ETV Bharat / sports

సీఎస్కే సారథిగా తొలి ప్రాధాన్యం ధోనీ కాదా?

author img

By

Published : Sep 12, 2020, 8:16 PM IST

ప్రారంభ ఐపీఎల్‌ సీజన్​లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్​గా ధోనీ కాకుండా వేరే ఆటగాడిని ఎంచుకోవాలని ఫ్రాంచైజీ భావించిందట. తాజాగా ఈ విషయాన్ని సీఎస్కే బ్యాట్స్​మన్​ బద్రీనాథ్​ తెలిపాడు.

MS Dhoni
ధోనీ

ఐపీఎల్​ ఫ్రాంచైజీల్లో ఇప్పటి వరకు ప్రత్యేక స్థానంలో నిలుస్తూ వచ్చిన ఫ్రాంచైజీ చెన్నై సూపర్​ కింగ్స్​. లీగ్​లో అత్యుత్తమ రెండో జట్టు ఇదే. అందుకు ప్రధాన కారణం కెప్టెన్​ ఎంఎస్​ ధోనీ. తన చతురతతో ఇప్పటివరకు మూడు సార్లు విజేతగా నిలిపాడు. అయితే, సీఎస్కే జట్టుకు కెప్టెన్​గా ధోనీ తొలి ఎంపిక కాదట. 2008లో ఐపీఎల్​ ప్రారంభానికి ముందు సారథిగా వీరేంద్ర​ సెహ్వాగ్​ను అనుకున్నట్లు ఆ జట్టు బ్యాట్స్​మన్​ ఎస్​. బద్రీనాథ్​ తెలిపాడు. ఆదివారం తన యూట్యూబ్​ ఛానెల్​ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు.

"2008లో చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథిగా తొలి ప్రాధాన్యం ఎంఎస్‌ ధోనీ కాదు. నిజానికి వారు వీరేంద్ర సెహ్వాగ్‌కు నాయకత్వం అప్పగించాలని భావించారు. ఈ విషయంపై అతడిని సంప్రదించారు. దిల్లీలోనే పుట్టి పెరగడం, అనుబంధం ఉండటం వల్ల అదే నగరానికి ఆడతానని వీరూ చెప్పాడు. అతడి అభిప్రాయంతో సీఎస్‌కే అంగీకరించింది. దాంతో సారథ్యానికి ఆటగాడు ఎవరా అని ఆలోచించింది. 2007 టీ20 ప్రపంచకప్‌ను అందించిన ధోనీని రూ.6 కోట్లు పెట్టి తీసుకుంది."

-బద్రీనాథ్​, సీఎస్కే బ్యాట్స్​మన్​

ఈ క్రమంలోనే సీఎస్కే ఒక్క దెబ్బకు మూడు పిట్టల్ని కొట్టిందని బద్రీ పేర్కొన్నాడు. 'మొదటి కారణం ఎంఎస్‌ ధోనీని మించిన సారథి లేడు. ఎందుకంటే ఐసీసీ ట్రోఫీలన్నీ గెలిచాడు. రెండోది అతడు అత్యుత్తమ మ్యాచ్‌ విజేత. టీ20ల్లో విజయాలు సాధించాలంటే మ్యాచ్‌ ఫినిషర్లు అవసరం. ముంబయి ఇండియన్స్‌లో కీరన్‌ పొలార్డ్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో ఆండ్రూ రసెల్‌ అలాంటివారే. అలా చెన్నైకి ధోనీ ఉన్నాడు. ఇక మూడోది మాహీ అత్యుత్తమ వికెట్‌ కీపర్‌. ప్రపంచంలోనే చురుకైన, తెలివైన కీపర్‌ అతడు' అని వెల్లడించాడు.

సెప్టెంబర్‌ 19న యూఏఈ వేదికగా లీగ్​ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌తో చెన్నై తలపడేందుకు సిద్ధమవుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.