ETV Bharat / sports

ఓడిపోయినా.. గర్వపడుతున్నా: శ్రేయస్​ అయ్యర్​

author img

By

Published : Mar 31, 2022, 9:46 AM IST

Sreyas Iyer
Sreyas Iyera

IPL 2022 RCB VS KKR: మ్యాచ్‌ను ఆఖరి ఓవర్‌ వరకు తీసుకెళ్లడం చాలా సంతోషంగా ఉందని, అందుకు తాను గర్వపడుతున్నట్లు తెలిపాడు కోల్​కతా కెప్టెన్​ శ్రేయస్​ అయ్యర్​. కాగా, మ్యాచ్​ గెలవడంపై హర్షం వ్యక్తం చేశాడు రాయల్​ ఛాలెంజర్స్​ కెప్టెన్​ ఫాఫ్​ డుప్లెసిస్​. దినేశ్‌ కార్తీక్‌ అచ్చం ధోనీలా చాలా ప్రశాంతంగా ఉంటాడని అన్నాడు.

IPL 2022 RCB VS KKR: దినేశ్‌ కార్తీక్‌ చాలా ప్రశాంతంగా ఉంటాడని, అచ్చం చెన్నై మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీలా కూల్‌ అని బెంగళూరు కెప్టెన్‌ ఫా డుప్లెసిస్‌ ప్రశంసించాడు. గతరాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 128 పరుగులకే కుప్పకూలగా.. బెంగళూరు ఏడు వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదనలో బెంగళూరు కూడా తడబడినా.. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (14 నాటౌట్‌; 7 బంతుల్లో 1x4, 1x6), హర్షల్‌ పటేల్‌ (10 నాటౌట్‌; 6 బంతుల్లో 2x4) ధాటిగా ఆడి విజయాన్నందించారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం డుప్లెసిస్‌ మాట్లాడాడు.

'ఈ విజయంతో చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్న స్కోర్ల మ్యాచ్‌లో మేం సానుకూలంగా ఆడటానికి ప్రయత్నించాం. కానీ, కోల్‌కతా బౌలింగ్‌ అద్భుతంగా ఉంది. ఈరోజు బంతి కాస్త ముందుగానే స్వింగ్‌ అవడం వల్ల పాటు బౌన్స్‌ కూడా అయింది. రెండు, మూడు రోజుల క్రితం ఇదే పిచ్‌పై 200 పరుగులు చేస్తే ఈరోజు 130 పరుగులే నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడానికి పెద్ద లక్ష్యమేమీ లేకపోయినా వికెట్లు కోల్పోకుండా ఉండాల్సింది. ఇక దినేశ్‌ కార్తీక్‌ గురించి చెప్పడానికి ఏం లేదు. అతడు ధోనీలాగే చాలా ప్రశాంతంగా, కూల్‌గా ఉంటాడు. ఏదైనా అవసరమైతే నేను జట్టులోని ఇతర ఆటగాళ్ల నుంచి సహాయం తీసుకుంటా. మా టీమ్‌లో చాలా మంది గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. మా మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. మా కుర్రాళ్లు బాగా ఆడుతున్నారు. జట్టుగా కలిసి ఉన్నారు. వాళ్లకు ఏదైనా ఆలోచన వస్తే నాతో పంచుకుంటున్నారు. ఇది చాలా మంచి విషయం' అని డుప్లెసిస్‌ పేర్కొన్నాడు.

మా ఆటగాళ్లకు అదే చెప్పా:'ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు నేనెంతో ఉత్సాహంగా ఉన్నా. మా ఆటగాళ్లతో కూడా మాట్లాడా. మనం గెలుస్తామా లేదా అనేది పక్కనపెడితే, మైదానంలో ఎలాంటి ప్రదర్శన చేశామనేదే మనమేంటో తెలియజేస్తుంది. మనం పోరాడే తీరు.. రాబోయే రోజుల్లో మన ఆలోచనా దృక్పథాన్ని తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే చివరి వరకూ పోరాడి మ్యాచ్‌ను ఆఖరి ఓవర్‌ వరకు తీసుకెళ్లడం చాలా సంతోషంగా ఉంది. దానికి గర్వపడుతున్నా. ఆదిలోనే ఆ జట్టు వికెట్లు పడగొట్టే బౌలర్లను తీసుకురావాలనుకున్నా. అయితే, బెంగళూరు బ్యాట్స్‌మన్‌ నిలకడగా ఆడారు. వాళ్లకు అభినందనలు. ఇక చివర్లో వెంకటేశ్‌ అయ్యర్‌కు బౌలింగ్‌ ఇవ్వడానికి కారణం.. అంతర్జాతీయ క్రికెట్లో అతడు కొంత అనుభవం పొందడమే. అందుకే అతడికి మరింత ఆత్మవిశ్వాసం కోసం అవకాశం ఇచ్చా. టోర్నీ ఆరంభంలోనే ఇలా బౌలింగ్‌ అవకాశాలిస్తే వారిలో సానుకూల ఆలోచనా విధానం ఏర్పడుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని తర్వాతి మ్యాచ్‌లో రాణించడానికి కృషి చేస్తాం. ఇక బెంగళూరు స్పిన్నర్‌ వానిండు హసరంగ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. నా వికెట్‌ తీశాక మరింత రెచ్చిపోయాడు. మంచి ప్రదర్శన చేసిన అతడికి అభినందనలు' అని కోల్‌కతా కెప్టెన్‌ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: IPL 2022: ఆర్సీబీ బోణీ.. కోల్​కతాపై విజయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.