ETV Bharat / sitara

'చిరు చేయలేకపోయారు.. అందుకే చరణ్​తో ఆ సీన్ చేయించా'

author img

By

Published : Nov 16, 2021, 2:06 PM IST

magadheera horse scene
మగధీర-రాజమౌళి

'మగధీర'లోని చరణ్​ను గుర్రం కాపాడే సీన్​ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు దర్శకుడు రాజమౌళి. చిరంజీవి సినిమా నుంచి దానిని స్ఫూర్తి పొంది తెరకెక్కించానని అన్నారు.

సాధారణ సన్నివేశాన్ని సైతం తన టేకింగ్‌తో భావోద్వేగంగా మలిచి ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేయడంలో సిద్ధహస్తులు దర్శక ధీరుడు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. అందుకే ఆయన తీసే సినిమాలు ప్రేక్షకులను అలరించడమే కాదు, బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తాయి. ఇక ఎమోషనల్‌ సన్నివేశాలు, హీరో ఎలివేషన్‌ సీన్స్‌ తీయడంలో ఆయనను కొట్టిన వారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన 'మగధీర' రామ్‌చరణ్‌ కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకుంది. అందులోని ఓ సన్నివేశం భావోద్వేగభరితంగా రావడానికి చిరంజీవి నటించిన 'కొదమ సింహం' చిత్రమే కారణమని రాజమౌళి ఇటీవల చెప్పుకొచ్చారు.

"నేను చిరంజీవిగారికి పెద్ద అభిమానిని. అప్పట్లో థియేటర్‌లో 'కొదమసింహం' సినిమా చూస్తున్నా. అందులో రౌడీలు చిరును పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి వెళ్లిపోతారు. అక్కడే ఉన్న ఆయన గుర్రం ఆయన నోటికి తాడు అందించి కాపాడుతుంది. ఆ సీన్‌ చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యా. అయితే, ఆ కష్టంలో నుంచి బయటకు వచ్చిన ఆయనకు, గుర్రానికీ అనుబంధం లేదనిపించింది. చాలా నిరుత్సాహ పడిపోయా. నా దృష్టిలో అక్కడ అది గుర్రం కాదు. ప్రాణాలు కాపాడిన ఒక వ్యక్తి. మనకు సాయం చేసిన ఒక వ్యక్తికి థ్యాంక్స్‌ చెప్పకపోతే ఆ భావోద్వేగం ఎలా సంపూర్ణమవుతుంది? అనిపించింది. అది నా మైండ్‌లో అలాగే ఉండిపోయింది. ఒక ప్రేక్షకుడిగా అప్పుడు నా ఎమోషన్ తృప్తి చెందలేదు. అందుకే 'మగధీర'లో ఇసుక ఊబిలో కూరుపోయిన చరణ్‌ బయటకు వచ్చిన తర్వాత తన గుర్రాన్ని కౌగలించుకుంటాడు. ఒక స్నేహితుడిలా చూస్తూ దానితో కృతజ్ఞత భావంతో మాట్లాడతాడు. అలా నా సినిమాల్లో బలమైన సన్నివేశాలు ప్రేక్షకుల ఆలోచనల నుంచి స్ఫూర్తి పొంది రాసినవే ఉంటాయి" అని రాజమౌళి చెప్పుకొచ్చారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా 'ఆర్ఆర్ఆర్‌' విడుదలకు సిద్ధమవుతోంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. ఆలియా భట్‌, అజయ్‌దేవ్‌గణ్‌, ఓలివియా మోరిస్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.