ETV Bharat / sports

ఆ మాత్రం టార్గెట్​కే 5 వికెట్లా.. ఇకనైనా ప్రయోగాలు ఆపండి.. టీమ్ఇండియాకు ఫ్యాన్స్ విన్నపం

author img

By

Published : Jul 28, 2023, 4:08 PM IST

Ind vs Wi Odi
భారత్ వర్సెస్ విండీస్ వన్డే

Ind vs Wi Odi : విండీస్​తో మొదటి వన్డేలో భారత్ విజయం సాధింటినప్పటికీ. ఈ గెలుపు సదరు క్రికెట్ ఫ్యాన్స్​కు కిక్​ ఇవ్వలేదు. ఎందుకంటే..

Ind vs Wi Odi : వెస్టిండీస్​తో మూడు వన్డేల సిరీస్​ను టీమ్ఇండియా విజయంతో ప్రారంభించింది. కానీ ఈ మ్యాచ్​లో భారత్.. 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు తీవ్రంగ శ్రమించాల్సి వచ్చింది. చిన్న టార్గెట్​ను ఛేదించే క్రమంలో భారత్ ఏకంగా ఐదు వికెట్లు కోల్పోవడం ఫ్యాన్స్​లో గుబులు పుట్టించింది.

గత కొంతకాలంగా ఫామ్​లోలేని విండీస్​పైనే ఇలా ఆడితే.. ప్రపంచకప్​లో పెద్ద పెద్ద జట్లను ఎలా ఎదుర్కోగలదని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరో మూడు నెలల్లో ప్రారంభమయ్యే మెగాటోర్నీ కోసం సన్నద్ధమవుతున్న ఈ సమయంలో.. గురువారం మ్యాచ్​లో టీమ్​ఇండియా చేసిన ప్రయోగాల పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. మరి అవేంటో చూద్దాం.

ఈ పర్యటనలో మొదటి నుంచి టీమ్ఇండియానే ఫేవరెట్​గా ఉంది. ఇక వరల్డ్ కప్ క్వాలిఫయర్స్​లో పేలవమైన ఆటతీరుతో టోర్నీకి అర్హత సాధించని విండీస్.. అసలు భారత్​కు పోటీగా నిలుస్తుందా అని అనుకున్నారంతా. అలాంటి విండీస్​పై టాస్ గెలవగానే కెప్టెన్ రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఛేజింగ్​లో బ్యాటింగ్ ఆర్డర్​ను మార్చి.. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది మేనేజ్​మెంట్. అయితే కుర్రాళ్లకు ఎక్కువసేపు బ్యాటింగ్ చేసే అవకాశం ఇవ్వాలని భావించినట్లు అర్థమవుతోంది.

అలాంటప్పుడు టాస్ గెలిచిన వెంటనే బ్యాటింగ్ ఎంపిక చేసుకోవాల్సింది అని ఫ్యాన్స్ అంటున్నారు. అయినప్పటికీ ఛేజింగ్​లో యంగ్ ప్లేయర్లెవరూ ప్రభావం చూపలేదు. ఓపెనింగ్​లో వచ్చిన ఇషాన్ కిషన్​ ఒక్కడే అర్ధశతకం సాధించాడు. మిగతావారెవరు కూడా కనీసం 30 బంతులు ఎదుర్కోలేదు. దీంతో తొలుత బ్యాటింగ్​ చేస్తే.. వారికి క్రీజులో ఎక్కువసేపు గడిపే అవకాశం ఉండేదని వాదనలు వినిపిస్తున్నాయి.

Team India Batting Order : ఇక బ్యాటింగ్​లో చేసిన ప్రయోగం విఫలమైందనే చెప్పాలి. అయితే టార్గెట్​ చిన్నదైన క్రమంలో ఇలాంటి ప్రయోగాల్ని తప్పుబట్టలేం. కానీ స్వల్ప లక్ష్యానికే యంగ్ బ్యాటర్లు ఒత్తిడిని అధిగమించలేకపోయారు. వన్​ డౌన్​లో వచ్చిన సూర్య.. మూడు ఫోర్లు, ఓ సిక్స్​తో టచ్​లోకి వచ్చినట్లు కనిపించినా అతడు మోతి బౌలింగ్​లో ఎల్బీగా వెనుదిరిగాడు. మిడిల్, లోయార్డర్​లో బ్యాటింగ్​ చేసే హార్దిక్, జడేజాలను ముందుగా పంపితే హార్దిక్ రనౌట్​ అయ్యాడు. టీమ్ఇండియా.. కుర్రాళ్లతో ప్రయోగం చేయడానికి బ్యాటింగ్ ఆర్డర్​ను మొత్తం డిస్ట్రబ్ చేయాల్సి వచ్చింది. ఈ ఫలితంగా రోహిత్ నెంబర్ ఏడులో రాగా.. విరాట్​కు బ్యాటింగ్ చేసే ఛాన్స్ రాలేదు.

ఒకవేళ లక్ష్యం ఇంకో వంద పరుగులు అదనంగా ఉండి ఉంటే.. మ్యాచ్ ఫలితం తప్పకుండా మారి ఉండేదని నెటిజన్ల అభిప్రాయం. స్టార్ బ్యాటర్లు రోహిత్, విరాట్​ విఫలమైతే.. జట్టు పరిస్థితి ఏంటా అని టీమ్ఇండియా ఫ్యాన్స్ సందేహంలో పడ్డారు. ఇకనైనా ఎలాంటి ప్రయోగాలకు పోకుండా రానున్న సిరీస్​ల్లో విజయాల పరంపర సాగించాలని ఆశిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.