ETV Bharat / opinion

మృత్యుఘంటికలు- రహదారులపై రక్తచరిత్ర!

author img

By

Published : Feb 17, 2021, 6:50 AM IST

దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా సగటున రోజుకు 415 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 70శాతం ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమే. రోడ్డు ప్రమాదాలను 2025నాటికి 50శాతానికి, 2030నాటికి పూర్తిగా తగ్గించాలన్నది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం. ఇందులో భాగంగానే జనవరి 18నుంచి నేటి వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Editorial on road accidents in india and goals to reduce road accidents
రోడ్లపై మృత్యుఘంటికలు!- రోడ్డు భద్రతా మాసోత్సవం

ఏటా అయిదు లక్షల రోడ్డు ప్రమాదాలు, లక్షన్నర మరణాలు, మూడు లక్షల మంది క్షతగాత్రులు.. ఇదీ మన దేశంలో రహదారులపై సాగుతున్న రక్తచరిత్ర! దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా సగటున రోజుకు 415 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో 18నుంచి 45 సంవత్సరాల వయసులోని వారే 70శాతం మేర ప్రాణాలు కోల్పోతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో 70శాతం ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమే. దీనికితోడు అధ్వాన రహదారులు, సరైన శిక్షణ లేకుండానే వాహనాలు నడపడం, కాలం చెల్లిన వాహనాలను నడపడం వంటివి మృత్యుఘోషకు కారణాలవుతున్నాయి. ఈ తరుణంలో రహదారి భద్రతపట్ల ప్రజల్లో అవగాహన కల్పించి, ప్రమాదాలను నివారించడంపై రవాణా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రోడ్డు ప్రమాదాలను 2025నాటికి 50శాతానికి, 2030నాటికి పూర్తిగా తగ్గించాలన్నది ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం. ఇందులో భాగంగానే జనవరి 18నుంచి నేటి వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం పేరిట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

భయపెడుతున్న మరణాల సంఖ్య!

మధ్యప్రదేశ్‌ సీధీ జిల్లాలోని పట్నా గ్రామంలో నిన్నటి రోజున ఓ బస్సు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్ళిన ప్రమాదంలో 47మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ప్రపంచంలోని వాహనాల్లో ఒక శాతం వాటా కలిగిన భారత్‌- రహదారి ప్రమాద బాధితుల్లో మాత్రం ఏకంగా పది శాతం వాటా కలిగి ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక వెెల్లడించింది. సంపన్న కుటుంబాలతో పోలిస్తే- రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారి సంఖ్య పేద కుటుంబాల్లో రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. రోడ్డు ప్రమాదాలు భారత్‌తో పోలిస్తే అమెరికా, జపాన్‌లలోనే అత్యధికంగా ఉన్నాయి. మృతుల సంఖ్య మాత్రం భారత్‌లోనే గరిష్ఠం. అమెరికాలో రోడ్డు ప్రమాదాల కారణంగా 2018లో 37,481 మంది మృతి చెందగా- జపాన్‌లో ఆ సంఖ్య 4,698గా ఉంది. భారత్‌లో మాత్రం లక్షన్నర మంది మృత్యువాతపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో నిత్యం ఏదో ఒక రూపంలో రహదారులు రక్తసిక్తమవుతూనే ఉన్నాయి. ఏపీలో రోడ్డు ప్రమాదాలు అత్యధికం రాత్రి సమయాల్లోనే చోటుచేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019లో 21,992 ప్రమాదాలు జరగ్గా- 7,984 మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో రహదారి ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయి. 2019తో పోలిస్తే 2020లో మరణాలు దాదాపు 11శాతం తగ్గాయి. 2019లో జరిగిన ప్రమాదాల కారణంగా 6,964 మంది ప్రాణాలు కోల్పోగా- 2020లో ఆ సంఖ్య 6,668కి పడిపోయింది.

రోడ్డు ప్రమాద బాధితులను తక్షణం సమీప ఆసుపత్రులకు తీసుకొచ్చే వారికి రెండు వేల రూపాయల ప్రోత్సాహకం ఇచ్చేలా ఝార్ఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. మరణాల శాతాన్ని తగ్గించడమే దీని పరమార్థం. రహదారి ఎంత బాగున్నా- డ్రైవర్ల నిర్లక్ష్యం, నియంత్రణ లేకపోవడం వంటివి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. దేశంలో 22లక్షల మేర డ్రైవర్ల కొరత ఉందని కేంద్ర రహదారి, రవాణా శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో పెద్దయెత్తున డ్రైవింగ్‌ స్కూళ్లు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరముందని ఆ శాఖ అభిప్రాయపడుతోంది. ఇందుకోసం నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి వెనకబడిన, గిరిజన ప్రభావిత జిల్లాల్లో డ్రైవింగ్‌ స్కూళ్ల ఏర్పాటుకు అది అడుగులు కదుపుతోంది.

తమిళనాడు ఆదర్శం

తమిళనాడు ప్రభుత్వం చొరవగా తీసుకున్న చర్యలు దాదాపు 53శాతం మరణాలను తగ్గించగలిగాయి. ప్రమాద స్థలానికి 13 నిమిషాల్లోనే అంబులెన్స్‌ చేరుకోవడం, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడం వంటి చర్యలు మరణాలను తగ్గిస్తున్నాయి. వాహనచోదకులకు లైసెన్సుల జారీలోనూ తమిళనాడు కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఇతర రాష్ట్రాలూ ఇలాంటి చర్యలపై దృష్టి సారించాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కడా రోడ్లపై తెరచి ఉంచిన మ్యాన్‌హోళ్లు, రహదారులపై గుంతల కారణంగా ప్రజలు మరణించిన ఉదంతాలు కనిపించవు. కానీ మన దేశంలో రహదారులపై నెలల తరబడి మ్యాన్‌హోళ్లు తెరిచి ఉంచినా పట్టించుకునే పరిస్థితి లేదు. రహదారుల మరమ్మతుల్లోనూ అంతులేని నిర్లక్ష్యం, జాప్యం చోటుచేసుకోవడం ప్రమాదాలకు కారణమవుతోంది. ప్రమాదాలకు ఆస్కారంలేని విధంగా రహదారులను తీర్చిదిద్దడంతోపాటు వాహనచోదకులంతా సుశిక్షితులై ఉండేలా చర్యలు తీసుకోవాలి. అతివేగంగా, మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రజల ప్రాణాలు బలిగొనేవారికి కఠిన శిక్షలు విధించాలి. రహదారి భద్రతను ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలి. అప్పుడే 2030నాటికి దేశాన్ని రోడ్డు ప్రమాదరహితంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకోవడం సాధ్యం!

- కృష్ణంరాజు తాళ్ల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.