ETV Bharat / sports

T20 worldcup: కోహ్లీ.. ఆ ఒక్కటి కూడా పూర్తి చేసేశాడుగా!

author img

By

Published : Oct 24, 2022, 12:39 PM IST

T20 worldcup kohli
టీ20 ప్రపంచకప్​ కోహ్లీ

మూడేళ్లుగా ఫామ్​లో లేని కోహ్లీ కొద్ది రోజుల నుంచి మెల్లమెల్లగా మునపటి లయను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే అప్ఘాన్​పై సెంచరీతో మళ్లీ ఫామ్​లోకి వచ్చిన అతడు తాజాగా టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో విరోచితంగా పోరాడి జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. ఈ నేపథ్యంలో అతడి గురించి ఓ ప్రత్యేక కథనం మీకోసం..

టీ20 ప్రపంచకప్​లో భాగంగా పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో ఒత్తిడిని తట్టుకొని ఛేజింగ్‌ చేసి ప్రత్యర్థిని ఎలా చిత్తుచేయాలో కోహ్లీ ప్రాక్టికల్‌గా చూపించాడు. యువక్రికెటర్లకు ఈ ఇన్నింగ్స్‌ నిస్సందేహంగా ఓ పాఠం. తరానికొక్కటిగా నిలిచే ఇన్నింగ్స్‌ను ఆడి భారత్‌కు అపూర్వ విజయాన్ని అందించాడు.

"మూడేళ్లు మూడంకెల స్కోర్‌ చేయని ఏ ఆటగాడైనా జట్టులో కొనసాగడం కష్టం. అయితే.. విరాట్‌కే అది సాధ్యమైంది".. 71వ శతకం పూర్తి చేశాక ఓ మాజీ నుంచి వచ్చిన వెటకారంతో కూడిన ప్రశంస ఇది..! మరోవైపు 'ఆ..అఫ్గాన్‌ మీద శతకమేగా..' అంటూ విరాట్‌పై హేటర్స్‌ చిన్నచూపు..! ఇక ఆచితూచి ఆడుతూ ఆసియాకప్‌లో మంచి స్కోర్లు చేస్తున్న సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉండే 'కింగ్‌' బాడీ లాంగ్వేజ్‌ కనిపించలేదు. దీంతో 'ఒక్కటి తగ్గింది' అని అభిమానులు కలవరపడుతున్న సమయం..! రెండు పర్యటనలకు విశ్రాంతి తీసుకొని.. మునపటి లయను అందిపుచ్చుకోవడానికి విరాట్‌ మెల్లగా అడుగులు వేస్తున్న సమయంలో వినిపించిన కామెంట్లివీ..!

విశ్వరూపం.. తాజాగా పాకిస్థాన్‌పై మెల్‌బోర్న్‌లో జరిగిన మ్యాచ్‌లో 'కింగ్‌ కోహ్లీ' ఒక్కసారిగా తన విశ్వరూపం చూపించాడు. ఈ ఆట మొత్తంలో విరాట్‌ బాడీలాంగ్వేజ్‌ ఓ ఛాంపియన్‌లా ఉంది. కళ్లముందే టీమ్‌ఇండియా టాప్‌ ఆర్డర్‌ పేకమేడలా కూలుతున్నా.. ప్రశాంతంగా ఉన్నాడు. ఏడు ఓవర్లకు టీమిండియా స్కోర్‌ 33/4 వద్ద హార్దిక్‌తో శతక భాగస్వామ్యానికి పునాదులు వేయడం మొదలుపెట్టాడు. పది ఓవర్లు ముగిసేసరికి విరాట్‌ 21 బంతుల్లో 12 పరుగులు మాత్రమే సాధించాడు. ఒక్క ఫోర్‌గానీ, సిక్స్‌గానీ లేదు. ఈ రన్‌రేట్‌ చూసి.. టెస్టు మ్యాచ్‌ ఆడుతున్నారా ఏంటీ..? అనుకొంటూ అభిమానులు నీరసపడి పోయారు. ఈ సమయంలో విరాట్‌పై ఒత్తిడి పెంచేందుకు పాక్‌ 11 ఓవర్‌లో నవాజ్‌ బౌలింగ్‌లో ఓ క్యాచ్‌ అప్పీల్‌ రివ్యూకి తీసుకెళ్లింది. కోహ్లీ ముఖంలో ఏ మాత్రం టెన్షన్‌ కనిపించలేదు. అతడు ఊహించినట్లే.. నిర్ణయం పాక్‌కు ప్రతికూలంగా వచ్చింది. ఆ తర్వాతి బంతిని లాంగ్‌ ఆన్‌ మీదుగా సిక్సర్‌ కొట్టి బౌలర్‌ ఆత్మవిశ్వాసాన్ని పటాపంచలు చేశాడు.

T20 worldcup kohli
టీ20 ప్రపంచకప్​ కోహ్లీ

ఊచకోత.. ఇక అక్కడి నుంచి ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు.. కోహ్లీ బాడీ లాంగ్వేజ్‌ కూడా ఒక్కసారిగా దూకుడుగా మారిపోయింది. షాట్లు కొట్టినప్పుడల్లా హార్దిక్‌తో ఫిస్ట్‌ బంప్స్‌ కొడుతూ.. గాల్లోకి పంచ్‌లు విసురుతూ విరాట్‌ సమరోత్సాహంతో కనిపించాడు. 11-16 ఓవర్ల మధ్యలో కోహ్లీ 18 బంతులు ఆడి 31 పరుగులు చేశాడు. దానిలో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. ఆ ఓవర్లలో స్ట్రైక్‌ రేటు 172..! ఇక డెత్‌ ఓవర్లు వచ్చేటప్పటికి కోహ్లీలోని 'కింగ్‌' బయటకు రావడంతో పాక్‌ బౌలింగ్‌ దళం కకావికలమైంది. 17-20 ఓవర్ల మధ్యలో 14 బంతులు ఆడిన కోహ్లీ ఏకంగా 278 స్ట్రైక్‌ రేట్‌తో 39 పరుగులు చేశాడు. వీటిల్లో మూడు ఫోర్లు.. మూడు సిక్స్‌లు ఉండటం కింగ్‌ ఊచకోతను తెలియజేస్తోంది. ఒత్తిడిలో చెలరేగిపోవడం విరాట్‌ సహజశైలి..! గత మూడేళ్లుగా మిస్సైన ఆ ఆత్మవిశ్వాసాన్ని విరాట్‌ మళ్లీ అందిపుచ్చుకొన్నాడు.

పాక్‌పై పంచ్‌.. ఇటీవల ఓ ప్రాక్టిస్‌ మ్యాచ్‌లో షహీన్‌ అఫ్రిది ఓ అఫ్గాన్‌ బ్యాటర్‌ను గాయపర్చాడు. భారత బ్యాటర్లకు ఈ గతి తప్పదంటూ మ్యాచ్‌కు ముందు పాక్‌ మాజీలు హేళనకు దిగారు. షహీన్‌ బౌలింగ్‌ను మెల్‌బోర్న్‌ పిచ్‌పై ఎదుర్కోవడం ఆషామాషీ కాదు. కానీ.. అవతల ఉన్నది కోహ్లీ. షహీన్‌ బౌలింగ్‌ను ఉతికారేశాడు. అదీ ఒత్తిడితో కూడిన డెత్‌ ఓవర్లలో..! వాస్తవానికి భారత్‌ సాధించాల్సిన రన్‌రేట్‌ బాగా పెరుగుతుండటంతో.. చివరి ఓవర్‌ కంటే ముందే మ్యాచ్‌ను ముగించేలా పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ప్లాన్‌ చేశాడు. ఈ క్రమంలో షహీన్‌, రవూఫ్‌ల చేత 18, 19 ఓవర్లు వేయించాడు. కోహ్లీ హిట్టింగ్‌ దెబ్బకు ఈ వ్యూహం బెడిసికొట్టింది. 18వ ఓవర్లో మూడు ఫోర్లు, 19వ ఓవర్లో రెండు సిక్స్‌లతో పాక్‌ ప్రధాన బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫలితంగా చివరి ఓవర్‌ స్పిన్నర్‌ నవాజ్‌ చేత వేయించాల్సి వచ్చింది.

ఏకాగ్రతతో.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఏకాగ్రత ఎక్కడా చెక్కు చెదరలేదు. మిడిల్‌ ఓవర్లలో పాండ్యాతో కలిసి వికెట్‌ పడకుండా సింగిల్స్‌, డబుల్స్‌ తీస్తూ స్కోర్‌ బోర్డును కదిలించాడు. చివరి రెండు ఓవర్లలో కూడా లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన షాట్లను అత్యంత కచ్చితత్వంతో ఆడాడు. టార్గెట్‌ను ఎలా ఛేజ్‌ చేయాలనే దానిపై అతడి బ్రెయిన్‌లో స్పష్టమైన ప్లాన్‌ ఉన్నట్లు కనిపించింది. రవూఫ్‌ ఓవర్‌ ముగుస్తుండగా.. చివరి ఓవర్‌లో అవసరమైన రన్‌రేట్‌ ఒత్తిడి పెరగనీయకుండా రెండు సిక్సులు బాదాడు. 19.4 ఓవర్లో కోహ్లీ బౌల్డ్‌ అయిన బంతి నోబాల్‌. అంపైర్‌ దానిని డెడ్‌బాల్‌గా ప్రకటిస్తారన్న ఆశతో పాక్‌ ఫీల్డర్లు వదిలేశారు. కోహ్లీ మాత్రం దాని నుంచి మూడు పరుగులు రాబట్టాడు.

ఈ ఇన్నింగ్స్‌ మొత్తంలో విరాట్‌ ఫిట్‌నెస్‌ కూడా కీలక పాత్ర పోషించింది. కోహ్లీ వికెట్ల మధ్య పరుగులు తీసే సమయంలో చాలా చురుగ్గా ఉన్నాడు. 2021-2022లో ఒక్కసారి కూడా ఫిట్‌నెస్‌ విషయంలో.. విరాట్‌ నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి వెళ్లలేదు. కాదు.. కాదు.. అసలు ఆ అవసరమే రానీయకుండా ఫిట్‌నెస్‌ను మెరుగుపర్చుకొన్నాడు.

ఇదీ చూడండి: ఆ ఎన్నికలకూ దూరం.. కొత్త ఇన్నింగ్స్ అంటూ మరో ట్విస్ట్.. గంగూలీ ప్లాన్ ఏంటో?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.