ఇంగ్లాండ్ పర్యటనకు ముందు భారత ఆటగాళ్లందరూ ముంబయిలో తప్పనిసరి క్వారంటైన్లోకి వెళ్లారు. మే 19 నుంచి 14 రోజుల పాటు నిర్బంధంలోకి వెళ్లింది ఇండియా జట్టు. అయితే వారికి కేటాయించిన గదుల్లోనే రెండు వారాల పాటు ఉండాలంటే ఎవరికైనా ఇబ్బందే. ఈ క్వారంటైన్ సమయాన్ని గడపడానికి కొందరు ఆటగాళ్లు సామాజిక మాధ్యమాల్లో సరదాగా గడుపుతున్నారు. మరికొందరు పుస్తకాలు చదువుతూ.. సినిమాలు చూస్తూ.. ఎక్సర్సైజ్లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. కానీ టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా మాత్రం ప్రత్యేక మార్గాన్ని ఎంచుకున్నాడు. తన కూతురు అదితితో కలిసి వీడియో గేమ్ ఆడుతున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. 'ఈమె నా క్వారంటైన్ గేమ్ భాగస్వామి' అంటూ పరిచయం చేశాడు.
ఇదిలా వుండగా, ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకు పుజారా కీలకం కానున్నాడు. గత ఆసీస్ సిరీస్లో నిలకడగా రాణించాడు ఈ వన్డౌన్ బ్యాట్స్మన్. కివీస్తో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లోనూ పుజారా రాణిస్తే భారత్కు ఎదురే ఉండదు. ఈ సిరీస్ కోసం జూన్ 2న ఇంగ్లాండ్ బయలుదేరనుంది టీమ్ఇండియా. అక్కడికి చేరుకున్నాక మరో 10 రోజులు సౌథాంప్టన్లో క్వారంటైన్కు వెళ్లనున్నారు. జూన్ 18-22వరకు ఛాంపియన్షిప్ ఫైనల్, ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14వరకు ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ జరగనుంది.
ఇదీ చదవండి: క్వారంటైన్లో టీమ్ఇండియా.. బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు!