ETV Bharat / sitara

మలయాళ రీమేక్​లో బాలయ్య-రానా!

author img

By

Published : Apr 1, 2020, 5:21 AM IST

Bala krishna and rana share the screen for Malayalam Flim ayyappanum koshiyum
మలయాళ రీమేక్​లో బాలకృష్ణ-రానా!

మలయాళంలో సూపర్​హిట్​గా నిలిచిన 'అయ్యప్పానుమ్​ కొషియుమ్​' సినిమాకు తెలుగు రీమేక్​ తెరకెక్కబోతోంది. ఈ సినిమా హక్కులను ఇటీవలే సితార ఎంటర్​టైన్మెంట్స్​ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ-రానాలు కలిసి నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.

గత కొంతకాలంగా అడపాదడపా మల్టీస్టారర్‌ సినిమాలు తళుక్కున తెలుగు తెరపై మెరుస్తున్నాయి. ముఖ్యంగా అగ్ర కథానాయకులు, యువ హీరోలతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. కరోనా ప్రభావంతో ప్రస్తుతం సినిమా షూటింగ్‌లేవీ జరగడం లేదు. ఇప్పటికే కొంత మేర చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమాలకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుండగా.. దర్శకులు, కథానాయకులు కొత్త సినిమా కథల ఎంపికలో బిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే పలువురు నిర్మాతలు కొత్త కథలను సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ 'అయ్యప్పానుమ్‌ కొషియుమ్‌' అనే మలయాళ చిత్ర రీమేక్‌ హక్కులు కొనుగోలు చేసింది.

పృథ్వీరాజ్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో నందమూరి బాలకృష్ణతో చేయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్‌ నడిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో మరో పాత్ర కోసం యువ కథానాయకుడు రానాను సంప్రదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌ విషయమై రానాతో సితార బృందం చర్చలు జరిపిందని టాక్‌. త్వరలోనే దర్శకుడ్ని ఎంపిక చేయనున్నారట. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం రానా 'అరణ్య', 'విరాట్‌ పర్వం' చిత్రాల్లో నటిస్తున్నాడు. తేజ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు. మరోవైపు బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. గతంలో బాలకృష్ణ-రానాలు ఎన్టీఆర్‌ బయోపిక్‌లో కలిసి నటించారు. రానా వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'నెంబర్‌ 1 యారీ విత్‌ రానా' కార్యక్రమంలో బాలకృష్ణ చేసిన సందడి ప్రేక్షకులను విశేషంగా అలరించింది.

ఇదీ చూడండి.. ఆ బయోపిక్​కు నో చెప్పిన బాలయ్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.