టోక్యో ఒలింపిక్స్ (Tokyo Olympics) కోసం భారత్ నుంచి బయల్దేరిన క్రీడాకారుల తొలి బృందం(First batch of Indian athletes) ఆదివారం ఉదయం అక్కడికి చేరుకుంది. ఈ విషయాన్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్) వెల్లడించింది. ఈ బృందంలో మొత్తంగా 88 మంది ఉండగా.. వారిలో 54 మంది అథ్లెట్లు ఉన్నారు.
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం రాత్రి.. ఈ బృందానికి క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, ఐఓఏ అధ్యక్షుడు నరిందర్ బత్రా తదితరులు వీడ్కోలు పలికారు. ఎనిమిది క్రీడలు.. ఆర్చరీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, హాకీ, జూడో, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్, వెయిట్లిఫ్టింగ్కు చెందిన 88 సభ్యుల బృందంలో 54 మంది అథ్లెట్లతో పాటు సహాయ సిబ్బంది, ఐఓఏ ప్రతినిధి ఉన్నారు. ఇందులో హాకీ క్రీడాకారులే ఎక్కువ.
తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు పి.వి. సింధు, సాయి ప్రణీత్, సాత్విక్ సాయిరాజ్ శనివారం బయల్దేరి వెళ్లిన బృందంలో ఉన్నారు. టీటీ క్రీడాకారులు మనిక బత్రా, శరత్కమల్, ఆర్చర్లు దీపికా కుమారి, అతాను దాస్, జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ తదితరులు కూడా ఈ బృందంలోనే ఉన్నారు.
భారత్ నుంచి ఒలింపిక్స్ బరిలోకి ఉన్న ఏకైక వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శుక్రవారమే అమెరికా నుంచి టోక్యోకు చేరుకుంది. ఆమెతో పాటు జాతీయ కోచ్ విజయ్ శర్మ, సహాయ కోచ్ సందీప్ కుమార్ ఉన్నారు. మరో సహాయ కోచ్ ప్రమోద్ శర్మ భారత తొలి బృందంతో కలిసి వెళ్లాడు.
ఈ ఒలింపిక్స్కు భారత్ నుంచి మొత్తం 228 మంది బృందం వెళ్తోంది. ఇందులో 119 మంది క్రీడాకారులు ఉన్నారు. భారత రోయింగ్, షూటింగ్ జట్లు ఇప్పటికే టోక్యో చేరుకున్నాయి. మరోవైపు ఇటలీ నుంచి బయల్దేరిన బాక్సింగ్ బృందం ఆదివారం చేరుకుంటుంది. భారత్ నుంచి నలుగురు సెయిలర్లతో కూడిన బృందం తొలుత టోక్యోలో అడుగుపెట్టింది. గురువారమే సెయిలర్లు అక్కడికి చేరుకున్నారు.
ఇదీ చూడండి.. టోక్యోకు బయలుదేరిన భారత క్రీడాకారుల బృందం