ETV Bharat / sports

ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్​' రేసులో వీరే..

author img

By

Published : Aug 8, 2021, 3:40 PM IST

జులై నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్' (ICC POTM) నామినేషన్లను ప్రకటించింది ఐసీసీ (ICC). పురుషుల క్రికెట్​ నుంచి ముగ్గురు, మహిళలు ముగ్గురు ఉన్నారు. వారి ప్రదర్శనలు ఎలా ఉన్నాయంటే..

shakib, mitchell march
షకిబుల్ హసన్, మిచెల్ మార్ష్

జులై నెలకు సంబంధించి 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్'​ (ICC POTM) నామినీలను ప్రకటించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) (ICC). ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించింది ఐసీసీ.

"జులై నెలకు గానూ పురుషుల క్రికెట్​ నుంచి షకిబుల్​ హసన్​ (బంగ్లాదేశ్), మిచెల్ మార్ష్ (ఆస్ట్రేలియా), హేడెన్​ వాల్ష్​ జూనియర్​ను (వెస్టిండీస్​) ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​ నామినీలుగా ఎంపిక చేశాం. మహిళల నుంచి హేలీ మాథ్యూస్​ (వెస్టిండీస్​), ఫాతిమా సనా (పాకిస్థాన్​), స్టెఫానీ టేలర్​ (వెస్టిండీస్​) పేర్లను పరిగణనలోకి తీసుకున్నాం" అని ఐసీసీ వెల్లడించింది.

షకిబుల్​ హసన్..

బంగ్లా సీనియర్​ ఆల్​రౌండర్​ షకిబుల్​ హసన్ గత నెల జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్​ను తన జట్టు గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. రెండో వన్డేలో 96 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. టీ20 సిరీస్​లో 3 వికెట్లు తీసి బంతితోనూ సత్తా చాటాడు.

మిచెల్ మార్ష్..

గత నెల విండీస్​తో జరిగిన మూడు మ్యాచ్​ల వన్డే సిరీస్​తో పాటు.. ఐదు మ్యాచ్​ల టీ20ల సిరీస్​లో మిచెల్​ మార్ష్​ ఆడాడు. పొట్టి సిరీస్​లో 219 పరుగులు చేసిన అతడు బౌలింగ్​లో 8 వికెట్లు తీసుకున్నాడు.

హేడెన్​ వాల్ష్​ జూనియర్​..

విండీస్​ లెగ్​ స్పిన్నర్ హేడెన్​ వాల్ష్​​ గత నెల ఆసీస్​తో జరిగిన వన్డే సిరీస్​లో 7 వికెట్లతో రాణించాడు. ఐదు మ్యాచ్​ల టీ20 సిరీస్​లో 12 వికెట్లు తీశాడు. ఈ రెండు సిరీస్​ల్లో విండీస్​ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్​గా నిలిచాడు.

ఇదీ చదవండి: సారథి కేన్​ మామ సక్సెస్​ మంత్రం ఇదే!

హేలీ మాథ్యూస్​..

గత నెల పాకిస్థాన్​తో జరిగిన వన్డే సిరీస్​లో విండీస్​ ఆల్​రౌండర్​ హేలీ​ మాథ్యూస్​ సెంచరీతో ఆకట్టుకుంది. బౌలింగ్​లోనూ రెండు వికెట్లతో సత్తాచాటింది. 'ప్లేయర్​ ఆఫ్ ది సిరీస్​'గా నిలిచింది.

ఫాతిమా సనా..

విండీస్​తో జరిగిన వన్డే సిరీస్​లో పాకిస్థాన్​ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్​గా ఫాతిమా నిలిచింది. ఐదో వన్డేలో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకంగా మారింది.

స్టెఫానీ టేలర్..

పాకిస్థాన్​తో పరిమిత ఓవర్ల సిరీస్​లో విండీస్​ కెప్టెన్​ స్టెఫానీ టేలర్​ ఆల్​రౌండ్​ ప్రదర్శన చేసింది. బ్యాటింగ్​లో 175 పరుగులు చేసిన స్టెఫనీ.. బంతితోనూ 3 వికెట్లు తీసింది. ఇటీవల ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్​ల్లో ఆల్​రౌండర్​గా, బ్యాటర్​గా అగ్రస్థానంలో నిలిచింది.

ఇదీ చదవండి: అందువల్లే నా ఆటలో మార్పు: బుమ్రా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.