ETV Bharat / sports

'అశ్విన్‌పై ఒత్తిడి పెంచాలనే దూకుడుగా ఆడా'

author img

By

Published : Jan 7, 2021, 9:52 PM IST

సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టు తొలి రోజు ఆటలో టీమ్​ఇండియా క్రికెటర్​ రవిచంద్రన్​ అశ్విన్​పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించానని చెప్పాడు ఆసీస్​ బ్యాట్స్​మన్​ స్మిత్​. అందుకే అతడి బౌలింగ్​లో​ దూకుడుగా ఆడినట్లు తెలిపాడు. శుక్రవారం జరిగే రెండో రోజు ఆటలోనూ బాగా ఆడతానని ధీమా వ్యక్తం చేశాడు.

smith
స్మిత్​

తొలి రెండు టెస్టుల్లో తనపై ఆధిపత్యం చెలాయించిన అశ్విన్‌పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించానని ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌స్మిత్‌ అన్నాడు. అందుకే మూడో టెస్టులో తొలి రోజు జరిగిన ఆటలో అతడి బౌలింగ్‌లో దూకుడుగా ఆడానని పేర్కొన్నాడు. మరోవైపు లబుషేన్‌ సైతం చక్కగా బ్యాటింగ్‌ చేశాడని పొగిడాడు.

"క్రీజులో ఎక్కువ సమయం గడపడం బాగుంది. మార్నస్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పడం నచ్చింది. తొలి రెండు మ్యాచుల్లో విఫలమవ్వడం వల్ల మూడో టెస్టులో అశ్విన్‌పై ఒత్తిడి పెంచాలనుకున్నా. మరికాస్త గట్టిగా బ్యాటును పట్టుకున్నా. రెండు టెస్టుల్లో ఇబ్బంది పడ్డాను. ఈ రోజు బాగానే కుదురుకున్నాను. రాగానే రెండు బౌండరీలు బాదడం నచ్చింది. లబుషేన్‌ బాగా ఆడాడు. రెండో రోజూ మేమిలాగే ఆడతామని ధీమాగా ఉన్నా"

-స్మిత్‌, ఆసీస్​ స్టార్​ బ్యాట్స్​మన్​.

టీమ్ఇండియాపై ఎప్పుడూ విరుచుకుపడే స్టీవ్‌స్మిత్‌ ఈసారి మాత్రం అంతగా రాణించలేకపోయాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ అతడిని తెలివిగా బోల్తా కొట్టించాడు. స్ర్టెయిట్‌ లైన్‌లో బంతులు విసిరి లెగ్‌సైడ్‌ ఫీల్డర్లను మోహరించి రెండుసార్లు ఔట్‌ చేశాడు. మరోసారి బుమ్రా అతడిని బౌల్డ్‌ చేశాడు. దాంతో తొలి రెండు టెస్టుల్లో అతడు పది పరుగులే చేశాడు. మూడో టెస్టు తొలిరోజు మాత్రం 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. లబుషేన్‌తో కలిసి 67 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించాడు. దాంతో తొలిరోజు ఆసీస్‌ 166/2తో నిలిచింది.

ఇదీ చూడండి : ఆసీస్​ బోర్డుకు బీసీసీఐ లేఖ.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.