టీమ్ఇండియా పేసుగుర్రం 'జస్ప్రీత్ బుమ్రా' ప్రపంచ అత్యుత్తమ టీ20 బౌలరని ఆస్ట్రేలియా పేసర్ జేమ్స్ ప్యాటిన్సన్ ప్రశంసించాడు. ఈ ఐపీఎల్లో అతడితో కలిసి బౌలింగ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపాడు. కివీస్ పేసర్ బౌల్ట్ సైతం అనుభవజ్ఞుడని పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్ టీవీతో అతడు మాట్లాడుతూ ఈ విషయాలు పంచుకున్నాడు.
'ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లతో కలిసి పనిచేయడం అద్భుతం. ఇంకా చెప్పాలంటే బుమ్రా అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ టీ20 బౌలర్. ముంబయి శిబిరంలో బౌల్ట్ కూడా ఉన్నాడు. వారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. గతంలో నేను యూఏఈలో వన్డేలు ఆడాను. అక్కడి పిచ్లపై నాకు కొంత అనుభవం ఉంది. కాలం గడిచే కొద్దీ వికెట్లు పొడిగా మారుతాయి. అందుకే స్కోర్లు తక్కువగా నమోదవుతాయి. నెమ్మది బంతులకు కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుంది' -ప్యాటిన్సన్, ముంబయి ఇండియన్స్ బౌలర్
వ్యక్తిగత కారణాలతో శ్రీలంక పేసర్ లసిత్ మలింగ ఐపీఎల్కు దూరమయ్యాడు. అతడి స్థానాన్ని ప్యాటిన్సన్తో భర్తీ చేసింది ముంబయి జట్టు. యూఏఈ పిచ్లపై అతడికి అనుభవం ఉండటమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు 39 టీ20లు ఆడిన అతడు 8.25 ఎకానమీతో 47 వికెట్లు పడగొట్టాడు. 5/33 అత్యుత్తమ ప్రదర్శన. సెప్టెంబర్ 19న జరిగే లీగ్ ఆరంభమ్యాచులో రన్నరప్ చెన్నై సూపర్కింగ్స్ను డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి తలపడనుంది.