ETV Bharat / sports

'భారత్​-ఆస్ట్రేలియా సిరీస్​లో ఆ జట్టే ఫేవరేట్'

author img

By

Published : Nov 7, 2020, 7:34 PM IST

భారత్​-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే సిరీస్​లో ఆసీస్​ ఫేవరేట్​ అని పాకిస్థాన్​ మాజీ సారథి​ వసీం​ అక్రమ్​ అన్నాడు. అయితే టీమ్​ఇండియా కూడా బలంగానే ఉందని తెలిపాడు. కాబట్టి ఈ పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉందని వెల్లడించాడు.

Akram
అక్రమ్

బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియానే ఫేవరెట్‌ అని పాకిస్థాన్‌ మాజీ సారథి వసీం అక్రమ్‌ అన్నాడు. సిరీస్‌ మొత్తం హోరాహోరీగా సాగుతుందని అంచనా వేశాడు. టీమ్‌ఇండియా పేసర్లు అద్భుతంగా రాణిస్తుండటమే ఇందుకు కారణమన్నాడు.

"ఆస్ట్రేలియా బౌలింగ్‌ ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంది. వారికి ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జోష్ హేజిల్‌వుడ్ సహా టాప్‌క్లాస్‌ బౌలర్లు ఉన్నారు. అయితే టీమ్​ఇండియాలో జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, నవదీప్‌ సైనీతో పాటు ఇతర బౌలర్లు కూడా బాగానే రాణిస్తున్నారు. మొత్తంగా జట్టులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. వారి దేహభాష కూడా మారింది. 1990ల్లో మేం మైదానంలోకి అడుగుపెడుతున్నప్పుడు ఉండే ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోంది. వాళ్ల శారీరక భాష వారెంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారో చూపిస్తోంది. భారత ఆటగాళ్లు ఏమైనా చేయగలరు. కాబట్టి భారత్‌-ఆసీస్‌ పోరు హోరాహోరీగా సాగుతుంది. అయితే ఫేవరెట్‌ మాత్రం ఆస్ట్రేలియానే."

-వసీం అక్రమ్​, పాక్​ మాజీ సారథి.

డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌ రాకతో ఆసీస్‌ బలం పెరుగుతుందని అక్రమ్‌ అన్నాడు. ఆసీస్ వికెట్లు కఠినంగా ఉంటాయి కాబట్టి కూకాబుర్ర బంతి పాతబడ్డాక పరుగులను నియంత్రించడం కష్టమని పేర్కొన్నాడు.

అలాగే పాక్‌ జట్టులోకి అత్యుత్తమ పేసర్లు ఎందుకు రావడం లేదో వివరించాడు అక్రమ్. టీ20లపై ఎక్కువగా దృష్టిపెట్టడం, షార్ట్‌కట్ల కోసం ప్రయత్నించడం వల్ల టాప్‌క్లాస్‌ బౌలర్లు రావడం లేదన్నాడు. ఎక్కువ ఓవర్లు వేస్తేనే కండరాలు దృఢంగా మారి వేగం పెరుగుతుందన్నాడు.

ఐపీఎల్‌ ముగియగానే కోహ్లీసేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ ఆతిథ్య జట్టుతో 3 వన్డేలు, 3 టీ20లు, 4 టెస్టుల్లో తలపడనుంది.

ఇదీ చూడండి కెప్టెన్ కోహ్లీ.. అందరికంటే ముందే బుడగలోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.