ETV Bharat / opinion

'పరోక్ష యుద్ధం' కోసమే ఈశాన్యంలో చైనా పాగా!

author img

By

Published : May 31, 2020, 7:17 PM IST

భారత్​తో ప్రత్యక్షంగా తలపడలేక వేర్పాటువాదులకు చైనా వత్తాసు పలుకుతోందా? ఇటీవలి కాలంలో బలహీనపడిన వేర్పాటువాద బృందాలకు సహాయం చేస్తోందా? పరోక్ష యుద్ధంతోనే తన ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని డ్రాగన్ దేశం తపిస్తోందా? అందుకోసమే ఈశాన్యంలో చైనా తన జోక్యాన్ని పెంచుకుంటోందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొన్ని కారణాలు ఈ అంశాలను ధ్రువీకరిస్తున్నాయి.

china india border dispute
చైనా భారత్ సరిహద్దు వివాదం

ఈశాన్యంలో భారత్​-చైనా మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఇరుదేశాల మధ్య బహిరంగంగానే ఘర్షణ జరుగుతోంది. ఈ పరిస్థితులు ఈశాన్య భారతదేశంలో తీవ్రవాద కదలికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అసోం, మణిపుర్, నాగాలాండ్​ రాష్ట్రాల్లోని వేర్పాటువాదుల విషయంలో చైనా జోక్యం చేసుకునే అవకాశం ఉంది.

దశాబ్దాలుగా భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి పూర్తిగా బలహీనపడిపోయిన ఈ తిరుగుబాటు దళాలు... చైనా సహాయం అందితే మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉంది.

ఈశాన్య భారతదేశంలో చైనా తన కార్యకలాపాలు పెంచుకుంటోందని చెప్పడానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. వేర్పాటువాదులకు చైనా పరోక్ష సహాయం, సరిహద్దు వెంబడి బలగాల మోహరింపు, జాతి వివక్ష పేరిట సమస్యలకు ఆజ్యం పోయడం వంటివి ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

1. సైన్యాన్ని మోహరించడం

ఇరు దేశాలు వివాదాస్పద సరిహద్దుల వెంబడి తమ సైన్యాన్ని భారీ సంఖ్యలో మోహరిస్తున్నాయి. ఘర్షణ వాతావరణం తలెత్తిన ప్రాంతాల్లోకి రోడ్డు, వాయు మార్గంలో సైనికులను తరలిస్తున్నాయి.

భారత్​తో ఉన్న 3,488 కిలోమీటర్ల సరిహద్దు వెంట వీలైనన్ని సైనిక స్థావరాలను ఏర్పాటు చేసేందుకు చైనా వ్యూహాత్మక రచనలు చేస్తోంది. తద్వారా భారత సైన్యం అన్ని వైపులా విస్తరించి బలహీనపడుతుందని పన్నాగాలు పన్నుతోంది.

ప్రస్తుతం ఉత్తరాఖండ్, సిక్కిం రాష్ట్రాల సరిహద్దు వెంబడి ఉన్న ఈ ఘర్షణలు అరుణాచల్​ ప్రదేశ్​కు వ్యాపించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే అరుణాచల్​ ప్రదేశ్​ను తమ పరిధిలో ఉన్న టిబెట్​లో అంతర్భాగంగా పరిగణిస్తోంది చైనా. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలోనూ ఉద్రిక్తతలు ప్రారంభించడాన్నీ కొట్టిపారేయలేం.

భారత్​ సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తూనే... సైన్యాన్ని, రక్షణ సామగ్రిని తరలిస్తోంది. ఉత్తర సరిహద్దులో ఉన్న కొద్దిపాటి సైనికులకు సహాయంగా మరింత సైన్యాన్ని మోహరిస్తోంది.

2. తిరుగుబాటుదారులతో సంబంధాలు

ఈశాన్య తిరుగుబాటుదారులకు చైనాకు దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పలు రాష్ట్రాల్లో విస్తరించిన ఉన్న ఈ తిరుగుబాటుదారుల ద్వారా చైనా తన ప్రయోజనాలను నెరవేర్చుకునే అవకాశం ఉంది.

ఆయుధ శిక్షణతో పాటు చైనా అధికారులు, సైన్యంతో సంబంధాలు పెంచుకోవడానికి 1967లో తొలిసారి 133 మంది నాగా తిరుగుబాటుదారుల బృందం డ్రాగన్ దేశానికి బయలుదేరింది. అత్యంత కష్టతరమైన మార్గం గుండా చైనాకు చేరుకుంది. ఆ తర్వాతి కాలంలో మరెన్నో బృందాలు చైనాకు వెళ్లాయి.

అదే విధంగా అసోంకు చెందిన యూఎల్​ఎఫ్​ఏ, మణిపుర్​కు చెందిన మెయితెయి తిరుగుబాటుదారులు సైతం చైనా ప్రభుత్వంతో సంబంధాలు ఏర్పర్చుకునేందుకు ప్రయత్నించారు. ఇవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

అసోం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్(యూఎల్​ఎఫ్​ఏ) చీఫ్ కమాండర్ పరేష్ బారువా చైనాలోనే ఉంటున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. యున్నాన్ రాష్ట్రంలోని సరిహద్దు పట్టణమైన 'రుయిలి' అనే ప్రాంతంలో పరేష్ తలదాచుకుంటున్నట్లు భావిస్తున్నారు. అక్కడి నుంచి తరచుగా మయన్మార్​ అటవీ ప్రాంతంలో ఉన్న తమ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్నట్లు సమాచారం.

నాగా ఉద్యమకారులు సైతం ఒకానొక సమయంలో చైనా సహాయం కోసం ప్రయత్నించారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రారంభించిన తిరుగుబాటు సంస్థలన్నీ తొలినాళ్లలో చైనా అధికారుల సహాయాన్ని అర్థించినవే. అయితే వీరికి చైనా బహిరంగంగా సహాయం ప్రకటించకపోయినా.. పరోక్షంగా మేలు చేసింది. చైనాకు సంబంధం లేని వ్యక్తుల నుంచి ఆయుధాల సేకరించడంలో సహాయపడింది.

3. భారత ప్రభుత్వంపై అసంతృప్తి

నాగాలాండ్, మణిపుర్, అసోంలోని నాగా తిరుగుబాటుదారులు భారత ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న చర్చలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్లపై చాలా వరకు వెనక్కి తగ్గినప్పటికీ.. సమస్యల పరిష్కారం కోసం తుది తీర్మానం రూపొందించడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆరోపిస్తున్నారు.

నాగాలాండ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్(ఎన్​ఎస్​సీఎల్​)తో గత 23 ఏళ్లుగా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. యూఎల్​ఎఫ్​ఏతో 15 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో జరుగుతున్న తమ చర్చలు ముగిసినట్లేనని ఈ వేర్పాటువాద బృందాలు స్పష్టం చేస్తున్నాయి. తుది నిర్ణయం ప్రభుత్వం వద్దే ఉందని తేల్చిచెబుతున్నాయి.

కరోనా వైరస్​తో బీజింగ్​ పోరాడుతున్న సమయంలో నాగా వేర్పాటువాదులు చైనాకు సంఘీభావం తెలిపారు. ఫిబ్రవరి 14న దాదాపు 2 వేల మంది నాగా వేర్పాటువాదులు మణిపుర్​లోని ఉఖ్​రుల్​లో చైనాకు మద్దతుగా పాటలు పాడారు. ఏడు దశాబ్దాలుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారం అందించడంలో భారత ప్రభుత్వం వైఫల్యానికి వ్యతిరేకంగానే వీరు ఈ విధంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు.

4. జాతివివక్షతో ఆజ్యం

జాతి వివక్ష ఘటనల మధ్య భారతదేశ ప్రధాన భూభాగంలోని ప్రజలకు, ఈశాన్య ప్రజలకు మధ్య విభజన రేఖలు ఇటీవలి కాలంలో అధికమయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇవి మరింత ఎక్కువైపోయాయి. ఈశాన్య ప్రజలకు.. చైనీయుల ముఖవైఖరికి దగ్గరి పోలికలు ఉండటం వల్ల వీరి పట్ల వివక్ష తలెత్తింది. దీన్ని ఆసరాగా తీసుకొని చైనా అధికారిక మీడియా ఇలాంటి ఘటనలను భూతద్దంలో చూపించే ప్రయత్నాలు చేసింది. సమస్యను మరింత జఠిలం చేసే విధంగా ఈ వివక్షలకు ఆజ్యం పోసింది.

5. ఉపాధి కోల్పోయిన యువతకు గాలం

చైనా మద్దతు వల్ల ఈశాన్య వేర్పాటువాదులు తమ బలగాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది. తమ స్పస్థలాలకు తిరిగి వస్తున్న వలస కార్మిక యువతకు గాలం వేసే అవకాశం ఉంది. ఒక్కసారిగా ఉపాధి కోల్పోవడం, ఆదాయ మార్గాలకు గండి పడటం వల్ల లక్షలాది మంది యువత నిరుద్యోగులుగా మారారు. వేర్పాటువాద బృందాలు వీరిపై ప్రత్యేకంగా దృష్టిసారించేందుకు యత్నిస్తారు.

6. పౌరసత్వ చట్టంపై అసంతృప్తి

పొరుగున ఉన్న ముస్లిం మెజారిటీ దేశాల్లో వివక్షకు గురై భారత్​కు వలస వచ్చిన మైనారిటీలకు పౌరసత్వం ఇవ్వడం పట్ల ఈశాన్య భారత ప్రజలు కొందరు ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయడం ద్వారా తమ విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెడుతోందన్న భావనలో ఉన్నారు. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు మొదలయ్యాయి. వారి ఆందోళనలకు ఇప్పటికీ సరైన పరిష్కారం లభించలేదు.

7. పరోక్ష యుద్ధమే మేలని..!

పరోక్ష యుద్ధాల ద్వారానే చైనా తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం పొందాలని చూస్తోంది. భారత్​తో హైబ్రిడ్ యుద్ధాన్ని ప్రేరేపిస్తూ తన ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నియంత్రణ రేఖ సహా కశ్మీర్​ లోయ వెంబడి అత్యంత ఖరీదైన పరోక్ష యుద్ధంలో భారత్ పాల్గొంటోంది. దీంతో ఉత్తర, ఈశాన్య సరిహద్దులోనూ ఈ ఉద్రిక్తతలను ప్రేరేపించేందుకు చైనా యత్నిస్తోంది.

దూకుడు వ్యూహమే డ్రాగన్​కు మూకుతాడు

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సైతం దూకుడైన చర్యలే చేపట్టాలి. ఈశాన్య భారతదేశ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు దారితీసేలా చైనా రచించిన ప్రణాళికలను కకావికలం చేయడానికి దూకుడైన వ్యూహమే సరైనదని గుర్తించాలి.

(రచయిత-సంజీవ్​ బారువా, సీనియర్ జర్నలిస్ట్)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.