ETV Bharat / sports

ఒకే ఫ్రేమ్​లో ధోనీ, జీవా.. ఫ్యాన్స్​ ఫుల్ ఖుష్

author img

By

Published : Jan 3, 2021, 9:31 PM IST

Dhoni and  his daughter Ziva photo goes viral on net
ఒకే ఫ్రేమ్​లో ధోనీ, జీవా.. ఫ్యాన్స్​ ఫుల్ ఖుష్

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ తన కూతురు జీవాతో కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో కనిపించనున్నాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్​గా మారింది.

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ ధోనీకి ఉన్న ఫాలోయింగ్‌ అంతా కాదు. క్రికెట్‌లోనే కాదు ఆయన నటించే వాణిజ్య ప్రకటనలకూ ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక ధోనీ ముద్దుల కూతురు జీవాకు ఫాలోయింగ్‌ ఎక్కువే. ఆమె పేరు మీద ఓ ఇన్‌స్టా అకౌంట్‌ (ధోనీ, సాక్షి నిర్వహిస్తుంటారు) కూడా ఉంది. అందులో ఆమె పంచుకునే ముద్దు ముద్దు ఫొటోలు నెటిజన్లను అలరిస్తుంటాయి. ఇక తండ్రీ కూతుళ్లు కలిసి ఉన్న ఫొటోలకైతే లైకులే లైకులు. అంతటి ఫాలోయింగ్‌ ఉన్న తండ్రీకూతుళ్లు ఇప్పుడు బుల్లితెరపై ప్రత్యక్షం కాబోతున్నారు. ఓ బిస్కెట్‌ కంపెనీ వాణిజ్య ప్రకటనలో కనిపించనున్నారు. జనవరి నెలాఖరులో ఈ ప్రకటన ప్రసారం కానుంది.

ఈ ప్రకటనకు సంబంధించి ఓ పోస్టర్‌ను సదరు సంస్థ ఇన్‌స్టాలో ఉంచింది. దీంతో ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఇన్నాళ్లూ సామాజిక మాధ్యమాలకే పరిమితమైన తండ్రీకూతుళ్లను త్వరలో బుల్లితెరపై చూడనున్నామన్న ఆనందంతో అభిమానులు తెగ మురిసిపోతున్నారు. మహీ, జీవా కలిసి నటించిన ఈ యాడ్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని పోస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే పలు దుస్తులు, వాహన కంపెనీలకు ప్రకటనకర్తగా ఉన్న మహీ తొలిసారి కూతురితో కలిసి తెరపంచుకోనుండగా.. జీవాకు ఇదే తొలి యాడ్‌ కావడం విశేషం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.