ETV Bharat / sports

'చెత్త బ్యాటింగే మా ఓటమికి కారణం.. ఒక్కరు నిలిచినా మ్యాచ్​ మాదే!'

author img

By

Published : Mar 23, 2023, 6:47 AM IST

బ్యాటింగ్ వైఫల్యంతోనే చివరి వన్డేలో ఓటమిపాలయ్యామని భారత్​ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ఆసీస్ విధించిన లక్ష్యం గొప్పదేం కాదని.. కానీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని అన్నాడు.

ind vs aus team india captain rohit sharma on last odi match loss
ind vs aus team india captain rohit sharma on last odi match loss

టీమ్​ఇండియాతో మూడు వన్డేల సిరీస్‌ ఆస్ట్రేలియాదే. బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచిన కంగారూలు 2-1తో సిరీస్‌ పట్టేశారు. అయితే మ్యాచ్​ అనంతరం భారత్​ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్​ శర్మ.. తమ జట్టు ఓటమిపై స్పందించాడు. తాము బ్యాటింగ్ వైఫల్యంతోనే చివరి వన్డేలో ఓటమిపాలయ్యామని రోహిత్ శర్మ తెలిపాడు. ఆసీస్ విధించిన లక్ష్యం గొప్పదేం కాదని.. కానీ భాగస్వామ్యాలు నెలకొల్పడంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని తెలిపాడు. కనీసం ఒక్క బ్యాటర్ నిలిచినా మ్యాచ్​ ఫలితం మరోలా ఉండేదని చెప్పాడు. తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకుంటామని తెలిపాడు.

"ఆసీస్​ నిర్దేశించిన లక్ష్యం గొప్పదేం కాదు. మేమే సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. ఛేజింగ్‌లో భాగస్వామ్యాలు చాలా కీలకం. ముఖ్యంగా మ్యాచ్​లో మేము సరైన పార్ట్‌నర్‌షిప్స్ నమోదు చేయలేకపోయాం. మంచి ఆరంభం లభించిన తర్వాత.. ఒక బ్యాటర్ క్రీజులో నిలబడి వీలైనంత వరకు మ్యాచ్‌ను డీప్‌గా తీసుకెళ్లడం చాలా ముఖ్యం. కానీ అలా చేయలేకపోయాం. వరుసగా వికెట్లు కోల్పోవడం మా విజయవకాశాలను దెబ్బతీయడంతో పాటు మా బ్యాటర్లపై ఒత్తిడి పెంచింది. ఈ సిరీస్ కోల్పోయినా.. గత 9 వన్డేల్లో మాకు ఎన్నో సానుకూలంశాలు లభించాయి. ఈ ఓటమితో మేము ఎక్కడ మెరుగుపడాలో అనే విషయం తెలిసింది. ఇది సమష్టి వైఫల్యం. ఈ సిరీస్‌లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఆస్ట్రేలియా ప్లేయర్లు అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా ఆసీస్ స్పిన్నర్లు ఇద్దరూ మాపై ఒత్తిడి పెంచారు. పేసర్లు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ విజయానికి వారు పూర్తిగా అర్హులు" అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్​ ఇలా జరిగింది..
మూడో వన్డే మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల ధాటికి 49 ఓవర్లలో 269 పరుగులకు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), మిచెల్ మార్ష్(47 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 47), అలెక్స్ క్యారీ(46 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 38) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ మూడేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టీమ్ఇండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకే ఆలౌటై ఓటమి పాలైంది. విరాట్ కోహ్లీ(72 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 54), హార్దిక్ పాండ్య(40 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 40) రాణించినా ఫలితం లేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. అష్టన్ అగర్ రెండు వికెట్లు తీయగా.. మార్కస్ స్టోయినీస్, సీన్ అబాట్‌ తలో వికెట్ తీశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.