ETV Bharat / opinion

వానలకు తోడు.. గ్రామీణులకు పిడుగుముప్పు

author img

By

Published : Aug 4, 2021, 5:13 AM IST

thunderstorm
పిడుగు

వానాకాలం వచ్చిందంటే చాలు.. 'పిడుగుపాటుకు ఓ కుటుంబం బలి' వంటి వార్తలు అనేక చదువుతుంటాం. 1995-2014 మధ్య కాలంలో ఉరుములు, పిడుగులు 40శాతం పెరిగాయని, ఫలితంగా మృతుల సంఖ్య రెట్టింపయిందని ఐఐటీఎం పేర్కొంది. ముందస్తు హెచ్చరికలతోనే పిడుగుపాటు నుంచి బయటపడగలం.

ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇటీవల పిడుగుపాటుకు ఒకేరోజు 41 మంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాకాలంలో ఇటువంటి దుర్ఘటనలు ఏటా సంభవిస్తూనే ఉంటాయి. కానీ, గతంతో పోలిస్తే పిడుగుపాట్లు అసాధారణ స్థాయిలో పెరుగుతుండటం కలవరపెడుతోంది. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ లెక్కల ప్రకారం దేశంలో పిడుగుపాటు వల్ల ఏటా దాదాపు 2500 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రకృతి విపత్తుల వల్ల సంభవించే మరణాల్లో మూడో వంతుకు పైగా పిడుగుపాటే కారణమని భారత వాతావరణ విభాగం అధ్యయనాలు చెబుతున్నాయి. 2019లో ప్రకృతి విపత్తుల కారణంగా 8,145 మంది మరణించగా, వారిలో 15శాతం వడగాడ్పుల వల్ల, 11శాతం వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా 35శాతం చావులకు పిడుగులే కారణమయ్యాయి.

అందులోనూ బిహార్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎక్కువ మంది అసువులుబాయగా- ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లు తరవాతి స్థానాల్లో ఉన్నాయి. 1960 తరవాత పిడుగుపాటు మరణాలు రెండున్నర రెట్లు పెరిగాయని పుణేలోని భారత ఉష్ణమండల వాతావరణ శాస్త్ర సంస్థ (ఐఐటీఎం) నిర్ధారించింది. అంతకు ముందుతో పోలిస్తే 1995-2014 మధ్య కాలంలో ఉరుములు, పిడుగులు 40శాతం పెరిగాయని, ఫలితంగా మృతుల సంఖ్య రెట్టింపయిందని ఐఐటీఎం పేర్కొంది. అధిక సాంద్రత కలిగిన అటవీ ప్రాంతాలతో పోలిస్తే మిగతాచోట్ల పిడుగుపాట్లు ఎక్కువగా ఉంటున్నాయని వెల్లడించింది.

గ్రామాల్లోనే అధికం

నానాటికీ అధికమవుతున్న భూతాపం ఎన్నో ప్రకృతి విధ్వంసాలకు కారణమవుతోంది. పెరుగుతున్న పిడుగుపాట్లకూ భూతాపమే కారణమని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. భూతాపం వల్ల అవనిపై తేమ పెరిగి, తద్వారా తుపానులు, పిడుగుపాట్లు సంభవిస్తున్నాయి. భూమిపై ఒక డిగ్రీ భూతాపం పెరిగితే పిడుగుపాట్లు 12శాతం అధికమవుతాయని ఒక అంచనా. దీన్నిబట్టి అమెరికా వంటి అగ్రదేశాలకు భవిష్యత్తులో పిడుగులే అతిపెద్దగా విపత్తుగా మారనున్నాయి. ఒక్కో పిడుగుకు దాదాపు 300 మిలియన్‌ ఓల్టుల శక్తి ఉంటుంది. ఇది సూర్యుడి ఉపరితలంపై ఉండే వేడికంటే చాలా అధికం. అందుకే పిడుగుల వల్ల ఏర్పడే నష్టం అధిక స్థాయిలో ఉంటోంది. వీటి కారణంగా వేల సంఖ్యలో పశువులూ మరణిస్తున్నాయి. విమానాల ప్రయాణాలకు ఆటంకం ఏర్పడుతోంది. విద్యుత్తును ఉత్పత్తి చేసే సౌర ఫలకాలు, పెద్ద గాలి పంకాలు వంటివీ తీవ్రంగా దెబ్బతింటున్నాయి. అడవుల్లో కార్చిచ్చూ మరో ప్రధాన సమస్యగా మారింది. దీనివల్ల భూతాపం మరింత పెరుగుతోంది. అడవుల నరికివేత, నీటి వనరులు తగ్గిపోవడం, కాలుష్యం పెరగడం వంటివన్నీ పిడుగుపాటుకు కారణమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

పిడుగు నివారణ పరికరాలు..

పిడుగుల వల్ల 2001-2018 మధ్య కాలంలో 42,500 మంది ప్రాణాలు కోల్పోగా, వీటిలో నగరాల్లో చోటుచేసుకున్న మరణాలు నాలుగు శాతమే. మిగిలినవన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనే సంభవించాయి. పిడుగులకు రైతులు ఎక్కువగా బలవుతున్నారు. దానిపట్ల సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం. మరణించిన వారిలో 71శాతం వర్షం, ఈదురుగాలులు వంటి వాటి నుంచి రక్షణ కోసం చెట్లను ఆశ్రయించినవారే! పిడుగులు చెట్ల మీద అధికంగా పడుతుండటం వల్ల వీరంతా ప్రాణాలు కోల్పోయారు. రైతులకు, పశువుల కాపరులకు రాష్ట్ర ప్రభుత్వాలు పిడుగుపాటు ప్రమాదాల నివారణ గురించి అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది. చౌకగా దొరికే పిడుగు నివారణ పరికరాల తయారీపైనా దృష్టి సారించాలి. వీటిని పొలాలు, గుడిసెల దగ్గర ఏర్పాటుచేయడం వల్ల ఫలితం ఉంటుంది. గ్రామీణులకు ముందస్తు సమాచారం అందించడం ద్వారా 2017-2018లో 465గా ఉన్న మరణాలను ఒడిశా ప్రభుత్వం 2018-2019లో 320కి తగ్గించగలిగింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ప్రత్యేక సెన్సర్లను ఏర్పాటు చేసింది.

ప్రత్యేక యాప్‌లు

పిడుగుపాటు ఎప్పుడు, ఎక్కడ పడుతుందనేది కచ్చితంగా చెప్పలేం. స్విట్జర్లాండ్‌లోని ఈపీఎఫ్‌ఎల్‌ సాంకేతిక విద్యా సంస్థ ముప్ఫై కిలోమీటర్ల పరిధిలో అరగంట ముందుగా పిడుగుపాటు గురించి హెచ్చరించగల వ్యవస్థను రూపొందించింది. స్థానిక వాతావరణ శాఖ సమాచారం ఆధారంగా కృత్రిమమేధను ఉపయోగించి దీన్ని ఆవిష్కరించింది. ఇందుకోసం గత పదేళ్లలో పర్వతాలు, మైదాన ప్రాంతాల్లో ఉన్న వాతావరణ పరిస్థితులను విశ్లేషించింది. మనదేశంలోనూ ఉపగ్రహాలు, డాప్లర్‌ రాడార్‌ వ్యవస్థ అందించిన సమాచారం ఆధారంగా ముందస్తు హెచ్చరికలు జారీచేసేందుకు భారత వాతావరణ విభాగం (ఐఎమ్‌డీ) కృషిచేస్తోంది. పిడుగుపాటును జాతీయ విపత్తుగా గుర్తించాలని పలు స్వచ్ఛంద సంస్థలు కృషిచేస్తున్నాయి.

నాలుగేళ్ల క్రితం కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాల విద్యార్థులు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి 'వజ్రపాత్‌' పేరుతో ఒక స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ను రూపొందించారు. దీని సాయంతో పిడుగుపాట్లను 40 నిమిషాల ముందుగా గుర్తించే అవకాశం ఉంది. ఐఐటీఎం సైతం 'దామిని' పేరిట మరో యాప్‌ను రూపొందించింది. వీటి వాడకం విస్తృతం కావాలి. భూతాపాన్ని నియంత్రించగలిగితేనే పిడుగుల వంటి ప్రకృతి విపత్తుల నుంచి మానవాళికి తగిన రక్షణ లభిస్తుంది.

- శ్రీసత్యవాణి గొర్లె

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.