ETV Bharat / opinion

గిట్టుబాటు కాని సేద్యం- కష్టానికి నష్టమే ఫలమా?

author img

By

Published : May 2, 2021, 7:00 AM IST

farmers income
కష్టానికి నష్టమే ఫలమా?

పంటల సాగులో ఖర్చులు పెరిగిపోతున్నాయి. విత్తనాలు, ఎరువులు ఎంత మేరకు ఉపయోగించాలో రైతులకు అవగాహన ఉండటం లేదు. నైపుణ్యం లోపించడం వల్ల పంట విక్రయం విషయంలోనూ రైతులు నష్టపోతున్నారు. కాబట్టి ఖర్చులు తగ్గించి లాభసాటి సేద్యం దిశగా అన్నదాతలు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

రూపాయిని ఆదా చేయడం అంటే మరో రూపాయిని అదనంగా సంపాదించినట్లే. ఆదాయం పెంచుకునే క్రమంలో ఖర్చు తగ్గించుకోవడం అత్యంత కీలకాంశం. ఇల్లు, వ్యాపార నిర్వహణల్లోనే కాదు- వ్యవసాయంలోనూ ఇదే ముఖ్యమైన ఆర్థిక సూత్రం. గడచిన దశాబ్దకాలంగా పంటల సాగులో పెట్టుబడి ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. పంటకు వాడే విత్తనం నుంచి ఎరువులు, మందులు తదితర ఉత్పాదకాలను ఎంత పరిమితంగా వాడుకోవాలనే అంశంపై రైతులకు అవగాహన ఉండటం లేదు. పంటను విక్రయించుకునే విషయంలోనూ నైపుణ్యం లోపించడంతో అన్నదాతలు నష్టపోవాల్సి వస్తోంది. త్వరలో ఖరీఫ్‌ ఆరంభం కానున్న తరుణంలో ఖర్చు తగ్గించి లాభసాటి సేద్యం దిశగా రైతులు అడుగులు వేయాల్సిన అవసరముంది.

అడుగడుగునా సమస్యలే!

వానాకాలం పంటల సాగుకు ముందే రైతుల సన్నాహాలు మొదలవుతాయి. వేసవి దుక్కులు, పొలం తయారీ, విత్తన సేకరణ తదితర పనులపై రైతులు దృష్టి పెడతారు. విత్తే దశ నుంచే సాగు ఖర్చులు తగ్గించుకునే దిశగా రైతులు యోచించాల్సిన తరుణమిది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో విత్తనాల ధరలు మండిపోతున్నాయి. రాయితీల ఊసే లేకుండా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ విత్తన ధరలను ఖరారు చేయడం అన్నదాతల్ని కలవరపెడుతోంది. విత్తనం వేయడం మొదలుకొని, పంటను విక్రయించేవరకు పలు దశల్లో పెడుతున్న ఖర్చులు రైతుల్ని ముంచేస్తున్నాయి. కౌలు సేద్యం చేసేవారి పరిస్థితి మరింత దయనీయం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల్లో ఏం వాడాలో ఏది వాడకూడదో అవగాహన కల్పించే విస్తరణ సేవలు అందక రైతులు నష్టపోతున్నారు. పత్తి వంటి వాణిజ్య పంటల విషయంలో ఈ పరిస్థితి మరీ ఘోరం. తెలంగాణ వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఎకరా వరి సాగు వ్యయం రూ.2,717. మద్దతు ధరతో పోలిస్తే రైతులు క్వింటాకు రూ.829 మేర నష్టపోతున్నారు. ఎకరా వరి సగటు దిగుబడి 2.25 టన్నులుగా అంచనా వేస్తే- రైతులు నికరంగా ఎకరాకు రూ.18,653 నష్టపోవలసి వస్తోంది. ఈ లెక్కన ఒక్క తెలంగాణలోనే గత ఖరీఫ్‌, రబీ సీజనల్లో దాదాపు 98 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులకు మొత్తం రూ.18,279 కోట్ల నష్టం వాటిల్లింది. ఇలా పత్తి, మొక్కజొన్న, సోయా తదితర పంటల్నీ లెక్కిస్తే- గడచిన సంవత్సర కాలంలో రైతులు సుమారు రూ.30 వేల కోట్లకు పైనే నష్టపోవలసి వచ్చింది. సేద్యం గిట్టుబాటు కావడం లేదన్న సంగతిని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకునేలా ఎప్పటికప్పుడు విస్తరణ విభాగం రైతుకు దిశానిర్దేశం చేయాల్సి ఉంది. అయితే కొందరు వ్యవసాయ అధికారులే పురుగుమందుల కంపెనీలకు అనధికారిక ఏజెంట్లుగా మారిపోవడం దారుణం. పురుగుమందుల వినియోగం అవసరానికి మించి ఉంటోంది. ఈ పరిణామాలన్నీ సాగు ఖర్చుల్ని రైతుకు భారంగా మార్చేశాయి.

ఇదీ చదవండి: మహమ్మారితో మానసిక కల్లోలం.. స్థైర్యమే విరుగుడు!

సహజ, సేంద్రియ, సంప్రదాయ సాగు పద్ధతులకు తోడు సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ వంటి పద్ధతుల గురించి రైతులకు వివరించి చెప్పే ఓపిక వ్యవసాయ యంత్రాంగానికి లేదు. విస్తరణ వ్యవస్థ ఇంతగా నిర్వీర్యమైపోతున్నా- పాలకులు చలించడం లేదు. విస్తరణ సిబ్బంది పాత్రను చాలావరకు డీలర్లే పోషిస్తున్నారు. నిరక్షరాస్యులైన రైతులకు అధిక వడ్డీలకు పెట్టుబడులు అందిస్తూ- ఎరువులు, పురుగుమందులు తమ వద్దే కొనాలని, పంటను తమకే అమ్మాలని షరతులు విధిస్తున్నారు. రైతుల చుట్టూ తమ వ్యాపారాన్ని నిర్మించుకుంటున్నారు. అవసరం లేకపోయినా వీరి సిఫార్సుపై వాడుతున్న మందులతో సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. పైగా కొన్ని ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ, నాసిరకం విత్తనాలు, క్రిమిసంహారకాలను కొందరు డీలర్లు స్వేచ్ఛగా విక్రయిస్తున్నారు. డీలర్లను వ్యవసాయశాఖ కట్టడి చేయలేకపోతోంది.

విత్తే దశ నుంచే తగ్గాల్సిన ఖర్చు

సంప్రదాయ పంటల్లో ప్రతి రైతూ తాను పండించిన పంట నుంచే తదుపరి పంటకు విత్తనం సేకరించుకోవాలి. దీనివల్ల ఏటా విత్తనం కొనాల్సిన అవసరం ఉండదు. ఆ విత్తనాన్ని శుద్ధి చేసుకుంటే తొలిదశలో కలుపు సమస్యలు రావు. దీనివల్ల కలుపు మందుల కొనుగోలు, చల్లే ఖర్చు, కలుపుతీత కూలీలకు అయ్యే ఖర్చులు ఆదా అవుతాయి. పలు పంటల్లో హైబ్రీడ్‌ వంగడాలను సైతం రైతు స్థాయిలోనే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. అందుకు రైతులు మరింత శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో కూలీలకయ్యే ఖర్చు కంటే యంత్రాలతోనే పని సులభమవుతోంది. సొమ్ము ఆదా అవుతోంది. ఈ తరుణంలో కోత, నూర్పిడి వంటి పనులకు అందుబాటులోఉన్న యంత్రాలను అద్దె ప్రాతిపదికన తెచ్చుకునేలా ముందుగానే మాట్లాడుకోవాలి. మబ్బులు కమ్మిన వాతావరణంలో కోసిన పంటను కుప్పలు వేసుకోవాలంటే కూలీ ధరలు మూడు రెట్లు పెరుగుతున్నాయి. కొందరు రైతులు ఒక సంఘంగా ఏర్పడి ఇటువంటి యంత్రాలను సమకూర్చుకుంటే చుట్టుపక్కల ప్రాంతం రైతులందరూ లాభపడే అవకాశముంది. ఇలా విత్తనాలు, ఎరువులు, సాగునీరు, క్రిమిసంహారకాలు, పనిముట్లు, యంత్రాలను అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకుని సంఘటితంగా సాధించే వీలు కలుగుతుంది. ఈ పరిణామం సాగు ఖర్చుల్ని బాగా తగ్గిస్తుంది. ఎరువుల డీలర్లను నియంత్రించడంతోపాటు సేంద్రియ సాగు విధానాలను ఆచరించేలా రైతులకు అవగాహన కల్పించాలి. సాగు చేసే ప్రతి రైతుకూ పంటరుణంతో పాటు విస్తరణ యంత్రాంగాన్ని బలోపేతం చేసి పంట ప్రతి దశలో రైతులకు సాగు సలహాలు అందేలా చూడాలి. ఉత్పత్తి ఖర్చుకు మించి విక్రయించుకునే నైపుణ్యాలపై అవగాహన పెంచగలిగితేనే అన్నదాతకు సేద్యం లాభసాటిగా మారుతుంది.

పెట్టుబడులు తడిసి మోపెడు

పెట్రో ధరలు దారుణంగా పెరగడంతో అన్ని రకాల వ్యవసాయోత్పాదకాల ధరలకూ రెక్కలొచ్చాయి. సీజన్‌లో కూలీల సమస్య పట్టి పీడిస్తుండటమూ ఏటికేడు పెట్టుబడులు అధికం కావడానికి దారితీస్తోంది. పంటను మార్కెట్‌కు తరలించాలంటే రవాణా ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. వరి నాట్లు వేసేందుకు ఎకరాకు నాలుగు వేల రూపాయలు, కోతలకైతే ఎకరాకు రూ.9-11 వేలు ఖర్చవుతోంది. మొత్తంగా క్వింటా వరి ధాన్యం పండించేందుకు రూ.2,600 వ్యయమవుతుంటే మద్దతు ధర రూ.1,888 దాటలేదు. తాజాగా 50 కిలోల బస్తా డీఏపీ ధర రూ.1900గా కంపెనీలు ప్రకటించాయి. కేంద్ర వ్యవసాయ ధరలు, వ్యయాల కమిషన్‌ (సీఏసీపీ) ఏటా పంటలవారీగా వాస్తవ ఉత్పత్తి వ్యయాలను లెక్కించి, కేంద్రానికి మద్దతు ధరలను సిఫార్సు చేస్తుంది. ఇలా దేశవ్యాప్తంగా సేకరించిన వివరాలను పరిశీలిస్తే, ప్రస్తుతం అమలవుతున్న మద్దతు ధరలతో పోల్చినప్పుడు ప్రధాన పంటల్లో సాగువ్యయం అధికంగా ఉండి, రైతులకు ప్రతిఫలం ఎంత మాత్రం దక్కడం లేదని తేలింది.

- అమిర్నేని హరికృష్ణ

ఇదీ చదవండి: రాష్ట్రాలకు రూ. 8,873 కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.