ETV Bharat / sitara

'మాస్​ మంత్రం'తో బాలీవుడ్​ను ఢీ కొట్టిన టాలీవుడ్!

author img

By

Published : Feb 12, 2022, 7:44 AM IST

tollywood overtake bollywood
kgf 2

Tollywood Overtake Bollywood: బాలీవుడ్‌ అంటే చిత్ర పరిశ్రమలకు అన్నింటికీ పెద్దన్నలా ఉండేది. వసూళ్ల పరంగా రికార్డుల మోత మోగించేది. దేశవ్యాప్తంగా బాలీవుడ్‌ సినిమాలకు మంచి రీచ్‌ ఉండటం వల్ల భారీ వసూళ్లు దక్కేవి. ప్రాంతీయ భాషా చిత్రాల పరిధి కొంతవరకే ఉండేది. దక్షిణాది చిత్రాలంటే కాస్త చిన్నచూపు అనే విమర్శ కొనసాగేది. 'బాహుబలి'తో బాలీవుడ్‌కే కాదు ప్రపంచ సినిమాకు దక్షిణాది సినిమా సత్తా ఏంటో తెలిసింది. క్రమంగా బాలీవుడ్‌ను దాటి ముందుకు వడివడిగా అడుగులు వేస్తోంది దక్షిణాది సినిమా. 'పుష్ప' దక్షిణాదిలో ఎంత హిట్‌ అయ్యిందో అంతే గొప్పగా హిందీ ప్రేక్షకుల్ని అలరించింది. అక్కడే రూ.100కోట్లు పైనే వసూలు చేసి ఔరా అనిపించింది. దీనికి మన మాస్‌ మంత్రమే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Tollywood Overtake Bollywood: 'బాహుబలి', 'కేజీఎఫ్‌' చిత్రాల తర్వాత దక్షిణాది భారీ చిత్రాలన్నీ పాన్‌ ఇండియా వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. 'పుష్ప' భారీ విజయంతో ఈ వేగం రెట్టింపైంది. అదే సమయంలో బాలీవుడ్‌లో ఒకప్పటి వేగం కనిపించడం లేదంటున్నారు సినీ విమర్శకులు. బాలీవుడ్‌ స్థానాన్ని దక్షిణాది చిత్రాలు ఆక్రమించడం మొదలైంది అంటున్నారు. కరోనా మొదలయ్యాకా ఒకటి రెండు బాలీవుడ్‌ సినిమాలు విడుదలైనా వావ్‌ అనిపించేలా సత్తా చాట లేదు. ఇదే సమయంలో దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు చిత్రసీమ భారీ విజయాలు అందుకుంది. "దక్షిణాది చిత్రాలు హిందీ చిత్రాలను దాటేస్తున్నాయి. బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది సినిమాల శాటిలైట్‌ హక్కులూ భారీ ధర పలుకుతున్నాయి. బాక్సాఫీసు వద్ద వసూళ్లు అదే స్థాయిలో ఉంటున్నాయి" అంటున్నారు 'పుష్ప' హిందీ హక్కులు దక్కించుకున్న మనీష్‌షా.

బాలీవుడ్‌ ఎందుకిలా!

బాలీవుడ్‌ నుంచి భారీ సినిమా వస్తుందంటే ఇతర అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ అంచనాలుండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి నెమ్మదిగా మారుతుంది అనేది స్పష్టంగా తెలుస్తోంది. భారీ బాలీవుడ్‌ చిత్రాలు మూస దారిలో వెళుతున్నాయి. కథలో కొత్తదనం ఉండటం లేదు, ఎక్కువమందికి చేరువయ్యే కథలు రావడం లేదు.. ఇలాంటి వ్యాఖ్యలు బాలీవుడ్‌పై సర్వసాధారణమయ్యాయి. ఇటీవలే అజిత్‌తో 'వలిమై' చిత్రాన్ని నిర్మించిన బోనీ కపూర్‌ మాట్లాడుతూ "దక్షిణాది సినిమాల్లో యాక్షన్‌, డ్రామా, కామెడీ.. ఈ మూడు బాగా ఉంటున్నాయి. ఇవే మాస్‌ ప్రేక్షకులకు బాగా చేరువచేస్తున్నాయి" అంటున్నారు.

అంచనాల పాన్‌ ఇండియా

దక్షిణాది భాషల్లోని అగ్ర హీరోల చిత్రాలన్నీ పాన్‌ ఇండియా బాట పట్టడానికి కారణం బాలీవుడ్‌ ప్రేక్షకుల నుంచి దక్కుతున్న ఆదరణే. ప్రముఖ దర్శకుడు రాజమౌళి 'ఆర్‌ఆర్‌ఆర్‌', ప్రభాస్‌ 'రాధేశ్యామ్‌', 'కేజీఎఫ్‌ 2', 'లైగర్‌' ఇలా పలు దక్షిణాది చిత్రాలు పాన్‌ ఇండియా స్థాయిలో భారీ విజయాలు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈసారి మరిన్ని విజయాలు దక్కితే అటు ఇటు కావడం ఖాయమనే మాటలూ వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌ను దాటి దక్షిణాది సినిమాలు దూసుకుపోవడం తథ్యం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇదే జరిగితే ఎక్కువ లాభపడేది మన తెలుగు పరిశ్రమే.

మాస్‌ని ఆకట్టుకోవడంలో విఫలం

"కొన్ని ఏళ్లుగా బాలీవుడ్‌లో ఎక్కువ శాతం మందికి చేరువయ్యే సినిమాలు రావడం లేదు. సల్మాన్‌ఖాన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, ఆమిర్‌ఖాన్‌ లాంటి పెద్ద హీరోల చిత్రాలూ మల్టీప్లెక్స్‌ ప్రేక్షకులకే పరిమతం అయ్యేలా ఉంటున్నాయి. రాజ్‌కుమార్‌ రావ్‌, ఆయుష్మాన్‌ ఖురానా లాంటి వారి పరిధి కొంత వరకే ఉంటుంది. అంతేకానీ రూ.300కోట్లు వసూళ్లు సాధించే పరిస్థితి లేదు. అందుకే మాస్‌ నాడి పట్టుకున్న 'బాహుబలి', 'కేజీఎఫ్‌', 'పుష్ప' చిత్రాలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల మనసుని గెలిచేశాయి.

ఇదీ చూడండి: 1484 రోజుల తర్వాత రణ్​బీర్​.. సాంగ్​ ప్రోమోతో మహేశ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.