ఇంటర్నెట్ ఎలా ప్రారంభమైంది? ఎవరు నియంత్రిస్తారు?

author img

By

Published : Aug 16, 2021, 10:01 AM IST

ఇంటర్నెట్

మొబైల్, కంప్యూటర్ , ట్యాబ్లెట్… ఇలా ఏదైనా ఇంటర్నెట్ లేకుంటే దాని ఉపయోగం పరిమితమే. అప్డేట్స్ చూడాలన్నా, స్నేహితులతో ముఖా ముఖి మాట్లాడాలన్నా ఇంటర్నెట్ కావాలి. అలాంటి ఇంటర్నెట్ ఎలా ప్రారంభమైంది? అది రాకముందు సమాచార మార్పిడి ఎలా జరిగేది? ఇంటర్నెట్​ను ఎవరైనా నియంత్రిస్తారా?

ప్రస్తుతం ఆధునిక యుగంలో ఇంటర్నెట్ లేని మానవ జీవితం ఊహించుకోవటం కష్టమే. ప్రభుత్వ సేవలు, బ్యాంకుల కార్యకలాపాలు, టికెట్ బుకింగ్​లు, హోటల్ బుకింగ్స్​, ఆన్​లైన్​ షాపింగ్, టెలీ వైద్యం.. ఇలా దాదాపు అన్ని అవసరాలకు ఇంటర్నెట్ తప్పనిసరైంది. అంతేకాకుండా సమాచార మార్పిడికి కూడా ఇంటర్నెట్​ ఎంతో కీలకమైంది. మనం రోజూ ఉపయోగించే వాట్సాప్, ఇన్​స్టాగ్రామ్ వంటివి కూడా ఇంటర్నెట్​ ద్వారా మాత్రమే పని చేస్తాయి.

ఇంటర్నెట్​తో సమాచారం వేరే వారికి చేరవేయటం చాలా సులభతరం అయిపోయింది. దీని కంటే ముందు ప్రజలు సమాచార మార్పిడి కోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చేది. పురాతన కాలంలో సమాచారం అందించాలంటే ఒక వ్యక్తి వెళ్లి అవతలి వారికి చెప్పాల్సి వచ్చేది. ఈ పద్ధతి ద్వారా సమాచారం బదిలీ అయ్యేందుకు చాలా సమయం పట్టేది. కొంత కాలం తర్వాత పావురాల ద్వారా లేఖల రూపంలో సమాచార బదిలీ జరిగేది. దీని ద్వారా కొంత సమయం తగ్గినప్పటికీ ప్రస్తుతంతో పోలిస్తే ఎక్కువే.

సాంకేతికత..

సాంకేతికత అభివృద్ధి చెందటం వల్ల 19వ శతాబ్దంలో టెలిగ్రాఫ్ అనేది వచ్చింది. దీని ద్వారా సంక్షిప్తంగా సమాచారం పంపే వెసులుబాటు వచ్చింది. అదే శతాబ్దంలో పోస్టుల ద్వారా సమాచారాన్ని పంపించటం కూడా అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ల్యాండ్​లైన్​ ఫోన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

20వ శతాబ్దంలో కమ్యూనికేషన్​కు సంబంధించి భారీ మార్పులు వచ్చాయి. కంప్యూటర్ అనేది అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా నిల్చున్న చోటు నుంచే ఫోన్ చేసే విధంగా మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చాయి. ఇదే దశాబ్దంలో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. ఆధునిక సమాచార మార్పిడికి ఆధారంగా ఉంది.

ఇంటర్నెట్ ఎలా ప్రారంభమైంది?

ప్రభుత్వ పరిశోధనల ద్వారా ఇంటర్నెట్ అనేది ప్రారంభమైంది. 1960వ దశకంలో కంప్యూటర్లు చాలా పెద్దవిగా ఉండేవి. సమాచార బదిలీ కోసం కంప్యూటర్ టేప్ లను పోస్టు ద్వారా పంపించాల్సి వచ్చేది. లేదా స్వంతహాగా ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ వద్దకు వెళ్లాల్సి వచ్చేంది.

అమెరికా-యూఎస్ఎస్ఆర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న సమయంలో అణు యుద్ధ భయాలుండేవి. 1960 అక్టోబర్​లో ప్రపంచంలోనే మొదటి కృత్రిమ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీనితో అణు యుద్ధం సంభవించినప్పటికీ కమ్యూనికేషన్ ఉండేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అమెరికా రక్షణ శాఖ భావించింది. మిలిటరీ పరిశోధన విభాగం అయిన ఆర్పా(అడ్వాన్స్​డ్​ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ)కి కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం నిధులు సమకూర్చింది. ఇది పలు కంప్యూటర్లను కలుపుతూ ఆర్పానెట్ ను అభివృద్ధి చేసింది. తరువాతి కాలంలో ఇది పరిశోధన, విశ్వవిద్యాలయాలను కూడా కనెక్ట్ చేసింది.

అర్పానెట్ పరిమిత స్థాయిలో మాత్రమే ఉండేది. రక్షణ శాఖతో ఒప్పందం ఉన్న కొన్ని పరిశోధన, విద్యా సంస్థలకు మాత్రమే పరిమితమైంది.

పుట్టింది 1983...

జనవరి 1,1983 ను ఇంటర్నెట్ పుట్టిన రోజుగా పరిగణించవచ్చు. దీని కంటే ముందు కంప్యూటర్ల నెటవర్క్​ల మధ్య కమ్యూనికేషన్ కోసం ప్రామాణికతలు లేవు. టీసీపీ(ట్రాన్స్ ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్)/ఐపీ(ఇంటర్నెట్ ప్రోటోకాల్) అనే ప్రామాణిక కమ్యూనికేషన్ ఏర్పాటు అయింది. జనవరి 1, 1983న ఆర్పానెట్, డిఫెన్స్ డాటా నెటవర్క్ కూడా టీసీపీ, ఐపీలోకి మారాయి. ఈ విధంగా ఇంటర్నెట్ అభివృద్ధి అయింది.

ఎవరు నియంత్రిస్తారు?

ఇంటర్నెట్​కు సంబంధించిన పలు సాంకేతికతలు అమెరికా చేతిలో ఉన్నాయి. అమెరికాకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ ఐకాన్న్(ఇంటర్నెట్ కార్పోరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ ) ఇంటర్నెట్​కు సంబంధించిన వెన్నుముక లాంటి డొమైన్ నేమ్ సిస్టమ్(సులభంగా చెప్పాలంటే వైబ్ సైట్ అడ్రస్) ను నిర్వహిస్తుంది. ఇందులో వైబ్​సైట్​ పేరు, దానికి సంబంధించిన ఐపీ అడ్రస్ ఉంటాయి. ఒక వైబ్​సైట్ అడ్రస్​ను బ్రౌజర్లో ఎంటర్ చేయగానే డీఎన్ఎస్ ద్వారా సంబంధింత ఐపీకి రూట్ అవుతుంది.

ఈ డీఎన్ఎస్ 13 రూట్ సర్వర్ల ద్వారా ఆపరేట్ అవుతుంది. వివిధ దేశాల పరిధిలో 130 ప్రాంతాల్లో రూట్ సర్వర్లు ఉన్నాయి. ఒక రూట్ సర్వర్ పలు దేశాల్లో ఉండే అవకాశం ఉంది. ఐకాన్న్ నుంచి నియంత్రణ మార్చి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోకి తీసుకురావాలని భారతదేశంలో సహా పలు దేశాలు ప్రతిపాదన చేశాయి.

ఇదీ చదవండి: కంప్యూటర్ స్పీడ్​ తగ్గుతోందా..? ఈ ఐదు టిప్స్ మీ కోసమే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.