ETV Bharat / sports

'అలాంటి కెప్టెన్ లేడు.. భవిష్యత్తులో ఉండడు'.. ధోనీపై గవాస్కర్​ ప్రశంసలు

author img

By

Published : Apr 17, 2023, 5:34 PM IST

భారత క్రికెట్​ జట్టు మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీపై క్రికెట్​ దిగ్గజం సునీల్​ గవాస్కర్​ ప్రశంసల జల్లు కురిపించాడు. కెప్టెన్​గా ముందుండి జట్టును విజయ పథంలో నడిపించడం ధోనీకి వెన్నతో పెట్టిన విద్య అని​ అన్నాడు. మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించిన ధోనీ రికార్డు ఇంకెవరికీ సాధ్యం కాదని గవాస్కర్​ పేర్కొన్నాడు. ఇంకా ఏమన్నాడంటే..

suneel gavaskae on dhoni
suneel gavaskae on dhoni

ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అత్యుత్తమ కెప్టెన్ అని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. 'అతడిలాంటి కెప్టెన్ లేడు. భవిష్యత్తులో అలాంటి వాడు ఎప్పటికీ ఉండడు' అని గవాస్కర్​ చెప్పాడు. కఠిన పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కాలో సీఎస్​కేకు బాగా తెలుసు అని.. అది ధోనీ సారథ్యంలోనే సాధ్యం అవుతుందని ప్రశంసల జల్లు కురిపించాడు.

'200 మ్యాచ్​లకు కెప్టెన్​గా వ్యవహరించాలంటే చాలా కష్టం. కెప్టెన్సీ అనేది బ్యాటర్​​కు అదనపు భారంగా ఉంటుంది. అప్పుడప్పుడు అది బ్యాటర్​ ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది. కానీ, ధోనీ ఇందుకు భిన్నం. మహీ కెప్టెన్సీ తీరు.. ఇతర జట్ల కెప్టెన్ల కన్నా వైవిధ్యంగా ఉంటుంది. అతడి వ్యూహాలు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు అంతుచిక్కవు" అని గవాస్కర్ ఒక ప్రకటనలో తెలిపాడు.

ఐపీఎల్​ మొదలైనప్పటి నుంచి (2016,17 రెండు సీజన్లలో మినహా) ధోనీ.. చెన్నై సూపర్​ కింగ్స్ జట్టు తరుఫున ఆడుతున్నాడు. చెన్నై సూపర్​ కింగ్స్​ యాజమాన్యం ఐపీఎల్​ నిబంధనలు ఉల్లంఘించి చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడిందంటూ జట్టు రెండేళ్లపాటు సస్పెండ్​కు గురయ్యింది. 2016లో రైజింగ్​ పుణే సూపర్​జయింట్స్ జట్టుకూ ధోనీనే కెప్టెన్​గా బాధ్యతలు తీసుకున్నాడు. ఆ సీజన్​లో ధోనీ 14 మ్యాచ్​లకు కెప్టెన్​గా వ్యవహరించాడు. ఇప్పటి వరకు ఐపీఎల్​లో మొత్తంగా కెప్టెన్​గా 214 మ్యాచ్​లు ఆడాడు ధోనీ. 2017లో జట్టు యాజమాన్యం ధోనీని కెప్టెన్​గా తప్పించి, ఆస్ట్రేలియన్ బ్యాటర్​ స్టీవ్​ స్మిత్​కు జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే, ధోనీ సారథ్యంలోని సీఎస్​కే నాలుగు సార్లు ఛాంపియన్​గా నిలవడం విశేషం. మహీ కెప్టెన్సీలో చెన్నై ఇప్పటివరకూ 120 విజయాలు నమోదు చేసింది. 79 మ్యాచ్​లలో ఓడగా.. ఒక మ్యాచ్​లో ఫలితం తేలలేదు.

మరోవైపు, కోహ్లీని కూడా పొగడ్తలతో ముంచెత్తాడు గవాస్కర్​. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ.. వింటేజ్​ విరాట్​ను గుర్తుకు తెచ్చేలా ఆడుతున్నాడని అన్నాడు. 'రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు అద్భుతమైన ప్రదర్శనతో టోర్నీని ఆరంభించింది. ఇప్పటికే రెండుసార్లు విరాట్​ కోహ్లీ ఆర్సీబీకి శుభారంభాలను ఇచ్చాడు. జట్టు విజయాల్లో అతడి పాత్ర కీలకం కానుందని, విరాట్​ ఫామ్​లోకి రావడం ఆర్​సీబీకి కలిసొచ్చే అంశం' అని గవాస్కర్​ చెప్పుకొచ్చాడు.

ధోనీ 2004లో అంతర్జాతీయ క్రికెట్​లోకి అడుగుపెట్టాడు. కెప్టెన్​గా, వికెట్​ కీపర్​గా, బ్యాటర్​గా సత్తా చాటాడు. భారత్​కు మూడు ఐసీసీ ట్రోఫీలు తెచ్చిపెట్టాడు. 2019 ప్రపంచ కప్​ తర్వాత ఇంటర్నేషనల్​ క్రికెట్​కు గుడ్ బై చెప్పిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్​లో ఆడుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.