ETV Bharat / sports

AUS vs NZ Final: ఫైనల్లో సరైనోళ్లే.. ఎవరు గెలిచినా చరిత్రే!

author img

By

Published : Nov 13, 2021, 8:21 AM IST

Updated : Nov 13, 2021, 8:32 AM IST

AUS
ఆసీస్

టీ20 ప్రపంచకప్‌(t20 world cup 2021 final) విజేత ఎవరో మరొక్క రోజులో తేలిపోతుంది. టైటిల్ ఫేవరెట్లుగా బరిలో దిగిన టీమ్ఇండియా, ఇంగ్లాండ్, పాకిస్థాన్ ఇంటిదారి పట్టగా.. పొట్టి మెగాటోర్నీ టైటిల్ ఇప్పటివరకు గెలవని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్(aus vs nz final) ఫైనల్ చేరాయి. ఈ టోర్నీలో వీరి ఆటతీరు గమనిస్తే రెండు జట్లూ సమవుజ్జీవులుగా కనిపిస్తున్నాయి.

ఐదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ విజేత(t20 world cup 2021 final) ఎవరో మరొక్క రోజులో తేలిపోతుంది. టోర్నీ ఆరంభమైనపుడున్న అంచనాలు వేరు. టోర్నీ సాగిన తీరు వేరు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌, టైటిల్‌ ఫేవరెట్‌ అనుకున్న టీమ్‌ఇండియా సూపర్‌-12 దశను కూడా దాటలేదు. సూపర్‌-12లో ఘనవిజయాలతో ఫేవరెట్లుగా అవతరించిన ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ సెమీస్‌ గడప దాటలేకపోయాయి. ఇప్పటిదాకా కప్పు గెలవని, పెద్దగా అంచనాల్లేకుండా టోర్నీలో అడుగు పెట్టిన న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా(aus vs nz final) ఇప్పుడు కప్పు కోసం(t20 world cup 2021 final) కొట్లాడబోతున్నాయి. వీటి ఆట చూశాక సరైన జట్లే ఫైనల్‌ చేరాయన్న భావన కలుగుతోంది అందరికీ. టీమ్‌ఇండియా నిష్క్రమణతో కళ తప్పినట్లు కనిపించిన ప్రపంచకప్‌ రసవత్తర సెమీఫైనల్‌ సమరాలతో మళ్లీ అందరి దృష్టినీ ఆకర్షించి, క్రికెట్‌ ప్రపంచాన్ని ఏకం చేయడం కొసమెరుపు.

సమవుజ్జీవులు

టీ20 ప్రపంచకప్‌లో ప్రతికూల పరిస్థితులను దాటి.. ఫేవరెట్లను వెనక్కినెట్టి.. అంచనాలను మించి న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా(aus vs nz final) తుదిపోరుకు చేరాయి. టోర్నీలో జట్ల ప్రదర్శన పరంగా చూస్తే ఉత్తమంగా రాణించిన సరైన జట్లే ఫైనల్లో అడుగుపెట్టాయని అందరూ అంటున్నారు. సూపర్‌- 12 దశలో రెండు గ్రూపుల నుంచి అగ్రస్థానాల్లో నిలిచి ముందంజ వేసిన జట్లను కివీస్‌, ఆసీస్‌ ఓడించాయి. గ్రూప్‌-2లో అజేయంగా నిలిచిన పాకిస్థాన్‌పై విలియమ్సన్‌ సేన సంచలన విజయాన్ని అందుకుంది. మరోవైపు గ్రూప్‌-1లో దక్షిణాఫ్రికాతో ఓటమి మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ సత్తాచాటిన ఇంగ్లాండ్‌ను ఆసీస్‌ అనూహ్యంగా మట్టికరిపించింది. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా మారిన ఈ రెండు జట్లు.. ఇప్పుడు టైటిల్‌ పోరులో(t20 world cup 2021 final) సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి.

అంచనాలకు మించి..

ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల బ్యాటర్లున్న ఇంగ్లాండ్‌ ఈ సారి విజేతగా అవతరిస్తుంది.. జట్టు నిండా హిట్టర్లతో కూడిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ ముచ్చటగా మూడోసారి ఛాంపియన్‌గా నిలుస్తుంది.. అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తున్న టీమ్‌ఇండియా రెండో టైటిల్‌(t20 world cup 2021 final) ను ఖాతాలో వేసుకుంటుంది.. 2016 టీ20 ప్రపంచకప్‌ తర్వాత యూఏఈలో పొట్టి ఫార్మాట్లో ఓటమే ఎరుగని పాకిస్థాన్‌ కప్పు ఎగరేసుకుపోతుంది.. ఇలా టోర్నీ ఆరంభానికి ముందు కొనసాగిన చర్చల్లో టైటిల్‌ ఫేవరేట్లుగా వివిధ జట్ల పేర్లు వినిపించాయి. కానీ ఎవరు కూడా ఆస్ట్రేలియా కానీ లేదా న్యూజిలాండ్‌ కానీ ఈ సారి కప్పు అందుకుంటుందని చెప్పలేకపోయారు.

అనూహ్యంగా తెరపైకి..

అందుకు టోర్నీకి ముందు ఆ జట్ల ప్రదర్శనే కారణం. ఈ ప్రపంచకప్‌నకు ముందు ఆసీస్‌ వరుసగా ఐదు టీ20 సిరీస్‌ల్లో పరాజయం పాలైంది. మరోవైపు కివీస్‌ ప్రదర్శన కూడా ఆశాజకనంగా ఏమీ కనిపించలేదు. టీ20ల్లో బంగ్లాదేశ్‌పై తొలిసారి సిరీస్‌ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీలో అడుగుపెట్టిన ఆ జట్లు అనూహ్యంగా రాణించాయి. సూపర్‌- 12 దశలో తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఓటమి ఎదురైనప్పటికీ ఆ తర్వాత బలంగా పుంజుకున్న కివీస్‌.. భారత్‌తో సహా వరుసగా నాలుగు జట్లను ఓడించింది. మరోవైపు పటిష్ఠమైన జట్లతో నిండి ఉన్న గ్రూప్‌- 1లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆసీస్‌.. ఆ తర్వాత ఇంగ్లాండ్‌ చేతిలో ఓడినప్పటికీ తిరిగి చివరి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి ముందంజ వేసింది. సరైన సమయంలో వార్నర్‌తో సహా ప్రధాన ఆటగాళ్లు ఫామ్‌ అందుకోవడం ఆసీస్‌కు కలిసొచ్చింది. దూకుడుకు ప్రశాంతతను జతచేసి కివీస్‌ సమష్టిగా రాణించింది. ఆసీస్‌, కివీస్‌ రెండింటికీ యూఏఈ వేదికలు అంత కలిసొచ్చేవి కావు. ఇక్కడి స్పిన్‌ పిచ్‌లపై వాటికి పట్టు చిక్కడం కష్టమే అనుకున్నారు. కానీ ఆరంభంలో తడబడ్డా.. ఆపై పట్టుదలతో పోరాడి పిచ్‌లపై పట్టు సాధించాయి. కఠిన ప్రత్యర్థులను ఓడించి ఫైనల్లో అడుగు పెట్టాయి. మంచి ఊపుమీదున్న జట్లతో హోరాహోరీ మ్యాచ్‌ల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఒత్తిడిని తట్టుకుని నిలబడి మ్యాచ్‌లను గెలవడం ద్వారా ఫైనల్‌(aus vs nz final) ఆడేందుకు తాము అన్ని విధాల అర్హులమని చాటాయి.

ఆసక్తి పోయిందనకుంటే..

టైటిల్‌ ఫేవరేట్లలో ఒకటిగా అడుగుపెట్టిన టీమ్‌ఇండియా తొలి మ్యాచ్‌లో పాక్‌ చేతిలో ఓడడం వల్ల భారత అభిమానులు తీవ్ర ఆవేదన చెందారు. రెండో మ్యాచ్‌లో కివీస్‌ చేతిలో ఓడి సెమీస్‌ ఆశలు దాదాపుగా చేజార్చుకున్న కారణంగా ఈ ప్రపంచకప్‌పైనే ఆసక్తి కోల్పోయారు. కానీ హోరాహోరీగా సాగిన రెండు సెమీస్‌ మ్యాచ్‌లు తిరిగి టోర్నీ వైపు కళ్లు తిప్పేలా చేశాయి. అందుకు కచ్చితంగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా కారణం(t20 world cup 2021 final). రెండు సెమీస్‌ మ్యాచ్‌లూ కూడా ఒకే రకమైన ఉత్కంఠతో దాదాపుగా ఒకేలా సాగడం విశేషం. మొదట ఇంగ్లాండ్​పై మిచెల్‌, నీషమ్‌ మెరుపులతో ఛేదనలో కివీస్‌ 19వ ఓవర్లో గెలుపు అందుకోగా.. రెండో సెమీస్‌లో పాకిస్థాన్​పై స్టోయినిస్‌, వేడ్‌ మెరుపులతో ఆసీస్‌ కూడా 19వ ఓవర్లోనే నెగ్గింది. రెండు జట్లూ ఓ దశలో ఓటమి దిశగా సాగి ఆఖర్లో సంచలన ప్రదర్శనతో అద్భుత విజయాలు అందుకున్నాయి. దీంతో టోర్నీపై మళ్లీ ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. తుదిపోరులో ఏ జట్టు గెలిచినా దాని ఖాతాలో తొలిసారి టీ20 ప్రపంచకప్‌ చేరనుంది. మరి వన్డేల్లో రికార్డు స్థాయిలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన కంగారూ జట్టు పొట్టి కప్పు బోణీ కొడుతుందా? లేదా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచిన కివీస్‌ అదే జోరులో తొలిసారి టీ20 ఛాంపియన్‌గా(t20 world cup 2021 final) నిలుస్తుందా? అన్నది చూడాలి.

ఇవీ చూడండి: 'వన్డే, టెస్టుల్లోనూ కోహ్లీ కెప్టెన్సీ వదులుకుంటాడు!'

Last Updated :Nov 13, 2021, 8:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.