రోహిత్ శర్మ రీఎంట్రీ.. ఇషాన్ కిషన్‌పై వేటు.. రెండో వన్డే ఆడే భారత జట్టు ఇదే!

author img

By

Published : Mar 18, 2023, 2:23 PM IST

ind vs aus 2nd odi

ఆసీస్​తో జరిగిన తొలి వన్డేలో టీమ్​ఇండియా అదరగొట్టింది. అటు బ్యాటర్లతో పాటు ఇటు బౌలర్లు సైతం మైదానంలో చెలరేగిపోయారు. అదే జోష్​తో ఇప్పుడు వైజాగ్ వేదికగా జరగనున్న రెండో వన్డే​ కోసం భారత క్రికెటర్లు సిద్ధమవుతున్నారు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్​లో బోణీ కొట్టిన టీమ్​ఇండియా.. వైజాగ్​ వేదికగా జరగనున్న మరో ఆసక్తికరమైన పోరుకు సిద్దమౌతోంది. వైజాగ్​లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న రెండో వన్డేలో ఆసీస్‌తో రోహిత్​ సేన తలపడనుంది. ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత్​.. ఆ మ్యాచ్​లో విజయం సాధించడంతో రెట్టింపు ఉత్సాహంతో ప్రాక్టీస్ చేస్తోంది.

శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్​లో పేలవ బ్యాటింగ్‌తో ఓటమిపాలైన ఆసీస్​ జట్టు.. తదుపరి మ్యాచ్​లో ఎలాగైనా విజయం సాధించాలనే కసితో బరిలోకి దిగుతోంది. అయితే వైజాగ్ వేదికగా జరగనున్న రెండో మ్యాచ్​కు సర్వం సిద్ధమౌతున్న వేళ అక్కడి మైదానం భారత్‌కు అనుకూలంగా ఉండటం టీమ్​ఇండియాకు కలిసొచ్చే అంశం. ఇక బావమరిది పెళ్లి కోసం తొలి వన్డేకు దూరంగా ఉన్న టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్​కు రానున్నాడు. తనకు అచ్చొచ్చిన అమ్మమ్మ వాళ్ల ఊరిలో జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు రోహిత్​. దీంతో అతడి స్థానంలో తొలి వన్డే ఆడిన ఇషాన్ కిషన్‌ ఇప్పుడు జట్టు నుంచి తప్పుకోనున్నాడు.

తొలి వన్డేలో స్టార్​ క్రికెటర్​ విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్​లు విఫలమయ్యారు. వారి స్థానంలో మరెవరూ రానున్నప్పటికీ ఆశించిన స్థాయి ప్రదర్శన చేయాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఇక సూర్య కుమార్​కు ఈ మ్యాచ్ ఓ అగ్ని పరీక్ష లాంటిది. టీ20 ఫార్మాట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన అతడు.. వన్డేల్లో మాత్రం పేలవ ప్రదర్శనతో సరైన ముద్ర వేయలేకపోతున్నాడు. ముంబయి వన్డేలో అయితే గోల్డెన్ డక్‌గా వెనుదిరిగి నెట్టింట తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. దీంతో వైజాగ్ వన్డేలో అతడికి కీలకం కానుంది. ఒకవేళ ఇందులో అతడు విఫలమైతే తన స్థానాన్ని భర్తీ చేసేందుకు మరో ఆటగాడు టీమ్​లోకి రానున్నాడు!

ఇక ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు. ఇంతవరకు విమర్శలు ఎదుర్కొన్న రాహుల్​ తొలి వన్డేలో అసాధారణ ప్రదర్శనతో జట్టును గెలిపించి మరోసారి తన సత్తా ఏంటో చాటాడు. 6,7 స్థానాల్లో మైదానంలోకి అడుగుపెట్టిన వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య, రవీండ్ర జడేజా కూడా అద్భుత ప్రదర్శన కనబర్చారు. దీంతో వీరు వైజాగ్​లోనూ అదే జోరును కొనసాగిస్తే ఇక వారికి తిరుగుండదని అభిమానులు అంటున్నారు.

ఇప్పటివరకు జట్టులో ఉన్న నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతోనే రెండో వన్డేకు సిద్దం కానుంది రోహిత్​ సేన. తొలి వన్డేలో సత్తా చాటిన బౌలర్లు మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ ఈ మ్యాచ్​కు కొనసాగనుండగా.. ఆల్‌రౌండర్‌గా శార్దూల్ ఠాకూర్ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోనున్నాడు. మరి స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను ఆడిస్తారా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. అతడి స్థానంలో చాహల్‌ను తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరోవైపు తొలి వన్డేలో కుల్దీప్ వికెట్ తీసినప్పటికీ ధారళంగా పరుగులిచ్చాడు. దీంతో ఈ మ్యాచ్‌కు కూడా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఉమ్రాన్ మాలిక్​లు బెంచ్‌కే పరిమితం కానున్నారు.

భారత్ తుది జట్టు(అంచనా)
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్/యుజ్వేంద్ర చాహల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.