టీ20 ప్రపంచకప్​ జట్టుపై మాజీల విశ్లేషణ.. ఏం అంటున్నారంటే?

author img

By

Published : Sep 13, 2022, 4:03 PM IST

t20 worldcup

టీ20 ప్రపంచకప్ కోసం ప్రకటించిన టీమ్​ఇండియా జట్టుపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఏమన్నారంటే..

టీ20 ప్రపంచకప్​ కోసం టీమ్​ఇండియా ఆటగాళ్లు, స్టాండ్‌బైల ఎంపికపై విమర్శలు వస్తున్నాయి. ఈ టీమ్‌లోకి సంజూ శాంసన్‌ను తీసుకోకపోవడం.. అంతగా రాణించని రిషభ్‌ పంత్‌, దీపక్ హుడాలకు స్థానం కల్పించడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే, ఐపీఎల్​ గత సీజన్‌లో అద్భుత ఫినిషర్‌గా పేరొందిన టీమ్‌ ఇండియా సీనియర్ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ను ఎంపిక చేయడంపై ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తుది జట్టు ఎంపికపై మాజీలు స్పందించారు. తమ అభిప్రాయాలను తెలిపారు.

సునీల్​ గావస్కర్​ మాట్లాడుతూ.. మెగా ఈవెంట్‌లో విజయం సాధించాలంటే కొన్ని రిస్క్‌లు చేయాల్సిన అవసరం ఉందని గావస్కర్‌ పేర్కొన్నాడు. తాను సారథి అయితే వచ్చే ప్రపంచకప్‌లో రిషభ్‌ పంత్‌తోపాటు దినేశ్ కార్తిక్‌కు తుది జట్టులో స్థానం కల్పిస్తానని తెలిపాడు. "నేను రిషభ్‌ పంత్‌, దినేశ్ కార్తిక్‌లను తుది జట్టులో ఆడిస్తా. పంత్‌ ఐదో స్థానంలో.. హార్దిక్‌ పాండ్య ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు పంపిస్తా. అవసరమైతే వీరిద్దరి స్థానాలను అటుఇటు మారుస్తా. ఇక దినేశ్ కార్తిక్‌ను లోయర్‌ ఆర్డర్‌లో ఏడో స్థానంలో ఆడిస్తా. హార్దిక్‌ కాకుండా మరో నలుగురు కీలక బౌలర్లను తీసుకుంటా. మెగా ఈవెంట్‌లో రిస్క్‌ తీసుకోకపోతే విజయాలను సాధించడం కష్టం. అన్ని విభాగాల్లోనూ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటేనే ఫలితం అనుకూలంగా వస్తుంది" అని గావస్కర్‌ వివరించాడు.

బౌలింగ్ దళం గురించి మాట్లాడాతూ.. గాయాల నుంచి కోలుకొని జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ జట్టులోకి రావడం శుభపరిణామమని సునిల్ తెలిపాడు. బౌలింగ్‌ దళం బలంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నాడు. "ప్రపంచకప్‌ కోసం ఎంపిక చేసిన జట్టు బాగుంది. సమతూకంగా ఉన్నట్లు అనిపిస్తోంది. అందుకే ఈసారి టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ను గెలిచే అవకాశం ఉందని భావిస్తున్నా. ఆసియా కప్‌లో జరిగిందంతా భారత్‌కు ఓ హెచ్చరిక. అయితే, వరల్డ్‌ కప్‌తో టీమ్‌ఇండియా తిరిగి వస్తుందని బలంగా నమ్ముతున్నా. బీసీసీఐ ఎంపిక చేసిన జట్టుకు మనమంతా మద్దతుగా నిలవాలి. ఆసియా కప్‌లో సరైన బౌలింగ్‌ దళంతో బరిలోకి దిగలేకపోయాం. బుమ్రా, హర్షల్ పటేల్ లేని లోటు స్పష్టం కనిపించింది. అయితే, ప్రపంచకప్‌ జట్టులోకి రావడం శుభపరిణామం. లక్ష్యాలను కాపాడుకోవడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు" అని గావస్కర్‌ వెల్లడించాడు.

మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ మాట్లాడుతూ... "నేను ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా ఉంటే.. కచ్చితంగా షమి జట్టులో ఉండేవాడు. టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియాలో ఆడాలి. అక్కడి మైదానాలపై బౌన్స్‌ చేయడం అతడికి బాగా తెలుసు. త్వరగా వికెట్లు తీసుకోగలడు. నేనైతే హర్షల్‌ పటేల్‌ స్థానంలో షమినే తీసుకొనేవాడిని. హర్షల్‌ పటేల్‌ మంచి బౌలరే. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ, పిచ్‌ పరిస్థితులకు అనుగుణంగా చూస్తే షమి సరైన వ్యక్తి. టీ20 లీగ్‌ల్లోనూ షమి అద్భుతంగా ఆడాడు. అతడు కచ్చితంగా జట్టులో ఉండాల్సింది" అని కృష్ణమాచారి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఏడాది టీ20 మెగా లీగ్‌ టోర్నీలో గుజరాత్ తరఫున షమి అద్భుత ప్రదర్శన చేశాడు. 16 మ్యాచ్‌ల్లో 8 ఎకానమీతో 20 వికెట్లు తీసి గుజరాత్‌ కప్పు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

కాగా, అక్టోబరు 16 నుంచి ఆస్ట్రేలియా వేదికగా 2022 టీ20 ప్రపంచకప్ జరగనుంది. 23న భారత్‌ తన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది. అయితే, ఈ టోర్నీ కంటే ముందు భారత్‌.. ఈ నెల 20 నుంచి ఆస్ట్రేలియాతో, 28 నుంచి దక్షిణాఫ్రికాతో మూడేసి టీ20ల్లో తలపడనుంది.

ఇదీ చూడండి: ఆ సీక్రెట్​ కోడ్​ అర్థమేంటి.. అందుకే లంక విజయం సాధించిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.