ETV Bharat / sports

'కావాలనే ఆయనపై కేసు పెట్టాం'.. బ్రిజ్​ భూషణ్​పై​ ఫిర్యాదుపై మైనర్ తండ్రి

author img

By

Published : Jun 9, 2023, 6:54 AM IST

Updated : Jun 9, 2023, 8:04 AM IST

WFI Chief Brijbushan : రెజ్లింగ్‌ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై తాము ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు పెట్టామంటూ మైనర్‌ రెజ్లర్‌ తండ్రి అంగీకరించారు. ఈ విషయాన్ని ఓ వార్త సంస్థకు తెలిపారు.

wfi chief brijbushan
బ్రిజ్‌ భూషణ్‌

Wrestlers vs WFI : భారత రెజ్లర్ల సమాఖ్య చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌పై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం జరిగింది. బ్రిజ్‌ భూషణ్​పై తప్పుడు ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేశారని మైనర్‌ బాలిక తండ్రి వెల్లడించారు. తాము ఉద్దేశపూర్వకంగా ఆయనపై తప్పుడు కేసు పెట్టామని మైనర్‌ రెజ్లర్‌ తండ్రి అంగీకరించారు. గతేడాది ఆ బాలిక ఒక పోటీకి భారత జట్టు తరఫున ఎంపిక కాలేదన్న అక్కసుతోనే సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలను చేసినట్లు గురువారం ఒక వార్తాసంస్థకు తెలిపారు.

నిజం బయటికి రావాలని..
ఇటీవలే మైనర్‌ బాలిక తండ్రి ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు మీ వాదనను మార్చుకుంటున్నారని విలేకరి అడిగిన ప్రశ్నకు.. నిజం ఇప్పటికైనా బయటికి రావాలని కోరుకుంటున్నానన్నారు. "నిజం కోర్టులో కంటే ముందే బయటికి రావడం మంచిదని భావిస్తున్నా. ఇప్పటికే ప్రభుత్వం రెజ్లర్లతో చర్చలు ప్రారంభించింది. గతేడాది ఆసియా అండర్‌-17 ఛాంపియన్‌షిప్‌ ఎంపికల్లో నా కూతురు ఓటమిపై ప్రభుత్వం న్యాయ విచారణ జరుపుతామని హామీ ఇచ్చింది. అందువల్ల, ఇప్పుడు తప్పును సరిదిద్దుకోవడం నా బాధ్యత" అని మైనర్‌ బాలిక తండ్రి వ్యాఖ్యానించారు.

అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నా
బ్రిజ్‌భూషణ్‌పై తనకు, తన కుమార్తెకు ఉన్న ఆగ్రహానికి గల కారణాన్ని కూడా ఈ సందర్భంగా బాలిక తండ్రి బయటపెట్టాడు. "2022 అండర్‌-17 ఆసియా ఛాంపియన్‌షిప్‌ పోటీలకు భారత రెజ్లర్ల ఎంపికలు లఖ్‌నవూ వేదికగా జరిగాయి. ఆ సమయంలో జరిగిన ఫైనల్స్‌లో నా కుమార్తె ఓటమిపాలైంది. దాని వల్ల అండర్‌-17 పోటీలకు భారత్‌ తరఫున నా కుమార్తె పాల్గొనలేకపోయింది. ఆ పోటీల్లో రిఫరీ తీసుకున్న నిర్ణయానికి బ్రిజ్‌ భూషణ్ కారణమని అప్పట్లో కొందరు ఆరోపించారు. దీంతో నా కుమార్తె ఓ ఏడాది పాటు పడిన కష్టమంతా వృథా అయిపోయింది. అందుకే బ్రిజ్‌ భూషణ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నాను" అని మైనర్ బాలిక తండ్రి చెప్పారు.

'అంతా కోర్డు ముందే ఉంది'
మైనర్​ తండ్రి చేసిన వ్యాఖ్యల పట్ల బ్రిజ్​ భూషణ్​ స్పందిచారు. అన్ని విషయాలు కోర్టు ముందు ఉన్నాయని.. ఇక కోర్టు తన పని తాను చేస్తుందని ఆయన అన్నారు. "అన్ని విషయాలు కోర్టు ముందు ఉన్నాయి. జూన్ 15 లోగా ఛార్జిషీట్ దాఖలు చేస్తామని ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. ఛార్జిషీట్ దాఖలు అవ్వనివ్వండి. నేను ఈ సమయంలో ఏం చెప్పకూడదని అనుకుంటున్నాను. కోర్టు తన పని తాను చేస్తుంది" అని బ్రిజ్​ భూషణ్​ అన్నారు.

బ్రిజ్​ భూషణ్​ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మహిళా రెజ్లర్లు గత కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ ఫిర్యాదును దిల్లీ పోలీసులు పట్టించుకోవట్లేదని, బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్ట్‌ చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో మహిళా రెజ్లర్లు దిల్లీలోని జంతర్‌మంతర్‌ ఎదుట ఆందోళన చేశారు. దీంతో సుప్రీం కోర్టు ఆదేశాల మేర మహిళా రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదుతో బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదైంది. ఫిర్యాదు చేసిన వారిలో మైనర్‌ బాలిక ఉండటం వల్ల బ్రిజ్‌ భూషణ్‌పై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదైంది.

Last Updated : Jun 9, 2023, 8:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.