ETV Bharat / sports

రిటైర్మెంట్​పై ధోనీ కామెంట్స్​.. 'మీరే డిసైడయ్యారు.. నేను కాదు' అంటూ..

author img

By

Published : May 3, 2023, 8:19 PM IST

ms dhoni on retirement
ms dhoni on retirement

మిస్టర్​ కూల్​ ధోనీ తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై మరోసారి స్పందించాడు. లఖ్‌నవూతో మ్యాచ్‌లో టాస్‌ వేసే సమయంలో హోస్ట్​ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పి అభిమానులను షాక్​కు గురి చేశాడు.

గత కొంత కాలంగా ధోనీ అభిమానులను కలచివేస్తున్న ఓ వార్త ఇప్పుడు నిజం కాదని తేలిపోయింది! టీమ్​ ఇండియా మాజీ కెప్టెన్​, సీఎస్కే సారథి ధోనీకి ఇదే లాస్ట్​ సీజన్​ అని వినిపిస్తున్న వార్తలన్నీ వాస్తవాలు కాదని స్వయాన అతడే హింట్​ ఇచ్చేశాడు. దీంతో సీఎస్కే అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
బుధవారం లఖ్​నవూ​ సూపర్​ జెయింట్స్​తో జరిగిన మ్యాచ్​లో.. స్టేడియం మొత్తం చెన్నై ఫ్యాన్స్​తోనే నిండిపోయింది. గేమ్ జరుగుతోంది లఖ్​నవూలో అయినప్పటికీ.. సీఎస్కే అభిమానులే పెద్ద సంఖ్యలో మ్యాచ్​కు వచ్చారు. ఇదే విషయాన్ని టాస్ సమయంలో హోస్ట్ డానీ మోరిసన్ ప్రస్తావించాడు. "ఇదే చివరి సీజన్ కదా.. ఎలా అనిపిస్తోంది?" అని ధోనీని డానీ అడిగాడు. దీనిపై ధోనీ స్పందిస్తూ.. 'ఇదే చివరి ఐపీఎల్ అని మీరే డిసైడయ్యారు' అన్నాడు. దీంతో ఫ్యాన్స్​ ఒక్కసారిగా షాకయ్యారు.

అభిమానుల్లాగే ఈ మాటను విని కంగుతిన్న డానీ.. 'అయితే వచ్చే ఏడాది కూడా ఆడాతావన్నమాట' అని అన్నాడు. 'ధోనీ వచ్చే ఏడాది కూడా వస్తాడట' అంటూ అభిమానులకు చెప్పాడు. అతని మాటలు విని ధోనీ నవ్వాడు తప్ప.. కచ్చితంగా దానికి అవును లేదా కాదు అన్న విషయాన్ని చెప్పలేదు. దీంతో ధోనీ వచ్చే సీజన్ కూడా ఆడతాడా లేదా అన్న సందేహాలకు పూర్తి క్లారిటీ రాలేదు.

ఇటీవలే ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా కోల్​కతాతో జరిగిన మ్యాచ్‌లోనూ ధోనీ తన ఫేర్‌వెల్‌పై సరదా వ్యాఖ్యలు చేశారు. సొంత మైదానంలో కోల్‌కతా మ్యాచ్​ జరుగుతున్నప్పటికీ ధోనీ కోసం భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చి సీఎస్కేకు మద్దతుగా నిలిచారు. మ్యాచ్‌ తర్వాత వారందరికి ధోనీ ధన్యవాదాలు తెలిపాడు. తనకు ఫేర్‌వెల్‌ ఇచ్చేందు కోసమే వీరంతా సీఎస్‌కే జెర్సీలో వచ్చినట్లుందని నవ్వుతూ అన్నాడు.

మిస్టర్​ కూల్​ ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్​కు వీడ్కోలు చెప్పి దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. 2020 ఐపీఎల్ నుంచే ఏటా ధోనీకి ఇదే చివరి సీజన్ అన్న వార్తలు సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే ఈ ఏడాది ఐపీఎల్​తో క్రికెట్ నుంచి తప్పుకోవడం ఖాయమని అభిమానులు కూడా ఫిక్సయిపోయారు. అందుకే భారత్​లో ఆయన ఎక్కడికి వెళ్లి ఆడినా అతనికి మద్దతుగా అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియాలకు తరలివస్తున్నారు.

ప్రస్తుతం ధోనీ వయసు 41 ఏళ్లు. అయితే ఆయన ఇప్పుటికీ ఫిట్​గా ఉండటం విశేషం. ఇప్పడున్న యంగ్​ ప్లేయర్స్​కు దీటుగా పోటీపడి మరీ క్రికెట్ ఆడుతున్నాడు. దీంతో అభిమానులు కూడా ఆయన వచ్చే ఏడాది కూడా కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అభిమానులకు అప్పుడప్పుడు షాకులిచ్చే ధోనీ.. ఈ సారి కూడా ఎటువంటి నిర్ణయాలను తీసుకుంటారో అంచనా వేయలేమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.