ETV Bharat / opinion

కమ్ముకొస్తున్న డ్రాగన్​- భారత్​ పరిస్థితి ఏంటి?

author img

By

Published : Dec 22, 2020, 7:27 AM IST

indo china relations
కమ్ముకొస్తున్న డ్రాగన్​

సామ్రాజ్య విస్తరణే లక్ష్యమంటూ విమర్శలు ఎదుర్కొంటున్న చైనా.. భారత్​తో కూాడా అదే ధోరణి కొనసాగిస్తోంది. కొన్ని నెలలుగా ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ ప్రయత్నిస్తున్నా.. డ్రాగన్ అందుకు సుముఖంగా లేదు. నామమాత్రంగానే చర్చలు జరుపుతోంది. మరోవైపు భారత్​పై మరింత ఒత్తిడి తేవాలన్న లక్ష్యంతో చైనా​ అడుగులు వేస్తోంది. పాక్​తో కలిసి కుయుక్తులు పన్నుతున్న డ్రాగన్ ఆటకట్టించేందుకు భారత్​కు ఉన్న మార్గాలేంటి?

తూర్పు లద్దాఖ్‌లో ఏడు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు చల్లారే పరిస్థితులు ఇప్పుడే కనిపించడం లేదు. అక్కడ అదే పరిస్థితి ఉండేలా చేసి భారత్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయడం, ఆర్థికంగా భారత్‌ను బలహీనపరచాలనే దీర్ఘకాల లక్ష్యంతో డ్రాగన్‌ ముందుకు సాగుతోంది. ఇరు దేశాల మధ్య బ్రిగేడ్‌ కమాండర్ల స్థాయిలో పదుల సంఖ్యలో చర్చలు జరిగాయి. విదేశాంగ శాఖ అధికారుల స్థాయిలో పలుమార్లు భేటీలు నిర్వహించారు. అయినా, ఎలాంటి ఫలితం కానరాలేదు. ఇలాంటి పరిస్థితి ఎవరికీ మంచిది కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూనే ఆ దేశం తన దుష్ట పన్నాగాలను కొనసాగిస్తోంది. ఉద్రిక్తతలు పెంచే చర్యలకు దూరంగా ఉండాలని, వాస్తవాధీన రేఖ వద్ద ప్రశాంతతను నెలకొల్పాలనే నిర్ణయానికి అంగీకరిస్తూనే- మరోవైపు కొత్త గోతులు తవ్వుతోంది.

నిరంతరం అప్రమత్తం

మాస్కోలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ జరిపిన చర్చల్లో పంచసూత్ర ప్రణాళికకు రూపకల్పన జరిగినా... తదనంతరం డ్రాగన్‌ దానికి ఏ మాత్రం గౌరవం ఇవ్వలేదు. ఉద్రిక్త ప్రాంతంగా మారిన ప్యాంగాంగ్‌ సరస్సు సమీపం నుంచి తన సైన్యాన్ని ఒక అంగుళమైనా వెనక్కి మళ్లించలేదు. తన 60 వేల మంది సైనికులను అక్కడ కొనసాగించడంతో పాటు- అరుణాచల్‌ప్రదేశ్‌, భారత్‌ టిబెట్‌ సరిహద్దు సమీపంలో కొత్త గ్రామాలను సైతం నిర్మిస్తోంది. ఇదే విషయాన్ని భారత త్రిదళాధిపతి కొద్ది రోజుల క్రితం ధ్రువీకరించారు. డోక్లామ్‌ ప్రాంతంలోని చైనా సైనికుల కార్యకలాపాలను సైతం భారత బలగాలు నిరంతరం గమనిస్తున్నాయని వెల్లడించారు. తన సరిహద్దుల్లో సైనిక బలగాలు లేని ప్రాంతాల్లోకి హన్‌ చైనీస్‌ వర్గం ప్రజలను, టిబెట్‌లోని కమ్యూనిస్ట్‌ పార్టీ సభ్యులను ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గతంలో దక్షిణ చైనా సముద్రంపై తనకు హక్కు ఉందని తెలిపేందుకు జాలర్లను సైతం అలాగే మోహరించింది. ఇప్పడు హిమాలయాల్లో చొరబాట్లను పెంచేందుకు పశువుల కాపరులను సైతం ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతోంది. మొత్తం సరిహద్దు అంతటా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగేలా దుష్ట పన్నాగాలు రచిస్తోంది.

అనుభవమే భారత్​కు బలం

సరిహద్దు వివాదానికి సమీప భవిష్యత్తులో పరిష్కారం లభించే మార్గం కనిపించకపోవడంతో భారత్‌ తూర్పు లద్దాఖ్‌లో చైనాకు దీటుగా దాదాపు 50 వేల మంది సైనికులను మోహరించింది. ఆ ప్రాంతంలో ఇప్పుడు మైనస్‌ 20 నుంచి మైనస్‌ 40 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు భారీగా మంచు పేరుకుంటోంది. సైనికుల కోసం ఇప్పటికే మనదేశం అమెరికా నుంచి అత్యాధునిక దుస్తులు తెప్పించింది. అతి శీతల వాతావరణాన్ని తట్టుకునేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించింది. గత 30 ఏళ్లగా సియాచిన్‌, కార్గిల్‌ సెక్టార్లలో మన సైన్యం దాదాపు అంతే శీతల ప్రదేశంలో పనిచేస్తోంది. పాకిస్థాన్‌తో అవే ప్రాంతాల్లో మూడు యుద్ధాలు చేసిన అనుభవం మన సొంతం. ఆ పరిస్థితి మన సైన్యానికి అక్కరకు వస్తుండగా... దాదాపు నలభై ఏళ్లుగా అలాంటి అనుభవం లేని చైనా సైన్యం ఇబ్బందులు పడుతోంది. సైనికులకు సదుపాయాలు కల్పించడంలోనూ తల్లడిల్లుతోంది. హడావుడిగా నాణ్యత లేని నాసిరకం దుస్తులను సమకూర్చడంతో డ్రాగన్‌ సైన్యంలో అసంతృప్తి వ్యక్తమైనట్లు వార్తలొచ్చాయి. అత్యంత శీతల వాతావరణం వారికి కొత్త కావడంతో పలువురు సైనికులు మృతి చెందుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంతోనే తన బలగాలను ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తోంది.

స్వావలంబన అత్యావశ్యకం

పాక్‌ చైనాల దురాగతాలను ఛేదించాలంటే భారత్‌ రక్షణ పరంగా మరింత పటిష్ఠ చర్యలు చేపట్టాలి. అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకోవడంతో పాటు... ఆ రంగంలో సాధ్యమైనంత త్వరగా స్వావలంబన సాధించే దిశగా దృష్టి సారించాలి. ఇప్పటికే చైనాకు చెందిన దాదాపు 210 యాప్‌లపై మన దేశం మూడు విడతలుగా నిషేధం విధించి గుణపాఠం చెప్పింది. ఆర్థిక పరంగా ఆ దేశంపై మరింత ఒత్తిడి పెంచే విధంగా చర్యలను వేగిరం చేయాల్సి ఉంది. మనం చేసే ఎగుమతుల కంటే... చైనా నుంచి చేసుకునే దిగుమతుల విలువ మూడు రెట్లు పైనే ఉంది. అందుకే దిగుమతులకు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించడంతో పాటు అవే వస్తువులను మరింత చౌకగా ఇక్కడే రూపొందించుకునే అవకాశాలను మెరుగు పరచుకోవాలి. ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియాలు చైనా నడ్డి విరిచేందుకు ఆయా దేశాల్లో అడ్డం పడుతున్న పలు చట్టాలను సైతం మారుస్తున్నాయి. భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా సభ్య దేశాలుగా ఏర్పడిన ‘క్వాడ్‌’ డ్రాగన్‌ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు చర్యలు మరింత ముమ్మరం చేయాలి. అంతకంటే ముందు మన దేశం పాక్‌, చైనాయేతర సరిహద్దు దేశాలతో దౌత్య సంబంధాలను వేగంగా మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.

పాక్‌తో కలిసి పన్నాగం..

ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్థాన్‌కు అమెరికా ఆర్థిక సాయం దాదాపుగా నిలిపివేయడం, ఆధునిక ఆయుధాలు సైతం అందజేయడానికి నిరాకరిస్తుండటంతో- ఆ దేశం పూర్తిగా చైనా పంచన చేరింది. దీన్ని ఆసరాగా చేసుకుని డ్రాగన్‌ పాక్‌ భూభాగం నుంచి సైతం మనల్ని ఇబ్బంది పెట్టేలా వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే సీపెక్‌ (చైనా పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌) పేరుతో కుట్రలు పన్నుతోంది. 70 బిలియన్‌ డాలర్ల వ్యయంతో దాన్ని నిర్మిస్తోంది. ఆ కారిడార్‌కు రక్షణ పేరుతో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌, పాక్‌ భారత్‌ సరిహద్దు వెంబడి 25 వేలమంది సైనికులను మోహరించేందుకు ఆ రెండు దేశాలు సంకల్పించాయి. ఆ సైన్యానికి డ్రాగన్‌ అంత్యంత ఆధునిక ఆయుధాలు సమకూర్చనుంది. ఇక ఆ కారిడార్‌ పూర్తయితే చైనా హిందూ మహాసముద్రానికి అత్యంత వేగంగా చేరుకోగలుగుతుంది. దీంతో పాటు పాకిస్థాన్‌కు ఎనిమిది అత్యాధునిక జలాంతర్గాములను, రక్షణ హెలికాప్టర్‌ను విక్రయించేందుకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు కొద్ది నెలల క్రితమే పాకిస్థాన్లో సైబర్‌, ఎలక్ట్రానిక్‌ యుద్ధ రీతులు, ఆధునిక నిఘా వసతుల ఏర్పాటు నిమిత్తం చైనా సైన్యంలోని వ్యూహాత్మక తోడ్పాటు దళం (పీఎల్‌ఏఎస్‌ఎస్‌ఎఫ్‌) ఒక కార్యాలయాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇవన్నీ భారత్‌ను అన్ని విధాలా ఇబ్బంది పెట్టేందుకు డ్రాగన్‌ పన్నుతున్న కుట్రలే.

- ఎం.ఎస్‌.వి.త్రిమూర్తులు

ఇదీ చూడండి : 'అమెరికా వైఖరి మార్చుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.