ETV Bharat / sports

బెంగళూరు ఈ సారైనా.. నిరీక్షణకు తెరదించేనా!

author img

By

Published : Apr 4, 2021, 6:44 AM IST

ఐపీఎల్​ 13 సీజన్లు ముగిసినా.. ఇంతవరకు ఒక్క టైటిల్​ను కూడా కైవసం చేసుకోని జట్టు రాయల్ ఛాలెంజర్స్​ బెంగుళూరు. కనీసం ఈ సారైనా కప్​ సాధించి ఆ అప్రతిష్ఠకు తెరదించాలని భావిస్తోంది. సీజన్​ ప్రారంభానికి ముందు వేలంలో విదేశీ పేసర్లను భారీ ధరకు దక్కించుకున్న ఆ జట్టు.. ఈ దఫా ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి.

special story on royal challengers Bengaluru
బెంగళూరు ఈ సారైనా.. నిరీక్షణకు తెరదించేనా!

ఐపీఎల్‌ సీజన్‌ మొదలవుతుందంటే చాలు.. "ఈ సారి కప్‌ మాదే (ఈ సాలా కప్‌ నమదే)" అనే నినాదంతో ఆ జట్టు అభిమానులు ఆవేశంతో ఊగిపోతారు. జట్టు విజేతగా నిలవాలనే ఆశలు పెట్టుకుంటారు. ఆ అంచనాలకు తగ్గట్లుగానే లీగ్‌ ఆరంభ మ్యాచ్‌ల్లో విజయాలతో ఆ జట్టు టైటిల్‌ దిశగా సాగుతుందనిపిస్తుంది. కానీ మధ్యలో తడబడి.. చివరకు నిలకడలేమితో ఉసూరుమనిపిస్తుంది. ఆ జట్టే.. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. ఇప్పటికీ 13 సీజన్లు గడిచినా ఇంకా తొలి టైటిల్‌ను ఖాతాలో వేసుకోని ఈ జట్టు.. ఈ సారైనా ఆ నిరీక్షణకు తెరదించుతుందేమో చూడాలి.

ఆకర్షణకు లోటు లేదు.. అభిమాన బలానికి తిరుగులేదు.. అగ్రశ్రేణి ఆటగాళ్లకు కొదవలేదు.. అయినా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఐపీఎల్‌లో తొలి టైటిల్‌ మాత్రం దక్కట్లేదు. ఈ సారి కచ్చితంగా విజేతగా నిలుస్తుందని సీజన్‌ వచ్చినపుడల్లా ఎదురుచూసే అభిమానులకు నిరాశ తప్పట్లేదు. లీగ్‌ చరిత్రలో ఇప్పటివరకూ మూడు సార్లు (2009, 2011, 2016) ఫైనల్‌ చేరిన ఆ జట్టు.. చివరి మెట్టుపై బోల్తాపడింది. యూఏఈలో జరిగిన గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌ చేరిన ఆర్సీబీ.. ఎలిమినేటర్‌లో ఓడి నాలుగో స్థానంతో ముగించింది. ఈ ఏడాది వేలంలో దూకుడుగా వ్యవహరించిన జట్టు భారీ ధరతో ఆల్‌రౌండర్లు మ్యాక్స్‌వెల్‌ (రూ.14.25 కోట్లు), కైల్‌ జెమీసన్‌ (రూ.15 కోట్లు)ను కొనుగోలు చేసింది. ఈ ఆటగాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించి విజయాలు అందిస్తారనే నమ్మకం పెట్టుకుంది.

మరోవైపు సారథిగా టీమ్‌ఇండియాను అన్ని ఫార్మాట్లలోనూ విజయవంతంగా నడిపిస్తున్న కోహ్లి.. ఐపీఎల్‌లో విఫలమవుతుండడంపై విమర్శలు వస్తున్నాయి. టీ20ల్లోనైనా అతణ్ని తప్పించి రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ అప్పగించాలనే చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో ఆర్సీబీని విజేతగా నిలిపి ఆ వ్యాఖ్యలకు కోహ్లి ముగింపు పలకతాడేమో చూడాలి.

బలహీనతలు..

కొన్నేళ్లుగా పేస్‌ బౌలింగ్‌ ఆర్సీబీకి బలహీనతగా మారింది. బ్యాటింగ్‌లో దూకుడుతో భారీస్కోర్లు నమోదు చేస్తున్నా.. దాన్ని కాపాడే పేసర్లు కనిపించడం లేదు. దేశీయ ఫాస్ట్‌బౌలర్లు మహమ్మద్‌ సిరాజ్‌, నవ్‌దీప్‌ సైని.. నిలకడ ప్రదర్శించట్లేదు. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇక విదేశీ పేసర్లలో కేన్‌ రిచర్డ్‌సన్‌ను అట్టిపెట్టుకున్న జట్టు.. వేలంలో జెమీసన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్‌ డానియల్‌ క్రిస్టియన్‌ను సొంతం చేసుకుంది. దిల్లీ క్యాపిటల్స్‌ నుంచి సామ్స్‌ను తెచ్చుకుంది. అయితే భారీ ధర దక్కించుకున్న జెమీసన్‌ ఇటీవలి టీ20 రికార్డు ఏమంత గొప్పగా లేదు. అతనికి భారత్‌లో ఆడిన అనుభవమూ లేదు. ఈ నేపథ్యంలో అతను ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి.

కోహ్లి, డివిలియర్స్‌పై అతిగా ఆధారపడడమూ జట్టుకు బలహీనతగా మారింది. ఈ సారి జట్టులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌ గత సీజన్‌ ప్రదర్శన పేలవం. కనీసం ఒక్క సిక్సర్‌ కూడా కొట్టలేకపోయాడు. తుది జట్టును పదేపదే మార్చడం కూడా ఆ జట్టుకు అలవాటుగా మారింది. ఒక్క ఓటమి ఎదురు కాగానే తర్వాతి మ్యాచ్‌కు జట్టులో ఆటగాళ్లను మారుస్తున్నారు. జట్టు కూర్పు విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయి. ఇక ఆరంభ మ్యాచ్‌ల్లో అదరగొట్టి.. చివరి మ్యాచ్‌ల్లో చతికిలపడే సంప్రదాయానికి ఆ జట్టు ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. గత సీజన్‌లో తన తొలి పది మ్యాచ్‌లకు గాను ఏడు విజయాలు సాధించిన ఆ జట్టు.. ఎలిమినేటర్‌తో సహా చివరి అయిదు మ్యాచ్‌లూ ఓడింది.

బలాలు..

ప్రపంచ క్రికెట్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌ ఆర్సీబీకి కొండంత బలం. ఎలాంటి బౌలింగ్‌ విభాగాన్నైనా చిత్తుచేయగల సామర్థ్యం వీళ్ల సొంతం. వీళ్లు ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ ఫలితాన్ని మార్చగల దిట్టలు. ఈ సీజన్‌ కోసం మరోసారి ఓపెనర్‌ అవతారమెత్తుతానని కోహ్లి ఇప్పటికే స్పష్టం చేశాడు. 2016లో ఓపెనర్‌గా ఆడిన కోహ్లి రికార్డు స్థాయిలో నాలుగు శతకాలతో సహా 973 పరుగులు చేశాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సారి కూడా అతను ఓపెనర్‌గా రావడం ఖాయం కాబట్టి మరోసారి దూకుడు ప్రదర్శిస్తాడని జట్టు నమ్ముతోంది.

గత సీజన్‌తోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టిన దేవ్‌దత్‌ పడిక్కల్‌ నిలకడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇటీవల అతని ఫామ్‌ కూడా గొప్పగా ఉంది. ఈ నేపథ్యంలో ఓపెనింగ్‌లో పడిక్కల్‌, కోహ్లి జోడీ రెచ్చిపోయే వీలుంది. ఇక వయసు మీద పడుతున్న వన్నె తగ్గని డివిలియర్స్‌ ఆట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అలవోకగా సిక్సర్లు బాదగల నైపుణ్యం, ఒత్తిడిలోనూ భారీ షాట్లు ఆడగల సత్తా ఉన్న అతను మరోసారి చెలరేగితే జట్టుకు తిరుగుండదు. ఇప్పుడు వీళ్లకు విధ్వంసకారుడు మ్యాక్స్‌వెల్‌ కూడా తోడయ్యాడు. దీంతో జట్టు భారీస్కోర్లు సాధించడం ఖాయమనే అభిప్రాయం ఏర్పడింది.

ఈ ఏడాది సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీలో 194.54 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించిన కేరళ వికెట్‌ కీపర్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌పైనా మంచి అంచనాలున్నాయి. వేలంలో అతణ్ని జట్టు సొంతం చేసుకుంది. మరోవైపు స్పిన్‌ విభాగం పటిష్ఠంగా ఉంది. వాషింగ్టన్‌ సుందర్‌, చాహల్‌ కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి జట్టుకు అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా సుందర్‌ పవర్‌ప్లేలో చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. మ్యాక్స్‌వెల్‌, ఆడమ్‌ జంపా స్పిన్‌ విభాగానికి అదనపు బలాన్ని అందించనున్నారు.

దేశీయ ఆటగాళ్లు:

కోహ్లీ (కెప్టెన్‌), సిరాజ్‌, షాబాజ్‌ అహ్మద్‌, కేఎస్‌ భరత్‌, చాహల్‌, సైని, దేవ్‌దత్‌ పడిక్కల్‌, ప్రభు దేశాయ్‌, సచిన్‌ బేబి, పవన్‌ దేశ్‌పాండే, సుందర్‌, హర్షల్‌ పటేల్‌, రజత్‌, మహమ్మద్‌ అజహరుద్దీన్.‌

విదేశీయులు: డివిలియర్స్‌, రిచర్డ్‌సన్‌, జంపా, మ్యాక్స్‌వెల్‌, క్రిస్టియన్‌, జెమీసన్‌, అలెన్‌, సామ్స్.‌

కీలక ఆటగాళ్లు: కోహ్లి, డివిలియర్స్‌, మ్యాక్స్‌వెల్‌, సుందర్‌, చాహల్.‌

అత్యుత్తమ ప్రదర్శన: మూడు సార్లు రన్నరప్‌ (2009, 2011, 2016).

ఇదీ చదవండి: సెహ్వాగ్ వరుస ఫోర్లు.. గంగూలీకి అర్థమైన ఆ విషయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.