ETV Bharat / opinion

'కొత్త వీసా విధానంతో అమెరికాకే నష్టం'

author img

By

Published : Nov 2, 2020, 6:03 AM IST

The decisions taken by the new US government on sanction of visas are loss for America
కొత్త వీసా విధానంతో అమెరికాకే నష్టం

హెచ్​-1బీ వీసా మంజూరు చేసేందుకు ఇప్పటివరకు కంప్యూటరైజ్డ్​ లాటరీ వ్యవస్థను అనుసరిస్తోంది అమెరికా ప్రభుత్వం. తాజాగా దీని స్థానంలో వేతనం ప్రాతిపదికన వీసాలు మంజూరు చేయాలని సూచించింది. అమెరికన్ల వేతనాలపై పడుతున్న భారాన్ని ఇది తగ్గిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నా.. చివరకు ఈ నిర్ణయం అగ్రరాజ్యానికే నష్టాన్ని మిగుల్చుతుంది అంటున్నారు విశ్లేషకులు.

హెచ్‌ 1బి వీసా విధానంలో సంస్కరణలు తీసుకొస్తానంటూ నాలుగేళ్ల క్రితం గద్దెనెక్కిన డొనాల్డ్​ ట్రంప్‌, ఈ నెల మూడో తేదీన జరిగే ఎన్నికల్లోనూ గెలవడానికి అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. అమెరికా టెక్నాలజీ సంస్థలకు నిపుణులైన సిబ్బంది కొరత ఉన్నందువల్ల విదేశాల నుంచి వారిని హెచ్‌ 1బి, ఎల్‌ 1 వీసాల మీద తెచ్చుకుంటాయి. అయితే, ఈ వీసాలను కంపెనీలు, విదేశీ నిపుణులు దుర్వినియోగం చేస్తూ అమెరికన్‌ ఉద్యోగుల పొట్ట కొడుతున్నారనే అపోహ బలంగా ఉంది. కరోనా మహమ్మారి వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలై కోట్లాది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయిన స్థితిలో ఈ అపోహ మరింత బలంపుంజుకొంది.


విదేశీయులకు తక్కువ వేతనాలు...
ట్రంప్‌ సర్కారు గడచిన నాలుగేళ్లలో హెచ్‌ 1బి వీసాలపై సవాలక్ష ఆంక్షలు విధించడం వల్ల అమెరికా కంపెనీలే నష్టపోయాయని ప్రతిష్ఠాత్మక ‘బ్రూకింగ్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌’ అధ్యయనం తేల్చింది. ఈ ఆంక్షల వల్ల దాదాపు రెండు లక్షల మంది విదేశీ నిపుణులు అమెరికాకు రాలేకపోవడం, ఫార్చ్యూన్‌ 500 జాబితాలోని అమెరికన్‌ కంపెనీలకు 10,000 కోట్ల డాలర్ల (7,40,000 కోట్ల రూపాయల) నష్టం తెచ్చిపెట్టిందని బ్రూకింగ్స్‌ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌, ఆపిల్‌ వంటి బృహత్తర సంస్థలు మొదలు చిన్నాచితకా ఐటీ సంస్థల వరకు పెద్దయెత్తున విదేశీ సిబ్బందిని నియమించుకుంటాయి. సిబ్బంది కొరత వల్లనే ఇలా చేయాల్సి వస్తోందని ఐటీ కంపెనీలు వివరిస్తున్నాయి. కానీ, అమెరికన్లకు ఎక్కువ జీతభత్యాలు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి, కంపెనీలు తక్కువ జీతాలకు విదేశీ నిపుణులను రప్పించుకొంటున్నాయనే విమర్శలున్నాయి. దీనికి విరుగుడుగా అధిక వేతనాలను ప్రామాణికంగా చేస్తానని ట్రంప్‌, బైడెన్‌లు హామీ ఇస్తున్నారు. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, గణిత (స్టెమ్‌) కోర్సుల్లో పీహెచ్‌డీ అభ్యర్థుల వీసాలపై పరిమితి ఎత్తేస్తానని బైడెన్‌ ప్రకటించారు.


వాస్తవంగానే అమెరికాలో నిపుణుల కొరత ఉందా అనే ప్రశ్నకు ఏక కాలంలో ‘ఉంది, లేదు’ అని జవాబు చెప్పాల్సి వస్తుంది. ఐటీ సంస్థలు ప్రధానంగా స్టెమ్‌ పట్టభద్రులను నియమించుకుంటాయి. వ్యవసాయం, పాడి పరిశ్రమ, భూసార సంరక్షణ మొదలుకొని కెమికల్‌, మెకానికల్‌, కంప్యూటర్‌, ఐటీ కోర్సుల వరకు మొత్తం 415 స్టెమ్‌ కోర్సులను అమెరికా విద్యాసంస్థలు అందిస్తున్నాయి. 2017లో ఈ కోర్సులన్నింటిలో కలిపి అమెరికాకు 5,68,000 మంది పట్టభద్రులు ఉన్నారని ప్రపంచ ఆర్థిక వేదిక లెక్కగట్టింది. వీరిలో కంప్యూటర్‌, ఐటీ పట్టభద్రుల శాతం బాగా తక్కువ. 2019-2029 మధ్య కేవలం కంప్యూటర్‌, ఐటీ రంగాల్లోనే 5,31,200 కొత్త ఉద్యోగాలు ఉత్పన్నమవుతాయని అమెరికా కార్మిక శాఖ గణాంకాల విభాగం తెలిపింది. ప్రధానంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌ డేటా, సైబర్‌ భద్రత విభాగాల్లో ఈ ఉద్యోగాలు లభిస్తాయి. వీటిని భర్తీ చేయగల స్థాయిలో అమెరికన్‌ ఐటీ పట్టభద్రులు తయారు కావడం లేదు కాబట్టి, విదేశాల నుంచి తెచ్చుకోవలసి వస్తోందని టెక్‌ కంపెనీల వాదన. 2016 నాటికి చైనాకు 47 లక్షలమంది స్టెమ్‌ పట్టభద్రులు ఉంటే, 2017లో భారతదేశం 26 లక్షలమందిని తయారుచేసుకుంది. చైనా, భారత్‌ వంటి ఆసియా దేశాల విద్యార్థులు సైన్స్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లో ఉన్నత చదువుల కోసం అమెరికా వస్తుంటే, ఆ కోర్సులు చదివే అమెరికన్‌ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. అమెరికన్‌ స్టెమ్‌ పట్టభద్రులను కాదని విదేశీయులను నియమించుకొంటూ అమెరికన్ల పొట్ట కొడుతున్నారనే భావన చాలామందిలో పాతుకుపోయింది. అమెరికాలో స్టెమ్‌ పట్టభద్రులు అవసరానికి మించి ఉన్నారని వారు వాదిస్తున్నారు. ఇక్కడ లోతుగా పరిశీలిస్తే మూడు అంశాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. ఒకటి- అమెరికన్‌ స్టెమ్‌ పట్టభద్రుల్లో సగంమంది స్టెమ్‌ సంబంధ ఉద్యోగాలు చేయడం లేదు. రెండు- ఒకవేళ ఆ ఉద్యోగాల్లో చేరినా తరవాత స్టెమ్‌కు భిన్నమైన వృత్తి ఉద్యోగాలకు మారిపోతున్నారు. మూడు- ఇతర ఉద్యోగాల్లో ఎంత ఎక్కువ అనుభవం ఉంటే అంతగా జీతభత్యాల్లో వృద్ధి కనిపిస్తుంది. కానీ, ఐటీ రంగంలో అనుభవం కన్నా ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం. అవి నేర్చుకోకపోతే ఆదాయంలో వృద్ధి ఉండదు. అమెరికన్‌ స్టెమ్‌ పట్టభద్రులు ఈ బాదరబందీ ఎందుకని ఇతర వృత్తుల్లోకి మారిపోతున్నందువల్ల, ఐటీ కంపెనీలు విదేశీ నిపుణులను రప్పించుకోవలసి వస్తోంది.


తరలిపోనున్న ఐటీ ఉద్యోగాలు...
విదేశీ నిపుణుల వల్ల అమెరికన్‌ టెక్‌ కంపెనీల లాభాలు, ఉత్పాదకత, నవకల్పనలు, ఉత్పత్తి విస్తరణ, పెట్టుబడులు పెరుగుతున్నాయని బ్రూకింగ్స్‌ అధ్యయనం నిగ్గుతేల్చింది. తాత్కాలిక వీసాలను ట్రంప్‌ సర్కారు నిషేధించినంత మాత్రాన అమెరికన్‌ కంపెనీలు విదేశీ నిపుణులను వదులుకొని అమెరికన్‌ సిబ్బందినే నియమించుకుంటాయనే హామీ ఏమీ లేదు. సిబ్బంది కొరత, వీసా ఆంక్షలను అధిగమించడానికి అమెరికన్‌ టెక్‌ సంస్థలు రానున్న రెండుమూడేళ్లలో తమ కార్యకలాపాలను, పెట్టుబడులను విదేశాలకు తరలిస్తాయని, దానివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఇంకా పెద్ద నష్టం జరుగుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. రానున్న డిజిటల్‌ యుగంలో ప్రపంచ విపణిని చేజిక్కించుకోవడానికి అమెరికా, చైనా టెక్‌ కంపెనీల మధ్య పోటీ జోరు అందుకొంది. ఇందులో నెగ్గడానికి ఫేస్‌బుక్‌, అమెజాన్‌, గూగుల్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలు ప్రపంచంలో చైనా తరవాత అతి పెద్ద మార్కెట్‌ అయిన భారత్‌లో కార్యకలాపాలను, పెట్టుబడులను పెద్దయెత్తున విస్తరిస్తున్నాయి. ‘ఆ ఊరికి ఈ ఊరెంత దూరమో, ఈ ఊరికి ఆ ఊరూ అంతే దూర’మనే నానుడి ఇక్కడ ప్రస్తావనార్హం. పెద్ద సంఖ్యలో హెచ్‌ 1బి, ఎల్‌ 1 వీసాలను పొందే భారతీయ ఐటీ నిపుణులను అమెరికాకు రానివ్వకపోతే, అమెరికన్‌ సిబ్బందికి, కంపెనీలకు ఇక్కడ ప్రతికూల వాతావరణం ఏర్పడవచ్చు. వివేకవంతులైన నాయకులు ఈ వాస్తవాన్ని గుర్తెరిగి నడుచుకోవాలి. అమెరికా కొత్త అధ్యక్షుడు ఆ వివేకాన్ని కనబరుస్తారా అన్నది బిలియన్‌ డాలర్ల ప్రశ్న.

ఎవరు గెలిచినా తప్పని ప్రక్షాళన

వీసాలను కంపెనీలు దుర్వినియోగం చేస్తూ ఉండటంవల్ల అమెరికన్లు నష్టపోతున్నారని, విదేశీయులు లాభపడుతున్నారనే ఆరోపణలను ఎన్నికల అస్త్రంగా చేసుకొన్న ట్రంప్‌- కంప్యూటర్‌ లాటరీ పద్ధతిలో హెచ్‌ 1బి వీసాలు జారీ చేసే విధానాన్ని రద్దు చేసి, అధిక వేతనాలే కొలమానంగా వీసాలు ఇస్తానంటున్నారు. ఈ వీసాల మీద వచ్చేవారు నిజంగా నిపుణులైతే అధిక వేతనాలు చెల్లించాల్సి ఉంటుందనే తర్కం ఇందులో ఇమిడి ఉంది. ట్రంప్‌ పై పోటీ చేస్తున్న జో బైడెన్‌ కూడా అధిక వేతన ప్రాతిపదికపై వీసాలు ఇవ్వాలనే ప్రతిపాదనకు సుముఖత చూపుతున్నారు. హెచ్‌ 1బి విధానంలో ఎటువంటి మార్పుచేర్పులు చేయాలన్నా అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు దిగువ సభ) ఆమోదం తప్పనిసరి. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ప్రతిపక్ష డెమోక్రాట్లదే ఆధిక్యం. కనుక, ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్‌, బైడెన్‌లలో ఎవరు గెలిచినా హెచ్‌ 1బి విధాన ప్రక్షాళన జరుగుతుందని భావించవచ్చు. కానీ, ఇది అమెరికా ప్రయోజనాలను దెబ్బ తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- ఏఏవీ ప్రసాద్‌

ఇదీ చూడండి: వీసాల రద్దుతో అమెరికా కంపెనీలకు అంత నష్టమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.