ETV Bharat / sports

ఈ రోజు అదృష్టం మమ్మల్ని వరించలేదు.. మా ఓటమికి కారణమదే : రోహిత్​ శర్మ

author img

By

Published : Mar 19, 2023, 8:56 PM IST

మూడో వన్డేలో ఆసీస్​ చేతిలో ఆతిథ్య భారత్​ జట్టు చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్​ అనంతరం రెండు టీమ్​ల కెప్టెన్లు మీడియాతో ముచ్చటించారు. ఆ విషయాలు..

India Vs Australia 2nd ODI Captains Comments
భారత్​ వర్సెస్​ ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్​ కెప్టెన్ల కామెంట్స్​

వైజాగ్​ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమ్​ఇండియా ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. 10 వికెట్ల తేడాతో ఆసీస్​ ఘన విజయం సాధించడం వల్ల ఈ మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. బ్యాటింగ్‌లో తడబాటుకు గురైన రోహిత్​ సేన.. బౌలింగ్‌లోనూ ఆసీస్‌ బ్యాటర్లను అడ్డుకోలేకపోయింది. ఈ ఓటమి తర్వాత భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ, ఆసీస్‌ సారథి స్టీవ్‌ స్మిత్ విలేకరులతో మాట్లాడారు.

"మ్యాచ్‌ ఓడిపోతే చాలా నిరుత్సాహంగా ఉంటుంది. మొదట బ్యాటింగ్‌లో మేం సరిగ్గా ఆడలేదు. స్కోరుబోర్డుపై సరిపోయినన్ని పరుగులను పెట్టలేకపోయాం. ఈ పిచ్‌ మీద 117 పరుగులే స్కోర్​ చేయడం సరైంది కాదు. వరుసగా వికెట్లు పడిపోవడం వల్ల మేం అనుకున్న విధంగా స్కోర్​ సాధించలేకపోయాం. మొదటి ఓవర్‌లోనే గిల్ ఔట్‌ కావడం.. ఆ తర్వాత నేను, విరాట్ కలిసి పరుగులు రాబట్టినప్పటికీ స్కోర్​ ఏ మాత్రం సరిపోలేదు. వెనువెంటనే వికెట్లు పడటం మాకు నష్టాన్ని చేకూర్చింది. అదే మమ్మల్ని వెనుకడుగు వేసేలా చేసింది. ఈ రోజు అదృష్టం మమ్మల్ని వరించలేదు. స్టార్క్‌ తన బౌలింగ్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. కొత్త బంతిని స్వింగ్‌ చేయడం వల్ల బ్యాటర్లకు కాస్త ఇబ్బందిగా మారింది. మిచెల్‌ మార్ష్ ఓ అద్భుతమైన బ్యాటర్. తన పవర్‌ హిట్టింగ్‌తోనే ఈ మ్యాచ్‌ను మా నుంచి దూరం చేశాడు"

--రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్​

మ్యాచ్​ ఇంత త్వరగా ముగుస్తుందని ఊహించలేదన్నాడు ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్‌​ స్మిత్​. "కేవలం 37 ఓవర్లలోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. కొత్త బంతితో స్టార్క్‌ భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. మ్యాచ్​ ప్రారంభం చాలా బాగుంది. వికెట్‌ ఎలా ఉంటుందో తొలుత అంచనా వేయలేకపోయాం. లక్ష్యం ఎంత ఉంటే గట్టి పోటీ ఇవ్వగలమో అని కూడా ఆలోచించలేదు. మా నైపుణ్యంతో టీమ్‌ఇండియా ప్లేయర్లపై ఒత్తిడి తేవాలని అనుకున్నాం. ఆ విధంగానే మా ఆటతీరును ప్రదర్శించాం. ఛేదనలో హెడ్‌, మార్ష్‌ విజృంభించారు. మొదటి వన్డే మ్యాచ్‌లోనూ మార్ష్ రాణించాడు. కానీ, నెగ్గలేకపోయాం. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి విజయాన్ని మా ఖాతాలో వేసుకున్నాం. ఇక సింగిల్‌ హ్యాండ్‌తో క్యాచ్‌ను పట్టడం అద్భుతం. క్యాచ్‌ ఆఫ్‌ ది సెంచరీ అని అనుకోవడానికి వీల్లేదు. హార్దిక్‌ పాండ్యా వంటి పెద్ద వికెట్‌ను పరుగులు చేయనివ్వకుండానే వెనక్కి పంపించడం సంతోషంగా ఉంది" అని స్మిత్‌ చెప్పాడు.

వైజాగ్​ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్​ నిర్దేశించిన 117 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్​ జట్టు కేవలం 11 ఓవర్లోనే ఛేదించింది. 10 వికెట్ల తేడాతో 121 పరుగులు చేసి కంగారులు మూడు వన్డేల సిరీస్​లో మొదటి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో 1-1తో సిరీస్​ సమంగా ఉంది. ఇక చివరి వన్డే మార్చి 22న చైన్నైలోని చిదంబరం మైదానంలో జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.