ETV Bharat / sports

IND vs SA: రెండో వన్డేలోనూ భారత్​ ఓటమి- సిరీస్​ దక్షిణాఫ్రికా కైవసం

author img

By

Published : Jan 21, 2022, 10:07 PM IST

Updated : Jan 21, 2022, 10:55 PM IST

ind vs sa odi series 2022
ind vs sa odi series 2022

IND vs SA: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలోనూ భారత్​ ఓటమి పాలైంది. దీంతో దక్షిణాఫ్రికా 2-0తో వన్డే సరీస్​ను కైవసం చేసుకుంది. ఓపెనర్లు మలన్‌, క్వింటన్ డికాక్‌ అర్ధ సెంచరీలతో లక్ష్య ఛేదనలో కీలక పాత్ర పోషించారు.

IND vs SA ODI: రెండో వన్డేలో భారత్‌పై దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్‌ నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా మూడు వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని ఇంకా ఒక మ్యాచ్‌ మిగిలుండగానే సౌతాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు మలన్‌ ( 108 బంతుల్లో 91), క్వింటన్ డికాక్‌ (66 బంతుల్లో 78) అర్ధశతకాలతో రాణించగా.. డసెన్‌ (37), మార్‌క్రమ్‌ (37), బవుమా (35) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో చాహల్, బుమ్రా, శార్దూల్ ఠాకూర్‌ తలో వికెట్ పడగొట్టారు.

లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు శుభారంభం అందించారు. ముఖ్యంగా క్వింటన్ డికాక్‌ ఆది నుంచి దూకుడుగా ఆడాడు. భువనేశ్వర్ కుమార్‌ వేసిన రెండో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ బాదాడు. మలన్‌ కూడా నిలకడగా ఆడాడు. దీంతో పది ఓవర్లు పూర్తయ్యేసరికి సౌతాఫ్రికా 66/0తో నిలిచింది. డికాక్‌ 37 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు. తర్వాత మలన్‌ దూకుడు పెంచి ఆడి హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. 22 ఓవర్‌లో డికాక్‌ని శార్దూల్ ఠాకూర్‌ వెనక్కి పంపి భారత్‌కి ఊరటనిచ్చాడు. తర్వాత దూకుడుని కొనసాగిస్తూ శతకం వైపు దూసుకెళ్తున్న మలన్‌ని బుమ్రా పెవిలియన్‌కి పంపాడు. తర్వాతి ఓవర్‌లోనే బవుమా (35) చాహల్‌ బౌలింగ్‌లో అతడికే క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డసెన్‌, మార్‌క్రమ్‌ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టుని విజయ తీరాలకు చేర్చారు.

పంత్​ ఫైర్​..

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్​కు దిగిన భారత్​కు ఓపెనర్లు ధావన్, రాహుల్ శుభారంభాన్నిచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్​కు 63 పరుగులు జోడించారు. అనంతరం ధావన్ (29)ను పెవిలియన్ చేర్చాడు మర్క్​రమ్. తర్వాతి ఓవర్లోనే విరాట్ కోహ్లీ డకౌట్​గా వెనుదిరిగాడు. ఆ తర్వాత పంత్​తో కలిసి రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్​ను చక్కదిద్దాడు. వీరిద్దరూ సఫారీ బౌలర్లను కాచుకుని పరుగుల వేట సాగించారు. ఈ క్రమంలోనే ఇరువురు అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు. మూడో వికెట్​కు 115 పరుగుల భాగస్వామ్యం జోడించిన అనంతరం రాహుల్ (55) ఔటయ్యాడు. సెంచరీ దిశగా దూసుకెళ్లిన పంత్​ (85)ను పెవిలియన్ పంపాడు షంసీ. ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్ (22), శ్రేయస్ అయ్యర్ (11) భారీ స్కోర్ సాధించడంలో విఫలమయ్యారు. చివరలో శార్దూల్ ఠాకూర్ (40*), అశ్విన్ (25*) కాసేపు పోరాడటం వల్ల ఇండియా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో షంసీ రెండు వికెట్లు పడగొట్టగా.. మగలా, మార్క్​రమ్​, మహారాజ్​, లుంగి ఎంగిడి, చేరో ఒక వికెట్‌ తీశారు.

ఇదీ చూడండి: 'భారత్-పాక్ పోరు కంటే ఏదీ గొప్పది కాదు'

Last Updated :Jan 21, 2022, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.