సినిమాల్లో వెండితెరపై నాయకుడే హీరో.. కానీ, తెరవెనుక నాయకుడు మాత్రం దర్శకుడే. అయితే చిత్ర పరిశ్రమలో ఎంతోమంది నటులు, దర్శకులుగా మారిన సందర్భాలున్నాయి. కానీ, దర్శకులుగా రాణిస్తున్న వారు.. నటులుగా మారడం మాత్రం చాలా అరుదు. చిత్రపరిశ్రమలో దర్శకులుగా గుర్తింపు తెచ్చుకుని.. నటనతోనూ ప్రేక్షకులను మెప్పిస్తున్న వారి గురించి తెలుసుకుందాం.
తరుణ్ భాస్కర్
![Directors who have turned as actors](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10543965_tarun.jpg)
'పెళ్లిచూపులు' సినిమాతో ఘనవిజయం అందుకున్నారు దర్శకుడు తరుణ్భాస్కర్. 'మహానటి', 'ఫలక్నూమ దాస్', 'సమ్మోహనం', 'మిడిల్ క్లాస్ మెలొడిస్' చిత్రాల్లో నటుడిగానూ మెప్పించారు. 'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో హీరోగానూ నిరూపించుకోనున్నారు. 'పెళ్లిచూపులు'తో విజయ్ దేవరకొండను తరుణ్ హీరోని చేయగా.. ఈ చిత్రానికి విజయ్ నిర్మాతగా వ్యవహరించి.. తరుణ్ను హీరోగా చూపించారు.
గౌతమ్ మేనన్
![Directors who have turned as actors](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10543965_gautham.jpg)
గౌతమ్ మేనన్.. ప్రేమకథలతో యువతరంలో విశేష గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. అయితే ఎప్పుడూ మైక్ పట్టి సినిమాలకు కెప్టెన్గా వ్యవహరించే గౌతమ్ మేనన్.. కెరీర్ ప్రారంభం నుంచే కొన్ని అతిథి పాత్రలు చేస్తూ వచ్చారు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ 'కనులు కనులను దోచాయంటే' చిత్రంలో కీలకపాత్రలో నటించారు. ఈయన దర్శకుడిగా, నటుడిగానే కాకుండా అనేక చిత్రాలను నిర్మాతగా, సింగర్గానూ ప్రేక్షకులను అలరించారు.
ఎస్జే సూర్య
![Directors who have turned as actors](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10543965_sj1.jpg)
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ 'వాలీ' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు ఎస్జే సూర్య. ఆ తర్వాత తమిళ, తెలుగు భాషల్లో 'ఖుషి' సినిమా హిట్టుతో స్టార్ డైరెక్టర్గా మారారు. దర్శకత్వంతో పాటు కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లోనూ మెరిశారు. తమిళ చిత్రం 'న్యూ'తో కథానాయకుడిగా వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మహేశ్బాబు 'స్పైడర్', విజయ్ 'అదిరింది' సినిమాల్లో ప్రతినాయక పాత్రల్లో సూర్య మెప్పించారు.
సముద్రఖని
![Directors who have turned as actors](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10543965_samudrakani.jpg)
'ఉన్నై చరణదైంధేన్' అనే తమిళ చిత్రానికి రచయితగా పనిచేసి.. 'నీరంజా మనసు'తో దర్శకుడిగా మారారు సముద్రఖని. ఆ తర్వాత 'శంభో శివ శంభో'తో తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్గా పరిచయమయ్యారు. చాలా చిత్రాల్లో అతిధి పాత్రలు చేస్తూనే పూర్తిస్థాయి నటుడిగా తన ప్రతిభను బయటపెట్టారు. గతేడాది వచ్చిన 'అల వైకుంఠపురములో'తో పాటు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన 'క్రాక్' చిత్రంలో ప్రతినాయకుడిగా మెప్పించారు. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్'లో కీలకపాత్రలో నటిస్తున్నారు.
కె.రాఘవేంద్రరావు
![Directors who have turned as actors](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10543965_krr.jpg)
టాలీవుడ్ చరిత్రలో ఎన్నో మరపురాని చిత్రాల్ని అందించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు. ఎప్పుడూ తెర వెనుక ఉండి నటీనటులను డైరెక్ట్ చేసిన ఈయన తొలిసారి కెమెరా ముందుకు రానున్నారు. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఈ చిత్రానికి దర్శకుడు. అందులో నలుగురు కథానాయికలు ఉంటారని సమాచారం. ఈ విషయాన్ని తనికెళ్ల భరణి.. 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైనప్పుడు వెల్లడించారు.
వివి వినాయక్
![Directors who have turned as actors](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10543965_vinayak.jpg)
ఎన్నో మాస్ చిత్రాలను రూపొందించి వివి వినాయక్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ ప్రారంభంలో ఫ్యాక్షన్ నేపథ్య కథలతో ప్రేక్షకులకు మరింత దగ్గర్యయ్యారు. అయితే ఇప్పుడు హీరోగానూ సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. 'సీనయ్య' సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మరోవైపు పవన్-రానా నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్లోనూ కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: