ETV Bharat / sports

All England Championships: రెండో రౌండ్​కు సింధు, సైనా

author img

By

Published : Mar 17, 2022, 7:26 AM IST

All England Championships: ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణులు పి.వి.సింధు, సైనా నెహ్వాల్..​ రెండో రౌండుకు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్​లో సాయిప్రణీత్​.. టాప్​ సీడ్​ విక్టర్​ అక్సెల్సన్​ చేతిలో పరాజయం పాలయ్యాడు.

P.v. sindhu-saina nehwal
పి.వి.సింధు-సైనా నెహ్వాల్​

All England Championships: ఆల్‌ ఇంగ్లాండ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారిణులు పి.వి.సింధు, సైనా నెహ్వాల్‌ రెండో రౌండుకు చేరుకున్నారు. తొలి రౌండ్లో ఆరో సీడ్‌ సింధు 21-18, 21-13తో జి యి వాంగ్‌ (చైనా)పై విజయం సాధించింది. తొలి గేమ్‌లో సింధుకు గట్టి పోటీ ఇచ్చిన వాంగ్‌.. రెండో గేమ్‌లో భారత స్టార్‌ జోరు ముందు నిలవలేకపోయింది. మరో తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సైనా 21-17, 21-19తో బియాట్రెజ్‌ కొరాలెస్‌ (స్పెయిన్‌)పై చెమటోడ్చి నెగ్గింది. సింధు, సైనా తమ రెండో రౌండు మ్యాచ్‌ల్లో గెలిస్తే క్వార్టర్స్‌లో పరస్పరం తలపడతారు.

పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌.. టాప్‌ సీడ్‌ విక్టర్‌ అక్సెల్సన్‌కు తలవంచాడు. అతను 20-22, 11-21తో ఓడాడు. తొలి గేమ్‌లో అక్సెల్సన్‌కు చెమటలు పట్టించి, త్రుటిలో గేమ్‌ను చేజార్చుకున్న ప్రణీత్‌.. రెండో గేమ్‌లో తేలిపోయాడు. ప్రణయ్‌ 15-21, 22-24తో కున్లావత్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో అయిదో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజు-చిరాగ్‌ శెట్టి జోడీ 21-17, 21-19తో అలెగ్జాండర్‌ డున్‌- ఆడమ్‌ హాల్‌ (స్కాట్లాండ్‌) జంటపై నెగ్గి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. అర్జున్‌- ధ్రువ్‌ కపిల జోడీ 21-15, 12-21, 18-21తో మహ్మద్‌ ఎహసాన్‌- హెండ్ర సెతియవన్‌ (ఇండోనేసియా) జంట చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌ పుల్లెల- ట్రీసా జాలీ జంట ప్రిక్వార్టర్స్‌ చేరుకుంది. తొలి రౌండ్లో గాయత్రి- ట్రీసా జోడీ 17-21, 22-20, 21-14తో బెన్యపా-నుంతకర్న్‌ (థాయ్‌లాండ్‌) జంటపై గెలుపొందింది.

ఇదీ చదవండి: All England Championships: 21ఏళ్ల నిరీక్షణ..ఈసారైనా ఫలించేనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.