ETV Bharat / sports

IND vs ENG: 'రూట్​.. కెప్టెన్సీ అనేది పాపులారిటీ కాదు'

author img

By

Published : Aug 24, 2021, 2:26 PM IST

కెప్టెన్సీ అనేది పాపులారిటీ కాదంటూ ఇంగ్లాండ్​ సారథి జో రూట్​పై (Nasser Hussain Joe Root) తీవ్రంగా స్పందించాడు మాజీ కెప్టెన్ నాసర్​ హుస్సేన్. లార్డ్స్​ టెస్టు (IND vs ENG) చివరి రోజు అతడు నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమయ్యాడని పేర్కొన్నాడు. ఎప్పుడు ఎలా ఆడాలనేది ఇంగ్లాండ్​ టీమ్​కు తెలియట్లేదని విమర్శించాడు.

IND vs ENG
ఇండియా vs ఇంగ్లాండ్

లార్డ్స్‌ వేదికగా (IND vs ENG) టీమ్‌ఇండియాతో జరిగిన రెండో టెస్టు చివరి రోజు ఇంగ్లాండ్ కెప్టెన్‌ జోరూట్‌ ప్రవర్తించిన తీరుపై ఇప్పటికీ తీవ్ర విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా ఆ జట్టు మాజీ సారథి నాసర్‌ హుస్సేన్‌ (Nasser Hussain Joe Root).. రూట్‌ కెప్టెన్సీపై చిటపటలాడాడు. కెప్టెన్సీ అనేది పాపులారిటీ కాదని తీవ్రంగా మండిపడ్డాడు. ఐదోరోజు ఆటలో టీమ్‌ఇండియా టెయిలెండర్లు బుమ్రా(34), షమీ(56) నాటౌట్‌గా నిలిచి రికార్డుస్థాయిలో 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్‌ పేసర్లు వారిద్దర్నీ ఔట్‌ చేయడానికి ప్రయత్నించకుండా బౌన్సర్లతో ఇబ్బంది పెట్టాలని చూశారు.

దీంతో ఇంగ్లాండ్​ ప్రణాళిక బెడిసికొట్టి భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లేలా చేసింది. అంత జరుగుతున్నా రూట్‌ ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయాడు. దీంతో అతడి కెప్టెన్సీపై విమర్శలు చెలరేగుతున్నాయి. తాజాగా నాసర్‌ ఓ అంతర్జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో రూట్‌ తీరును ఎండగట్టాడు. 'అతడికి డ్రెస్సింగ్‌ రూమ్‌లో, ఇంగ్లాండ్‌ అభిమానుల్లో మంచి ఆదరణ ఉంది. కానీ.. కెప్టెన్సీ అనేది కేవలం పాపులారిటీ కాదు' అని తీవ్రంగా స్పందించాడు. ఎప్పుడు ఎలా ఆడాలో కూడా ఆ జట్టుకు తెలియట్లేదని మాజీ సారథి పేర్కొన్నాడు. రూట్‌ కొన్ని సార్లు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని.. లార్డ్స్‌లో ఐదో రోజు ఉదయం కూడా అలాంటి తికమక నిర్ణయాలే తీసుకున్నాడని నాసర్‌ వివరించాడు. అప్పుడు బుమ్రాతో వివాదం పెట్టుకోకుండా తన బౌలర్లు పరుగులు ఇవ్వకుండా చూడాల్సిందని అన్నాడు.

ఇదీ చదవండి: Ind vs Eng: 'తప్పులు గ్రహించాం.. వివాదాలకు దూరంగా ఉంటాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.