ETV Bharat / sports

IND VS SA: 'కోహ్లీ వాటిని వదిలేయాలి.. అప్పుడే'

author img

By

Published : Jan 3, 2022, 6:53 AM IST

Gambhir about Virat Kohli: తొలి టెస్ట్​లో దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శన చేయడం వల్లే టీమ్​ఇండియాకు విజయం దక్కిందని అన్నాడు మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్. ఈ గెలుపు పట్ల తానేమీ సంతోషంగా లేనని అన్నాడు. రెండో ఇన్నింగ్స్​లో కోహ్లీ ఔటైన విధానంపై కూడా అనవసరంగా మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డాడు.

kohli
కోహ్లీ

Gambhir about Virat Kohli: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్​ రెండో ఇన్నింగ్స్​లో కోహ్లీ ఔటైన విధానంపై అనవసర రాద్దాంతం జరుగుతోందని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​​. తొలి టెస్ట్​లో భారత్​కు విజయం దక్కినా తానేమీ సంతృప్తి చెందలేదని అన్నాడు.

"స్విట్జర్లాండ్ మంచులో కుటుంబంతో కలిసి సమయాన్ని ఆస్వాదించి ఆదివారం సాయంత్రమే తిరిగొచ్చా. అక్కడ ఉంటూనే దక్షిణాఫ్రికాతో భారత తొలి టెస్టుపైనా ఓ కన్నేశా. టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్​లో 400కు పైగా పరుగులు చేస్తుందనుకున్నా. రాహుల్, మయాంక్ బలమైన పునాది వేశారు. కానీ మిడిలార్డర్ తమ పాత్ర పోషిస్తే జట్టు 327 పరుగులకే పరిమితమయ్యేది కాదు. బౌలింగ్​లో రాణించి విజయాన్ని సాధించినా ఈ ఫలితంతో నేనేమీ ఎగిరి గంతేయడం లేదు. ప్రత్యర్థి నుంచి అసలైన సవాలు ఎదురు కాలేదని భారతీయులకు తెలుసు. అత్యంత బలహీనమైన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బృందాల్లో ఇదొకటి. టెస్టుల్లో కదిలే బంతిని ఆడాలంటే అత్యుత్తమ నైపుణ్యాలుండాలి. కానీ ఈ సఫారీ బ్యాటింగ్ ఇంకా ఎదిగే దశలోనే ఉందనిపిస్తోంది. జొహన్నెస్​బర్గ్​ బ్యాటర్లకు కఠిన సవాలు విసురుతుంది. అధిక ఎత్తులో ఉండే ఈ మైదానంలో మంచి పేస్, బౌన్స్ లభిస్తుంది. విహారి లేదా శ్రేయస్ కోసం రెండో మ్యాచ్​లో అయిదుగురితో కాకుండా నలుగురు బౌలర్లతో జట్టు ఆడాలనుకుంటుందని ఎక్కడో చదివా. కానీ అది కేవలం మీడియా ఊహాగానాలేనని నా నమ్మకం. ఎక్కువ పేస్​ లభిస్తుంది కాబట్టి నేనైతే శార్దూల్ స్థానంలో ఉమేశ్​ను తీసుకుంటా. నియంత్రణతో కూడిన అతని వేగం ఈ పిచ్​పై కోహ్లికి అవసరం. గత మ్యాచ్ తొలి ఇన్నింగ్స్​లో 48 పరుగులు చేసిన రహానెకు రెండో టెస్టులోనూ చోటు దక్కుతుందనుకుంటున్నా. ద్రవిడ్ శిక్షణలో తన ఫామ్ అందుకునేందుకు పుజారాకు అవకాశాలు వస్తాయని భావిస్తున్నా. గత మ్యాచ్​లో కోహ్లీ ఔటైన విధానంపై అనవసర రాద్దాంతం జరుగుతోంది. ఇప్పుడతను ఆఫ్​స్టంప్​ ఆవల పడ్డ బంతులను ఎక్కువగా వదిలేస్తూ కొద్ది సమయం క్రీజులో గడపాలి. కొత్త ఏడాది భారత క్రికెట్​లో సరికొత్త అధ్యాయం రాబోతుంది. కానీ గెలిచినా లేదా ఓడినా అతిగా స్పందించవద్దు."

-గంభీర్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​.

రెండో టెస్ట్​ నేడు(జనవరి 3) ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్​లో గెలిచి సిరీస్​ను సొంతం చేసుకోవాలని టీమ్​ఇండియా.. సిరీస్​ను సమం చేయాలని దక్షిణాఫ్రికా భావిస్తున్నాయి. జోహనస్​బర్గ వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది.

ఇదీ చూడండి: ఆ పరిస్థితుల్లో కోహ్లీ వ్యవహరించిన తీరు అద్భుతం: ద్రవిడ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.