ETV Bharat / sports

IPL 2023: 'ఆవేశ్​ ఖాన్​-గంభీర్​.. అంత ఓవరాక్షన్​ అవసరమా?'

author img

By

Published : Apr 11, 2023, 2:22 PM IST

Avesh Khan
Avesh Khan and Gautam Gambhir

సోమవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్​లో ఆర్సీబీపై లఖ్​నవూ విజయం సాధించింది. అయితే మ్యాచ్ విజయం సాధించిన నేపత్యంలో ఆవేశ్ ఖాన్​, గంభీర్ చేసిన పనులు నెటిజన్లకు కోపం తెప్పించాయి. ఆ వివరాలు..

లఖ్​నవూ సూపర్​ జెయింట్స్‌ పేసర్​​ ఆవేశ్‌ ఖాన్​ ప్రస్తుతం తన చర్యతో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. అతడు చేసిన పనివల్ల ఐపీఎల్‌ నిర్వాహకులు కూడా మందలించారు.

ఇంతకీ ఇతడు​ చేసిన పనేంటంటే.. ఐపీఎల్​లో భాగంగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ తేడాతో లఖ్​నవూ జట్టు అనూహ్య విజయాన్ని సాధించింది. ఇక ఈ ఆనందాన్ని తట్టుకోలేక రాహుల్​ సేన మైదానంలోనే సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో క్రీజులో ఉన్న ఆవేశ్‌ ఖాన్‌ హెల్మెట్‌ నేలకేసి కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఈ వీడియో సోషల్​ మీడియాలో జోరుగా చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. అలా ఆర్సీబీ ఫ్యాన్స్‌.. ఈ వీడియోను చూసి అతడికి చురకలు అంటించడం ప్రారంభించారు."కనీసం బంతినే టచ్‌ చేయలేకపోయావు.. నీకు అంత ఓవరాక్షన్‌ అవసరమా" అంటూ ఆవేశ్​ పై సోషల్‌ మీడియాలో ట్రోల్స్​ చేస్తున్నారు.

ఇక ఈ దృశ్యాలు చూసి రంగంలోకి దిగిన ఐపీఎల్‌ నిర్వాహకులు ఆవేశ్​ ప్రవర్తనపై మందలిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. "ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌ ప్లేయర్​ ఆవేశ్‌ ఖాన్‌ను మందలిస్తూ ఈ ప్రకటనను జారీ చేస్తున్నాము. మిస్టర్‌ ఆవేశ్‌.. ఐపీఎల్‌ కోడ్‌లోని 2.2 నిబంధనను అతిక్రమించాడు". అని పేర్కొన్నారు. అయితే మొదటి తప్పిదం అయినందున ఈ సారి మందలింపుతో సరిపెడుతున్నట్లు వెల్లడించారు.

కాగా ఈ మ్యాచ్‌లో అవేశ్​ ఖాన్‌.. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 53 పరుగులును సమర్పించుకున్నాడు. ఇక ఈ మ్యాచ్​ ఆఖరి ఓవర్​లో స్కోరు సమం అయిన సందర్భంలో చివరి బంతిని కొట్టకుండా మిస్ చేశాడు. అదే సమయంలో ఆర్సీబీ వికెట్​ కీపర్​ దినేశ్​ కార్తిక్​ కూడా రనౌట్​ చేయడంలో విఫలమవ్వడం వల్ల ఆవేశ్​ 'బై' రన్​ చేశాడు. దీంతో విజయం లఖ్​నవూ సొంతమైంది.

గంభీర్​ పై ఆర్సీబీ ఫ్యాన్స్​ ఫైర్​..
ఆవేశ్​ ఖాన్​తో పాటు లఖ్​నవూ సూపర్‌ జెయింట్స్‌ మెంటార్‌ గౌతం గంభీర్​ను కూడా ఆర్సీబీ అభిమానులు నెట్టింట ట్రోల్​ చేస్తున్నారు. లఖ్​నవూ టీమ్​ సంబరాలు చేసుకుంటున్న సమయంలో ఆర్సీబీని టీమ్​ను ఉత్సాహపరించేందుకు అభిమానులు అరుస్తున్నారు. ఆ సమయంలో ఆ జట్టు ఫ్యాన్స్‌ను ఉద్దేశించి.. "ఇక ఆపండి" అన్నట్లు.. నోటిపై వేలును ఉంచి సైగ చేశాడు గంభీర్​. అంతే ఇప్పుడీ వీడియో కూడా సోషల్‌ మీడియాలో తెగ హల్​ చల్​ చేస్తోంది. ఇక మిగతా ఆర్సీబీ ఫ్యాన్స్​ ఈ వీడియోపై స్పందించారు. "గంభీర్‌ నీ స్థాయికి తగ్గట్టు కాస్త హుందాగా ప్రవర్తించు" అంటూ ఈ టీమ్​ఇండియా మాజీ ప్లేయర్​ను ట్రోల్​ చేస్తున్నారు. అయితే గంభీర్​ ఫ్యాన్స్​ మాత్రం ఆయన చేసిన విషయంలో తప్పేం లేదంటూ సమర్థిస్తున్నారు. 'సెలబ్రేషన్స్‌ను ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు' అని అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.