ETV Bharat / sports

Olympics: స్వర్ణం సాధించాలని.. కోటి ఆశలు సింధుపైనే

author img

By

Published : Jul 8, 2021, 5:54 PM IST

Updated : Jul 8, 2021, 7:52 PM IST

sindhu
సింధు

ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్​లో వెండి పతకంతో సరిపెట్టుకున్న భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు(PV Sindhu).. ప్రపంచ ఛాంపియన్​షిప్ టైటిల్(2019లో) గెలిచి తనపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానమిచ్చింది. మరి త్వరలో జరగబోయే ఒలింపిక్స్​లో ఆమె స్వర్ణం సాధించాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు.

రియో ఒలింపిక్స్​లో వెండి పతకంతో మెప్పించిన తెలుగు తేజం, స్టార్​ షట్లర్ పీవీ సింధు(PV Sindhu).. అనంతరం కొన్నాళ్లకు ప్రపంచ ఛాంపియన్​షిప్ టైటిల్(2019లో) గెలిచింది. ఈ ఘనత సాధించిన తొలి భారత షట్లర్​గా నిలిచింది. అయితే ఈ విజయం సాధించక ముందు ఈ మెగాటోర్నీలో రెండు రజత, కాంస్య పతకాలను గెలుచుకుంది. రెండుసార్లు ఫైనల్​ చేరినా రెండో స్థానంతోనే సరిపెట్టుకుంది. దీంతో ఆమెపై 'సిల్వర్ సింధు' అనే ముద్ర పడిపోయింది. 'కాంస్యాలు గెలిచారు.. రజతాలు సాధించారు.. మరి స్వర్ణం మాటేమిటి?' అంటూ విమర్శలు వచ్చాయి. ప్రపంచ ఛాంపియన్​షిప్​ టైటిల్​ విజయంతో ఈ ప్రశ్నలకు చెక్​ పెట్టింది. ఏదేమైనప్పటికీ టైటిల్​ విజయంతో తనపై ఉన్న ట్యాగ్​ను చెరిపేసుకున్న సింధు.. మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్​కు(Olympics) సిద్ధమవుతోంది. మెగాక్రీడల్లో ఆమె తప్పకుండా స్వర్ణం సాధించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు దేశమంతా కోరుకుంటున్నారు! ఆమెపై కోటి ఆశలు పెట్టుకున్నారు.

PV Sindu
సింధు

వారిని ప్రోత్సహించాలి

దేశంలో క్రీడారంగానికి ఆదరణ పెరుగుతుందని సింధు ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో చెప్పింది. దేశం తరఫున, వివిధ క్రీడల్లో ఆడేందుకు సిద్ధమవుతున్న అథ్లెట్లను చూస్తుంటే ఆనందంగా ఉందని తెలిపింది. వారిలో మనం స్ఫూర్తిని నింపి, సరైన ప్రోత్సాహం అందిస్తే మరింత మంది అథ్లెట్లు తయారవుతారని ధీమా వ్యక్తం చేసింది.

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు

తనను ప్రోత్సాహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణా ప్రభుత్వాలపై అభిమానాన్ని చాటుకుంది సింధు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఆమెకు డిప్యూటీ కలెక్టర్​ బాధ్యతల్ని అప్పగించింది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. మరోవైపు ఇటీవలే ఆమె ప్రతిభకు మెచ్చి ప్రస్తుత ఏపీ ప్రభుత్వం రూ.5 లక్షల చెక్​ను అందించింది. సింధు పేరిట బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్‌కు రెండు ఎకరాల భూమిని కేటాయించింది. విశాఖ గ్రామీణ మండలం చినగదిలిలో భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

"రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు నా కృతజ్ఞతలు. నాకెప్పుడు ఎటువంటి సాయం కావాలన్నా అందిస్తారు. టోర్నీలు ఉన్నప్పుడు ఆన్​డ్యూటీ లీవ్​లు ఇస్తారు. అందుకు నేను రుణపడి ఉంటాను. వారు క్రీడాకారులను అర్థం చేసుకుని ప్రోత్సాహిస్తున్నారు. లాక్​డౌన్​ సమయంలోనూ అకాడమీ శిక్షణ కోసం ప్రయాణించేందుకు ప్రత్యేకంగా అనుమతినిచ్చారు" అని సింధు చెప్పింది.

PV Sindu
సింధు

ఆల్​ ది బెస్ట్​

దేశంలో తరఫున ఈ మెగాక్రీడల్లో పాల్గొనే ప్రతిఒక్క అథ్లెట్​ బాగా ఆడాలని ఆకాంక్షించింది సింధు. వారందరికీ శుభాకాంక్షలు తెలిపింది. అంతకముందు కంటే ఈసారి భారత్​ ఎక్కువ పతకాలు సాధించాలని సింధు ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ మెగాక్రీడల్లో తన ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు కొత్త నైపుణ్యాలు, టెక్నిక్స్​ నేర్చుకుంటున్నట్లు సింధు చెప్పింది. వాటిని అమలు చేసేలా నిరంతరం సాధన చేస్తున్నట్లు వెల్లడించింది.

అత్యయిక స్థితి

గతేడాది జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌.. కరోనా కారణంగా ఏడాది వాయిదా పడ్డాయి. వైరస్‌ ఉద్ధృతి కాస్త నెమ్మదించడం వల్ల జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యోలో కొవిడ్‌ నియమ నిబంధనలతో జరగనున్నాయి. మొత్తం 115 మంది భారత క్రీడాకారులు ఇందులో పాల్గొననున్నారు. ప్రారంభ వేడుకలో త్రివర్ణ పతాకాన్ని చేతబూని భారత బృందాన్ని నడిపించే అవకాశం దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌, జాతీయ పురుషుల హాకీ జట్టు సారథి మన్‌ప్రీత్‌ సింగ్‌లకు దక్కింది. భారత ఒలింపిక్‌ కమిటీ (ఐఓఏ) సోమవారం వీళ్లిద్దరినీ పతాకధారులుగా ప్రకటించింది. రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పునియా ముగింపు వేడుకల్లో పతాకధారిగా వ్యవహరిస్తాడు. అయితే ఒలింపిక్స్​కు ఆతిథ్యమిస్తున్న టోక్యో నగరంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం అత్యయిక స్థితిని విధిస్తున్నట్లు గురువారం(జులై 8) ప్రకటించింది.

ఇదీ చూడండి:

PV sindhu: పీవీ.సింధు బ్యాడ్మింటన్ అకాడమీ, స్పోర్ట్స్ స్కూల్‌కు భూమి కేటాయింపు

Olympics: కొత్త టెక్నిక్స్​తో సింధు.. ఒలింపిక్స్​కు రెడీ

Last Updated :Jul 8, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.