ETV Bharat / sitara

సంక్రాంతికి అగ్రహీరోల పోరు.. బాక్సాఫీస్​ బద్దలే!

author img

By

Published : Aug 3, 2021, 7:42 AM IST

Updated : Aug 3, 2021, 9:14 AM IST

ఒక మామూలు సినిమాకు హిట్‌ స్థాయి వసూళ్లు తీసుకురాగలిగే సత్తా సంక్రాంతికి ఉంటుంది. ఇక 'బాగుంది' అనే పేరొచ్చిందంటే మాత్రం రికార్డులు నమోదు కావడం ఖాయం. సంక్రాంతి సీజన్‌ అంటే తెలుగు పరిశ్రమకు అంత మక్కువ. ఎన్ని సినిమాలొచ్చినా చూసేందుకు ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారనేది పరిశ్రమ వర్గాల నమ్మకం. పదిహేను రోజులపాటు సాగే ఆ సీజన్‌లో మూడు నాలుగు సినిమాలు సందడి చేస్తుంటాయంటే కారణం అదే. అయితే అగ్ర తారల సినిమాలు మాత్రం రెండుకు మించి విడుదల కావు. అలా విడుదల చేస్తే వసూళ్లకి గండి పడుతుందనే ఓ భయం. రెండు అగ్ర తారల చిత్రాలు.. మరో చిన్న సినిమా. వీటికితోడు ఓ అనువాద చిత్రం. ఇప్పటిదాకా ఇదే లెక్కలోనే సంక్రాంతి చిత్రాలు విడుదలవుతూ వచ్చాయి. కానీ వచ్చే పండగకి మాత్రం ఈ లెక్క మరో రకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

sankranthi movies 2021
సంక్రాంతి సినిమాలు

అగ్ర కథానాయకుల్లో చాలా మంది గురి సంక్రాంతిపైనే పడింది. ఇప్పటికే 'సర్కారు వారి పాట', 'రాధేశ్యామ్‌'తోపాటు పవన్‌కల్యాణ్‌ - రానా నటిస్తున్న 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' రీమేక్‌.. ఈ మూడూ ముగ్గుల పండక్కి బెర్తులు ఖాయం చేశాయి. మరికొన్ని రేసులో కనిపిస్తున్నాయి. చివరికి పక్కాగా పండగ బరిలో నిలిచే సినిమాలు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. రెండో దశ కరోనా మొదలు కాక ముందు వరకూ 2022 సంక్రాంతి బరిలో రెండు సినిమాలే కనిపించాయి. ఒకటి.. పవన్‌కల్యాణ్‌ 'హరి హర వీరమల్లు', మరొకటి 'సర్కారు వారి పాట'. కరోనా తర్వాత కొత్త చిత్రాలు తెరపైకొచ్చాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'హరి హర వీరమల్లు' స్థానంలో, పవన్‌కల్యాణ్‌ కొత్త చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' రీమేక్‌ జనవరి 12న రానుంది.. మహేష్‌ 'సర్కారు వారి పాట' ముందు చెప్పినట్టుగానే పండగ కోసమే ముస్తాబవుతుండగా, 'రాధేశ్యామ్‌' అనూహ్యంగా జనవరి 14న అంటూ విడుదల తేదీని ఖాయం చేసింది. దాంతో సంక్రాంతి బరి మరింత రసవత్తరంగా మారింది.

వసూళ్లు సాధించాలంటే..

కొన్నేళ్లుగా అగ్ర తారల సినిమాల నిర్మాణ వ్యయం భారీ స్థాయిలో ఉంటోంది. రూ.వందల కోట్ల వ్యయంతో రూపొందుతున్నాయి. 'రాధేశ్యామ్‌' పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. 'అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌' రీమేక్‌ మల్టీస్టారర్‌ చిత్రం. 'సర్కారు వారి పాట' కూడా భారీ హంగులతో రూపుదిద్దుకొంటోంది. ఇలాంటి మూడు చిత్రాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తాయంటే బాక్సాఫీసు కళకళలాడటం ఖాయం. కానీ థియేటర్ల సర్దుబాటు ఎలా? అనేదే ప్రశ్న. అగ్ర తారల చిత్రాలు మంచి ప్రారంభ వసూళ్లు సాధించాలంటే సోలోగా విడుదల కావల్సిందే అని, పండగ రోజుల్లో అయితే రెండు సినిమాలైనా ఫర్వాలేదనేది సినీ వ్యాపార వర్గాల మాట. కానీ ఇప్పటివరకు లెక్క ప్రకారం ఇక్కడ ఏకంగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఇప్పటివరకైతే 'రాధేశ్యామ్‌' చిత్రీకరణ మాత్రమే పూర్తయింది. మిగిలినవన్నీ సెట్స్‌పైనే ఉన్నాయి.
కొన్నాళ్లుగా 'విడుదల తేదీలు ప్రకటించడం కోసమే' అన్నట్టుగా మారింది వరస. అప్పటి పరిస్థితుల మేరకు చిత్రబృందాలు హడావుడిగా విడుదల తేదీల్ని ప్రకటించేస్తున్నాయి. తీరా విడుదల సమయానికి ఇంకా పూర్తి కాలేదని వాయిదా వేస్తున్నాయి. కరోనా ప్రభావంతో ఏళ్లపాటు సెట్స్‌పైనే మగ్గుతున్న సినిమాలు చాలానే. ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. మరి ఈ సంక్రాంతి సినిమాల జాబితా ఇలాగే ఉంటుందా, లేక మార్పులు చేర్పులుంటాయా అనేది చూడాలి.

వీళ్లూ పండగకేనా?

పవన్‌కల్యాణ్‌ - రానా, మహేష్‌బాబు, ప్రభాస్‌... వీళ్లే కాదు. సీనియర్‌ హీరోలు వెంకటేష్‌, నాగార్జున కూడా సంక్రాంతే లక్ష్యంగా సినిమాలు చేస్తున్నారు. వెంకటేష్‌ - వరుణ్‌తేజ్‌ హీరోలుగా 'ఎఫ్‌3' పెద్ద పండగ కోసమే ముస్తాబవుతోంది. 'ఎఫ్‌2' కూడా ఆ సీజన్‌లోనే వచ్చి విజయాన్ని సొంతం చేసుకుంది. 'ఎఫ్‌3' కూడా పండగకి పక్కా అని ఇటీవల వెంకటేష్‌ స్వయంగా 'నారప్ప' వేడుకలో ప్రకటించారు. నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్నినాయనా' కూడా పండగకే విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకు ప్రీక్వెల్‌గా 'బంగార్రాజు' చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు. అది కూడా సంక్రాంతే లక్ష్యంగా సెట్స్‌పైకి వెళుతోంది. భారీ చిత్రాలకి తోడు తమిళం నుంచి వచ్చే అనువాద చిత్రాలు.. పరిమిత వ్యయంతో రూపొందిన చిత్రాలు ఉండనే ఉంటాయి. ఇవన్నీ అనుకున్నట్టుగానే విడుదలైతే 2022 జనవరి ఎప్పటికీ గుర్తుండిపోవడం ఖాయం.

ఇదీ చదవండి:యాక్షన్ థ్రిల్లర్​లో సందీప్, విజయ్​ సేతుపతి

Last Updated : Aug 3, 2021, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.