఫయాజ్, జేకేపీసీ అభ్యర్థి సజాద్ లోన్‌ల మధ్య పోటీ నెలకొంది.

ఓటేసేందుకు సినీనటులు క్యూ
అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గౌరీగంజ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిందే, శివసేన నేతలు ఉద్ధవ్‌ఠాక్రే, వ్యాపారవేత్తలు రతన్‌ టాటా, ముకేష్‌ అంబానీ, అనిల్‌ అంబానీ తదితరులు కుటుంబాలతో కలిసి ఓటు వేశారు. RBI గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌, హాకీ ఇండియా చీఫ్‌ దిలీప్‌ టిర్కీ ఓటు వేశారు. క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, కుమారుడితో కలిసి, అజింక్య రహానే భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటులు అమితాబ్‌ బచ్చన్‌, జాన్వీ కపూర్, దర్శకుడు జోయా అక్తర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాకీ బాగ్నానీ, సంజయ్‌ దత్‌, మనోజ్‌ బాజ్‌పేయ్‌, అనిల్‌ కపూర్‌, హేమా మాలిని తదితరులు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుని, ఓటు ఆవశ్యకతను వివరించారు. నాసిక్‌లో స్వతంత్ర అభ్యర్థి శాంతిగిరి మహారాజ్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన తర్వాత ఓటింగ్ యంత్రానికి పూలమాల వేశారు.

అమేఠీ, రాయ్​బరేలీపైనే ఫోకస్​
ఈ విడతలో పలు హై ప్రొఫైల్‌ నియోజకవర్గాలు ఉన్నాయి. రాయ్‌బరేలీలో రాహుల్‌ గాంధీతో బీజేపీ నేత దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌ తలపడుతున్నారు. అమేఠీలో స్మృతి ఇరానీ, కాంగ్రెస్‌ నేత కిషోర్‌ లాల్‌ శర్మ మధ్య పోటీ నెలకొంది. లఖ్‌నవూలో రాజ్‌నాథ్‌సింగ్‌, వర్సెస్‌ సమాజ్‌వాదీ నేత రవిదాస్‌ మహరోత్రా ప్రత్యర్థులుగా ఉన్నారు. పియూష్‌ గోయల్‌, రోహిణి ఆచార్య, చిరాగ్‌ పాసవాన్‌, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్‌ నికమ్‌ వంటి ప్రముఖుల భవితవ్యం ఐదో విడతలో తేలనుంది. మొత్తం 695మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

8.95 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 4.26 కోట్ల మంది మహిళలు ఉన్నారు. 5 వేల 409మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. వారి కోసం 94వేల 7వందల 32 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 543 లోక్‌సభ స్థానాలకు గానూ ఐదో విడత పోలింగ్‌తో 428 నియోజకవర్గాల్లో పోలింగ్‌ పూర్తయింది. ఒడిశాలోని 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ విడతలోనే పోలింగ్‌ జరిగింది. మే 25న ఆరో విడత, జూన్‌ 1న ఏడో విడత పోలింగ్‌ జరగనుంది.

లొంగిపోవాలని లష్కర్​ తొయిబా మిలిటెంట్​కు సోదరుడు విజ్ఞప్తి
మహారాష్ట్రలో ఓ అభ్యర్థి శాంతిగిరి మహరాజ్​ పోలింగ్ బ్యాలెట్​కు పూలదండ వేశారు. దీంతో త్రయంబకేశ్వర్​ పోలీస్​ స్టేషన్​లో ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు ఒడిశాలో ఒక అడుగు ఎత్తు ఉన్న మహిళ వనితా సేత్ (47) ఓటు హక్కు వినియోగించుకున్నారు. జర్మనీలో నివసిస్తున్న దంపతులు మని ప్రకాశ్, సుప్రియా శ్రీవాస్తవ బిహార్​లోని ముజఫరాపుర్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు జమ్ముకశ్మీర్​లో వింత ఘటన జరిగింది. లష్కరే తొయిబాలో ఉన్న తమ సోదరుడిని లొంగిపోవాలని కోరాడు ఓ వ్యక్తి. శాంతి కోసం ఈ పని చేయాలని అభ్యర్థించాడు. ఈ ఘటన బారాముల్ల లోక్​సభ నియోజకవర్గంలో జరిగింది.

Last Updated : May 20, 2024, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.