ETV Bharat / opinion

సృజనకు పట్టం కడితేనే నోబెల్‌ కిరీటం!

author img

By

Published : Oct 17, 2021, 4:23 AM IST

nobel awards
సృజనకు పట్టం కడితేనే నోబెల్‌ కిరీటం!

1901 నుంచి ఏటా భౌతిక, రసాయన, వైద్య, సాహిత్యం, శాంతి సాధన రంగాల్లో అపూర్వ విజయ సాధకులకు నోబెల్‌ బహుమతులు ప్రదానం చేస్తున్నారు. అయితే భారత్ నుంచి సి.వి.రామన్​ తర్వాత మరెవరూ సైన్స్​ నోబెల్​ను గెలుచుకోలేకపోయారు. ఈ పరిస్థితికి గల కారణాలపై విశ్లేషకులు ఏమన్నారంటే..

ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశం గౌరవప్రదమైన సంఖ్యలో పతకాలు గెలుచుకోవడం ఎందరికో సంతృప్తి కలిగించింది. ఇటీవల ప్రకటించిన నోబెల్‌ బహుమతి విజేతల్లో ఒక్కరంటే ఒక్క భారతీయ శాస్త్రవేత్త లేకపోవడం ఎంతగానో తీవ్ర నిరాశ మిగిల్చింది. 1930లో సర్‌ సి.వి.రామన్‌ భౌతికశాస్త్ర నోబెల్‌ను గెలిచిన తరవాత ఈ 91 ఏళ్లలో భారత గడ్డపై నుంచి మరెవరూ సైన్స్‌ నోబెల్‌ను గెలవలేకపోవడానికి కారణాలేమిటనే ప్రశ్న అందరినీ తొలుస్తోంది. సాహిత్యం, శాంతి సాధన రంగాల్లో మాత్రం రవీంద్రనాథ్‌ టాగూర్‌, మదర్‌ థెరెసా, కైలాస్‌ సత్యార్థి నోబెల్‌ సాధించగలిగారు. 1901 నుంచి ఏటా భౌతిక, రసాయన, వైద్య, సాహిత్యం, శాంతి సాధన రంగాల్లో అపూర్వ విజయ సాధకులకు నోబెల్‌ బహుమతులు ప్రదానం చేస్తున్నారు. 1969 నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ పురస్కారాన్ని అందిస్తున్నారు. భారత గడ్డపై నుంచి అమర్త్యసేన్‌ ఒక్కరే 1998లో ఆర్థిక నోబెల్‌ను సాధించారు. భారత సంతతికి చెందిన హరగోవింద్‌ ఖురానా (వైద్యం), సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ (భౌతిక శాస్త్రం), వెంకటరామన్‌ రామకృష్ణన్‌ (రసాయన శాస్త్రం), అభిజిత్‌ బెనర్జీ (ఆర్థిక శాస్త్రం) నోబెల్‌ బహుమతులను గెలుచుకున్నా- వారంతా విదేశీ పౌరసత్వం కలిగినవారు. విదేశాల్లో సాగించిన పరిశోధనలే వారికి నోబెల్‌ను సాధించిపెట్టాయి.

nobel awards
నోబెల్​ సాధించిన భారతీయులు

భారతీయ వర్సిటీలపై శీతకన్ను

స్వాతంత్య్రానికి ముందు భారతీయ విశ్వవిద్యాలయాల్లో విజయవంతంగా పరిశోధనలు జరిగేవి. సి.వి.రామన్‌, జగదీశ్‌ చంద్రబోస్‌, శ్రీనివాస రామానుజన్‌, సత్యేంద్రనాథ్‌ బోస్‌ వంటి శాస్త్రజ్ఞులు విశ్వవిద్యాలయాల్లోనో, బిర్లా ఇన్‌స్టిట్యూట్‌, సాహా ఇన్‌స్టిట్యూట్‌ వంటి ప్రతిష్ఠాత్మక ప్రైవేటు పరిశోధన సంస్థల్లోనో ఉండి నవ్య ఆవిష్కరణలు సాధించారు. స్వాతంత్య్రం వచ్చిన తరవాత హోమీ భాభా, ఎస్‌.ఎస్‌.భట్నాగర్‌, మహలనోబిస్‌ వంటి శాస్త్రవేత్తల నేతృత్వంలో నెహ్రూ ప్రభుత్వం వివిధ జాతీయ ప్రయోగశాలలను, శాస్త్రపరిశోధన సంస్థలను ఏర్పాటు చేసింది. పరిశోధన-అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) నిధుల్లో సింహభాగం ఈ సంస్థలకే కేటాయిస్తూ, విశ్వవిద్యాలయాలకు అరకొర నిధులతో సరిపెడుతున్నారు. పోనీ, జాతీయ ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయాలు కలిసికట్టుగా పని చేస్తున్నాయా అంటే, అదీ లేదు. పరిశోధనలకు ప్రాధాన్యమిచ్చేలా ప్రత్యేక విశ్వవిద్యాలయాలను స్థాపించి ప్రోత్సహించాలనే చైతన్యం పాలకులకు లోపించింది. పరిశ్రమలకు విశ్వవిద్యాలయాలకు మధ్య అనుసంధానం గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. ఈ అసమతుల్యతలను సరిదిద్దనిదే నోబెల్‌కు అర్హమైన నవ్య ఆవిష్కరణలు ఇక్కడ సాధ్యపడవు.

స్వాతంత్య్రం అనంతరం మౌలిక శాస్త్ర పరిశోధనలకన్నా, శీఘ్ర ప్రగతికి తోడ్పడే సాంకేతికతలకు భారత్‌ ప్రాధాన్యమిచ్చింది. శాస్త్ర ఆవిష్కరణలకన్నా వాటిని అన్వయించడానికి పెద్దపీట వేసింది. దీనికి భిన్నంగా అమెరికా భౌతిక, రసాయన, వైద్య శాస్త్రాల్లో మౌలిక పరిశోధనలకు అంకితమైంది. తక్షణ ప్రయోజనం ఆశించకుండా పరిశోధనలకు భారీ పెట్టుబడులను, సుదీర్ఘ సమయాన్ని కేటాయిస్తోంది. అందుకే ఇంతవరకు మౌలిక శాస్త్ర పరిశోధనల్లో అత్యధిక నోబెల్‌ బహుమతులు అమెరికా పరమయ్యాయి. బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, రష్యాలదీ అదే విధానం. జీడీపీలో పెద్ద వాటాను శాస్త్ర పరిశోధన-అభివృద్ధికి కేటాయించే ఈ దేశాలు సహజంగానే ఎక్కువ నోబెల్‌ బహుమతులను కైవసం చేసుకొంటున్నాయి. అవి జీడీపీలో ఒకటి నుంచి మూడు శాతం వరకు పరిశోధనలపై పెట్టుబడి పెడుతున్నాయి. భారతదేశం కేవలం 0.7 శాతం జీడీపీని కేటాయిస్తోంది. అలాగని ఎక్కువ నిధులు కేటాయిస్తే ఎక్కువ నోబెల్‌ బహుమతులు వస్తాయని చెప్పలేం. అమెరికా (మూడు శాతం) కన్నా ఎక్కువగా... నాలుగు శాతం జీడీపీని పరిశోధనలకు వెచ్చించే దక్షిణ కొరియా కనీసం ఒక్క సైన్స్‌ నోబెల్‌నూ సాధించలేకపోయింది. కొత్త ఆవిష్కరణలకన్నా వ్యాపారాభివృద్ధికి శాస్త్ర విజ్ఞానాన్ని సాంకేతిక పరిజ్ఞానంగా మార్చి ఉపయోగించుకోవడమే దక్షిణ కొరియా విధానం. భారత్‌ సైతం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇటువంటి విధానాన్నే అనుసరిస్తోంది. కానీ దక్షిణ కొరియా, జపాన్‌, తైవాన్‌, చైనాల మాదిరిగా సాంకేతికతలో నవీన ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకురాలేక పోతోంది. అనుకరణదారుగా మిగలడమే తప్ప నవ్య పథగామిగా ఎదగాలనే తృష్ణ భారత్‌కు లోపించిందనేది నిపుణుల భావన.

పరిశోధనల్లో వెనకబాటు

విజ్ఞాన శాస్త్రాల్లో మౌలిక పరిశోధనలు పేటెంట్లకు, వ్యాపార వృద్ధికి దారితీస్తాయి. వైద్య శాస్త్రంలో కొత్త పరిశోధనలు కొత్త రకాల ఔషధాల ఆవిష్కరణకు తోడ్పడతాయి. భారత్‌లో అలాంటి పరిశోధనలు జరగకపోవడం వల్లే అభివృద్ధి చెందిన దేశాలు ఎప్పుడు కొత్త మందులు కనిపెడతాయా, వాటిని లైసెన్సు మీద ఎప్పుడు ఉత్పత్తి చేద్దామా అని మన ఫార్మా కంపెనీలు కాచుకొని కూర్చోవలసి వస్తోంది. కొవిడ్‌ మాత్రమే కాకుండా ఎయిడ్స్‌, క్యాన్సర్‌ తదితర రోగాలకు కొత్త మందులను ఆవిష్కరించే సత్తా పాశ్చాత్య దేశాలకు మాత్రమే ఉందని సామాన్య జనం భావిస్తున్నారంటే ఆశ్చర్యమేముంది? ఇతర దేశాలు కనిపెట్టిన దాన్ని ఉపయోగించుకొంటే చాలనే తత్వాన్ని మనం వదిలించుకోవాలి. ఇతరులకు అనుచరులుగా మిగలకుండా నాయకులుగా వెలగాలనే పట్టుదల పాలకుల్లో, మేధావుల్లో వేళ్లూనుకోవాలి. ఏతావతా కొత్త సంగతులు కనిపెట్టాలనే తపన అణువణువునా జీర్ణించినప్పుడు మాత్రమే నోబెల్‌ కానీ, మార్కెట్‌ కానీ మన వశమవుతాయి. ఇంతవరకు ఎవరికీ తెలియనిది తెలుసుకున్న వారినే నోబెల్‌ వరిస్తుంది. ఈ సృజనాత్మక తృష్ణను పాఠశాల దశ నుంచే రేపటి పౌరుల్లో రగిలించాలి. ప్రశ్నించే తత్వాన్ని చిన్ననాటి నుంచే రంగరించాలి. ఆ స్వభావాన్ని మొగ్గలోనే తుంచివేయకూడదని గురువులు, పాలకులు గ్రహించి ప్రోత్సహించాలి. విద్యా, పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, ప్రభుత్వం- నవ సృజనలు ఆచరణీయంగా మారే వాతావరణాన్ని సృష్టించాలి.

సంపదసృష్టిలో విద్యాసంస్థలు

తాను భారతదేశంలోనే ఉండి పరిశోధనలు సాగించి ఉంటే నోబెల్‌ను సాధించలేక పోయేవాడినని అభిజిత్‌ బెనర్జీ నిర్మొహమాటంగా ప్రకటించారు. అమెరికాలోని జగద్విఖ్యాత మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ఆచార్యుడు ఆయన. ఎంఐటీలో మెరికల్లాంటి పీహెచ్‌డీ విద్యార్థులు ఉన్నారని, వారితోపాటు సహచరులు, మిత్రులు సహకరించడం వల్లే ఆర్థిక నోబెల్‌ను సాధించగలిగానని ఆయన చెప్పారు. భారతదేశంలో, ముఖ్యంగా మన విశ్వవిద్యాలయాల్లో సృజనశక్తిని పెంపొందించే వాతావరణం లేదని బెనర్జీ అన్యాపదేశంగా సూచించారు. మొదటి నుంచీ అత్యధిక నోబెల్‌ బహుమతులను గెలుచుకుంటున్న అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, రష్యా వంటి పాశ్చాత్య దేశాల్లో విశ్వవిద్యాలయాలే పరిశోధనలకు పట్టుగొమ్మలు. ఈ వర్సిటీల్లో ఉత్పన్నమైన పేటెంట్లు టెక్నాలజీగా రూపాంతరం చెంది ఉత్పత్తులుగా మారి మార్కెట్‌లో ప్రవేశి స్తాయి. సంపద సృష్టికి దోహదపడతాయి.

- ఏఏవీ ప్రసాద్‌

ఇదీ చూడండి : అఖండ భారత ఐక్యతా హారతిగా.. భారతమాత మందిరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.