ETV Bharat / opinion

ఉద్విగ్నత ఉద్రిక్తతల కలబోత!

author img

By

Published : Mar 27, 2021, 7:20 AM IST

18 కోట్ల మంది ఓటర్లు తమ ప్రతినిధుల్ని ఎన్నుకొనే మినీ సార్వత్రిక సమరంలో తొలి విడత పోలింగ్‌ ప్రక్రియకు నేడే తెరలేస్తోంది. ప్రధానిగా మోదీ తొలి జమానాలో దేశ రాజకీయాలకు గుండెకాయలాంటి యూపీని గుప్పిట పట్టినట్లే, మలి విడత పాలనలో మమత కోటను బీటలు వార్చి పశ్చిమ్‌ బంగలో పాగా వేయాలని కమలనాథులు కల కంటున్నారు. మరోవైపు, 'భూమి పుత్రిక'గా వెలుపలి శక్తుల్ని తూలనాడుతూ మమత వేస్తున్న ప్రాంతీయ పాచికలతో- ఆ రాష్ట్రంలో ఉద్రిక్తతలు ఊహాతీతంగా పెరుగుతున్నాయి.

eenadu editorial about first phase assembly elections
ఉద్విగ్నత ఉద్రిక్తతల కలబోత!

ఐదు శాసన సభల్లోని 824 స్థానాలకు 18 కోట్ల మంది ఓటర్లు తమ ప్రతినిధుల్ని ఎన్నుకొనే మినీ సార్వత్రిక సమరంలో తొలి విడత పోలింగ్‌ ప్రక్రియకు నేడే తెరలేస్తోంది. 2016 ఎన్నికల్లో మొత్తం మీద 64 సీట్లు సాధించిన కమలనాథులు అందులో 60 స్థానాల్ని అసోంలోనే ఒడిసిపట్టి ఈశాన్యంలో మొట్టమొదటిసారిగా అధికారమనే ఉట్టికొట్టడం తెలిసిందే. తక్కిన నాలుగులో ఒకటి కేరళలో, మరో మూడు పశ్చిమ్‌ బంగలో దక్కడం- భాజపా శ్రేణులకు కొత్త ఊపిరులూదిన పరిణామమే! 2019 లోక్‌సభ ఎన్నికల్లో అసోమ్‌లో తొమ్మిది, పశ్చిమ్‌బంగలో అంతకు రెట్టింపు గెలిచిన కమలం పార్టీ తక్షణ లక్ష్యం- తృణమూల్‌ కాంగ్రెస్‌ను పరాజయం పాలు చెయ్యడం, అసోమ్‌లో పునరధికారం సాధించడం!

క్రితంసారి గువాహటీలో అధికారం చేపట్టాకే- త్రిపుర, మణిపూర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌లలోనూ అందలం అందుకొన్న భాజపా- నాగాల్యాండ్‌, మేఘాలయల్లోనూ చక్రం తిప్పగలిగిందన్నది గమనార్హం. తరుణ్‌ గొగోయ్‌ లాంటి దిగ్గజ నేతను కోల్పోయిన కాంగ్రెస్‌- భాజపా కూటమిని దీటుగా ఎదుర్కోవడానికి బద్రుద్దీన్‌ అజ్మల్‌ నేతృత్వంలోని ఆల్‌ ఇండియా డెమోక్రటిక్‌ ఫ్రంట్‌తో జతకట్టి మహా జోత్‌ (మహా కూటమి) ఏర్పాటు చేసింది. తాము అధికారానికి వస్తే పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేదే లేదని కాంగ్రెస్‌ కరాఖండీగా ప్రకటిస్తుంటే, తరుణ్‌ గొగోయ్‌కి మరణానంతరం పద్మభూషణ్‌ పురస్కారం ప్రకటించడం ద్వారా రాజకీయ చాణక్యం ప్రదర్శించిన భాజపా- సీఏఏపై వెనక్కి తగ్గేదే లేదంటోంది. వరదలతోపాటు అక్రమ వలసల్నీ నివారించగలిగేది తామేనంటున్న భాజపా కూటమి- కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటేనే శీఘ్రగతిన అభివృద్ధి (డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌) సాధ్యపడుతుందని ఢంకా బజాయిస్తోంది. ఏ స్థాయి ఎన్నికలన్న దానితో నిమిత్తం లేకుండా మింటినీ మంటినీ ఏకం చేసే బహుముఖ ప్రచారార్భాటంతో భాజపా నేతల ముట్టడి- మూడంచెల పోలింగ్‌ జరిగే అసోమ్‌ను వచ్చే నెల ఆరు దాకా అట్టుడికించనుంది.

ప్రధానిగా మోదీ తొలి జమానాలో దేశ రాజకీయాలకు గుండెకాయలాంటి యూపీని గుప్పిట పట్టినట్లే, మలి విడత పాలనలో మమత కోటను బీటలు వార్చి పశ్చిమ్‌ బంగలో పాగా వెయ్యాలన్నది కమలనాథుల కల! దశాబ్దాల వామపక్ష కూటమి కోటల్నే కుమ్మికూలగొట్టి, సమధిక ఆధిక్యంతో 2016లో రెండో మారూ అధికారం చేపట్టిన మమత హ్యాట్రిక్‌ విజయంకోసం పరిశ్రమిస్తున్న వేళ- కత్తి కట్టిన కోడి పుంజుల్లా టీఎంసీ, భాజపాల సమరం ఉద్రిక్తత ఉద్విగ్నతల కలబోత! కాబట్టే మున్నెన్నడూ లేనట్లుగా ఎనిమిది విడతల పోలింగుకు నిర్వాచన్‌ సదన్‌ సిద్ధపడింది.

క్రితంసారి దాదాపు 45శాతం ఓట్లతో 211 సీట్లు గెలిచిన మమత పార్టీకి గత లోక్‌సభ ఎన్నికల్లోనే గట్టి 'షాక్‌' ఇచ్చిన భాజపా- టీఎంసీని నిశ్శేషం చేస్తామంటూ రాజకీయ వలసల్ని ప్రోత్సహించి వాతావరణాన్ని వేడెక్కించింది. మమత వెంటనున్న నేతలకు కేదస, ఈడీ దర్యాప్తులు చుక్కలు చూపిస్తుంటే- రాజకీయ పద్మవ్యూహంలో చిక్కి ఒక వంక భాజపాతో, మరోపక్క వామపక్ష-కాంగ్రెస్‌ కూటమితో మమత సాగిస్తున్న పోరు యావద్దేశం దృష్టినీ ఆకర్షిస్తోంది. దెబ్బతిన్న సివంగితో పోరు ప్రమాదకరమంటూ, 'భూమి పుత్రిక'గా వెలుపలి శక్తుల్ని తూలనాడుతూ మమత వేస్తున్న ప్రాంతీయ పాచికలతో- ఉద్రిక్తతలు ఊహాతీతంగా పెరుగుతున్నాయి. 46మంది ఫిరాయింపుదారులకు భాజపా టికెట్లివ్వగా, టీఎంసీ సైతం 16మందిని నిలబెట్టింది. పశ్చిమ్‌ బంగలో వలస పక్షులు గెలుపు తీరాలకు చేరడం అంత సులువు కాదంటున్న గతానుభవాల దృష్ట్యా- ఫలితాల సరళి మరింతగా రక్తి కట్టనుంది. నేడు పోలింగ్‌ జరగనున్న జంగల్‌ మహల్‌ పరగణాలోని 30 స్థానాల్లో 27 టీఎంసీ ఖాతాలోనివి కాగా, అక్కడి నాలుగు లోక్‌సభ సీట్లూ 2019లో భాజపా కైవసమయ్యాయి. తాజా ఎన్నికల తులాభారంలో ఓటరు వేసే తులసిదళం ఎటుపడిందన్న ఉత్కంఠ తీరాలంటే- మే నెల రెండు దాకా ఆగాలి!

ఇదీ చూడండి:కొవిడ్ కట్టడికి త్వరపడాల్సిన తరుణమిది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.