'నేను బౌలింగ్ మానేయాలా'.. అశ్విన్​ షాకింగ్ ట్వీట్​ వైరల్​!

author img

By

Published : Mar 14, 2023, 7:49 AM IST

Ravichandran Ashwin
నేను బౌలింగ్ మానేయాలా.. అశ్విన్​ షాకింగ్ ట్వీట్​ వైరల్​! ()

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగు టెస్ట్ మ్యాచ్​ల సిరీస్​ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. కీలకమైన ఆఖరి మ్యాచ్​ డ్రాగా ముగిసింది. అంతకుముందే భారత్.. వరల్డ్​ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్​కు కూడా అర్హత సాధించింది. అయితే ఈ నాలుగో టెస్టు చివరి ఐదో రోజు ఆటలో మైదానంలో పలు ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. దీని గురించి టీమ్​ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ షాకింగ్ ట్వీట్ చేశాడు. 'నేను బౌలింగ్ మానేయాలా?' అంటూ రాసుకొచ్చాడు. ఇంతకీ అతడు ఎందుకు అలా అన్నాడంటే?

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్​-ఆసీస్​ మధ్య జరిగిన ఆఖరి నాలుగో టెస్టు మ్యాచ్​ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్​లో ఇరు జట్ల బ్యాటర్లు మెరుగ్గా రాణించారు. తమ బ్యాట్​లకు పని చెప్పారు. దీంతో ఈ మ్యాచ్​లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే గత మూడు మ్యాచులలాగానే ఈ నాలుగో టెస్టులోనూ బౌలర్లు వికెట్లతో విజృంభిస్తారని క్రికెట్​ అభిమానులు​ అనుకున్నారు. కానీ అలా అనుకున్నట్టు జరగలేదు. మూడు రోజుల ఆట పూర్తయ్యే సమయానికి ఈ మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని దాదాపుగా అందరికి అర్థమైపోయింది. ఇలాంటి సమయాల్లో కెప్టెన్లు ప్రయోగాలు చేస్తుంటారు. అలానే టీమ్​ఇండియా కెప్టెన్​ రోహిత్ శర్మ.. చివరి రోజు ఆటలో ప్రయోగాలు చేశాడు.

అందులో భాగంగానే ఎప్పుడూ బ్యాటింగ్ చేసే పుజారాతో బౌలింగ్ చేయించాడు. అలాగే యంగ్ ప్లేయర్ శుభమన్​ గిల్​తో కూడా బంతిని వేయించాడు. అలా వీరిద్దరితో చెరో ఓవర్ వేయించాడు హిట్​మ్యాన్​. ఈ క్రమంలోనే ఒక ఓవర్ వేసిన పుజారా ఒక పరుగు ఇవ్వగా.. గిల్ కూడా ఒకటే రన్​ ఇచ్చాడు. అయితే పుజారా బౌలింగ్ చేయడంపై సరదాగా స్పందించాడు టీమ్​ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.

పుజారా బౌలింగ్ చేస్తున్న ఫోటోను తన ట్విటర్ అకౌంట్​లో పోస్ట్​ చేస్తూ.. "నువ్వు బౌలింగ్ చేస్తే నేనేం చెయ్యాలి? బౌలింగ్ మానేయాలా?" అంటూ సరదాగా చమత్కరించాడు. వాస్తవానికి అశ్విన్​ ఎప్పుడూ సోషల్​మీడియాలో ఫుల్​ యాక్టివ్​గా ఉంటూ తనదైన స్టైల్​లో మాట్లాడుతుంటాడు. చమత్కారాలు కూడా చేస్తుంటాడు. అలానే ఈ సారి కూడా చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్​పై క్రికెట్​ అభిమానులు సరదా కామెంట్లు చేస్తున్నారు. ఫన్నీగా చేసిన ఈ ట్వీట్​ వెంటనే వైరల్​గా మారిపోయింది. ఇప్పటికే లక్షా 60 వేల మందికి పైగా ఈ ట్వీట్​ను లైక్ చేశారు.

ఈ నేపథ్యంలో అశ్విని ట్వీట్​కు పుజారా సైతం స్పందించాడు. తాను బౌలింగ్ చేయడం ఆ కోణంలో చూడొద్దని అర్థం వచ్చేలా ఓ ఫన్నీ ట్వీట్ చేశాడు. నాగ్​పుర్ టెస్టులో అశ్విన్ వన్​ డౌన్​లో బ్యాటింగ్​కు వెళ్లడాన్ని ప్రస్తావించాడు. 'వద్దు (బౌలింగ్ మానేయాలా అనే ప్రశ్నకు బదులుగా). నాగ్​పుర్ టెస్టులో నువ్వు వన్​ డౌన్​లో వెళ్లినందుకు నేను ఇలా థ్యాంక్స్ చెబుతున్నా' అని పుజారా ట్వీట్ చేశాడు. సాధారణంగా టెస్టుల్లో పుజారా వన్​ డౌన్​లో బ్యాటింగ్ చేస్తాడన్న విషయం తెలిసిందే. తన స్థానంలో అశ్విన్ బ్యాటింగ్​కు వెళ్లాడని పుజారా పరోక్షంగా గుర్తు చేశాడు. అందుకే థ్యాంక్స్ చెబుతున్నట్లు పేర్కొన్నాడు. కాగా, ఈ ట్వీట్​కు అశ్విన్ మళ్లీ స్పందించాడు. 'నీ ఉద్దేశం బాగానే ఉంది' అంటూ ట్వీట్ చేశాడు. ఇక వీరిద్దరి సంభాషణ ఇప్పుడు ట్విట్టర్​లో ఆసక్తికరంగా మారింది.

ఇదీ చూడండి: WPL 2023: మెరిసిన దిల్లీ బ్యాటర్లు.. బెంగళూరుకు మళ్లీ నిరాశే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.