ETV Bharat / sports

eng vs ind: '2008లో ఇంగ్లాండ్ చేసిన పనిని టీమ్​ఇండియా మరవొద్దు'

author img

By

Published : Sep 10, 2021, 6:56 PM IST

eng vs ind 5th test
మాంచెస్టర్ టెస్టు

మాంచెస్టర్​ టెస్టును రద్దు చేసేందుకు బీసీసీఐ, ఈసీబీ (eng vs ind) అంగీకరించాయి. ఈ మ్యాచ్​ను రీషెడ్యూల్​ చేయాలనే బీసీసీఐ ప్రతిపాదనను స్వాగతించాడు టీమ్​ఇండియా మాజీ సారథి సునీల్ గావస్కర్. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ మ్యాచ్​ను ఆడొచ్చని సూచించాడు.

ఇంగ్లాండ్​తో రద్దైన ఐదో టెస్టును రీషెడ్యూల్​ చేయాలనే బీసీసీఐ (eng vs ind) ప్రతిపాదనను స్వాగతించాడు టీమ్​ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. 2008లో ఇంగ్లాండ్​ చూపిన సానుకూల ధోరణిని మరచిపోకూడదని చెప్పాడు. నవంబర్​ 26న ముంబయి ఉగ్రదాడి తర్వాత టెస్టు సిరీస్​ కోసం ఇంగ్లాండ్​ మళ్లీ భారత్​కు తిరిగొచ్చిందని గుర్తుచేశాడు.

ఇదీ జరిగిందీ..

2008లో దాడులు ప్రారంభమైన రోజున (నవంబర్​ 26) కటక్​లో భారత్​, ఇంగ్లాండ్ వన్డే మ్యాచ్ జరుగుతోంది. 7మ్యాచ్​ల సిరీస్​లో భాగంగా చివరి రెండు వన్డేలను రద్దు చేయడం వల్ల ఇంగ్లీష్ క్రికెటర్లు​ స్వదేశానికి వెళ్లిపోయారు. దీంతో ఆ తర్వాత జరగాల్సిన 2మ్యాచ్​ల టెస్టు సిరీస్​పై సందిగ్ధత నెలకొంది.

అయితే టెస్టు సిరీస్​ ఆడటానికి మళ్లీ భారత్​కు తిరిగొచ్చింది ఇంగ్లాండ్. తొలుత అనుకున్న షెడ్యూల్​ ప్రకారం అహ్మదాబాద్​, ముంబయిలో కాకుండా అహ్మదాబాద్​, చెన్నైకి వేదికలను మార్చారు. ఈ సిరీస్​లో కెవిన్ పీటర్సన్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టును 1-0తో టీమ్​ఇండియా ఓడించింది.

"మాంచెస్టర్ టెస్టును రీషెడ్యూల్​ చేయడం సరైన నిర్ణయం. 26/11 దాడి తర్వాత ఇంగ్లాండ్ చేసిన పనిని భారత్ మర్చిపోకూడదు. వారు తిరిగొచ్చారు. 'భారత్​లో భద్రత ఉంటుందని భావించడం లేదు. అందుకే మేము రావడం లేదు' అని చెప్పే పూర్తి హక్కు నాడు ఇంగ్లాండ్​కు ఉంది. కానీ, కెవిన్ పీటర్సన్​ అలా జరగనివ్వలేదు. అతడే అందరితో మాట్లాడి మ్యాచ్​ ఆడటానికి ఒప్పించాడు. అందుకు ఈసీబీని కూడా అభినందించాలి."

- సునీల్ గావస్కర్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

వచ్చే ఏడాది ఆడొచ్చు..

పరిమిత ఓవర్ల సిరీస్​ కోసం 2022 జులైలో టీమ్​ఇండియా.. ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ రద్దు అయిన టెస్టు ఆడొచ్చని గావస్కర్ సూచించాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్​తో 3 వన్డేలు, 3 టీ20లు షెడ్యూల్​ను ఈసీబీ నిర్ధరించింది. జూన్​లో ఐపీఎల్​ ముగిశాక కొద్ది రోజులు ముందుగానే ఇంగ్లాండ్​ వెళ్లి.. షెడ్యూల్​కు ముందుగానీ, తర్వాత గానీ టెస్టు ఆడవచ్చని సన్నీ అన్నాడు.

మాంచెస్టర్ టెస్టు ఎందుకు రద్దు అయ్యింది?

సెప్టెంబర్ 10న మాంచెస్టర్​లో ప్రారంభానికి కొన్ని గంటల ముందే టెస్టు రద్దు అయ్యింది. టీమ్​ఇండియా అసిస్టెంట్ ఫిజియో యోగేశ్ పర్​మార్​ గురువారం కరోనా బారినపడ్డాడు. ఆర్​టీపీసీఆర్ తొలి రౌండ్​లో భారత క్రికెటర్​లకు నెగిటివ్​ వచ్చినప్పటికీ, వైరస్​ భయాల కారణంగా మ్యాచ్​ను రద్దు చేసేందుకు బీసీసీఐ, ఈసీబీ అంగీకరించాయి. బోర్డుల మధ్య ఇలాంటి సన్నిహిత సంబంధాలు హర్షణీయమని సన్నీ అన్నాడు.

IND Vs ENG: ఐదో టెస్టు నిర్వహణపై త్వరలోనే స్పష్టత!ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.