ETV Bharat / lifestyle

Heritage Sites in India : భారత్​లో యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ కట్టడాలు ఇవే..

author img

By

Published : Aug 1, 2021, 8:57 AM IST

భారత్​లో యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ కట్టడాలు ఇవే
భారత్​లో యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ కట్టడాలు ఇవే

భారతీయ ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు. అద్వితీయ శిల్పచాతుర్యానికి నెలవులు... పూర్వీకులు మనకందించిన వెలలేని కానుకలు. అపురూపమైన ఆ సంపదను పదిలంగా కాపాడి భావితరాలకు భద్రంగా అందించడం భారతీయులందరి బాధ్యత. ఆ బాధ్యతా నిర్వహణలో వెన్నుదన్నుగా నిలుస్తుంది ‘యునెస్కో వారసత్వ కట్టడం(Heritage Sites in India)’ గుర్తింపు! ఈ గుర్తింపుతో అంతర్జాతీయ నిధులు దక్కి... వారసత్వ కేంద్రాలు ప్రపంచస్థాయి పర్యటక ప్రదేశాలుగా మారతాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా రామప్ప ఆలయం ఆ ఘనతను సాధించి... మనదేశంలో ఇదివరకే ఈ గుర్తింపు పొందిన మరికొన్ని అద్భుత ఆలయాల సరసన చేరింది. రామప్పతోపాటూ వాటి విశేషాలేమిటో చూద్దామా!

భారతావనిలో ఆలయాలు(Heritage Sites in India) నిర్మించని రాజులు లేరంటే అతిశయోక్తి కాదు. చిన్నా చితకా రాజులే ఆలయాలు నిర్మిస్తుంటే కాకతీయుల్లాంటి చక్రవర్తులు ఊరుకుంటారా! అసలు ఆలయ నిర్మాణ పద్ధతుల్నే మలుపు తిప్పేంతటి అద్భుత నిర్మాణ శైలిని ప్రపంచానికిచ్చారు. కాకతీయుల శిల్పచాతుర్యానికి పరాకాష్ట అని చెప్పదగ్గ నిర్మాణం రామప్ప ఆలయం. ఇక్కడున్న ప్రతి శిల్పం ఓ సజీవమూర్తిగానే తోస్తుంది చూపరులకి. అందుకే... ఎనిమిది వందల ఏళ్లకిందటే ఈ ఆలయాన్ని చూసిన ప్రఖ్యాత యాత్రికుడు మార్కోపోలో ‘దక్కనీ ఆలయాలనే నక్షత్రాల రాశిలో... ఇదో వేగుచుక్క!’ అని రాశాడు. అంతగా ఏముంది ఇందులో అంటే...

మిగతా అన్ని గుడుల్లా రామప్ప ఆలయం కేవలం భక్తి కోసమే నిర్మించింది కాదు... దీని నిర్మాణం వెనక గొప్ప కళానురక్తీ ఉంది. ఓ రకంగా చెప్పాలంటే నాట్యరీతుల్ని భావితరాల కోసం నిక్షిప్తం చేయాలనే ఆలోచనతో కట్టిన ఆలయం ఇది. కాకతీయ గజసేనాధిపతి జాయప రాసిన ‘నృత్తరత్నావళి’ అనే గ్రంథానికి ఈ ఆలయం ఓ శిల్పరూపం! ఇప్పుడైతే ఎవరైనా ఏదైనా పుస్తకం రాస్తే దాన్ని ఆడియో రూపంలోనో, డిజిటల్‌ రూపంలోనో పదిలం చేస్తున్నారు. ఆ కాలంలో అవన్నీ లేవు కదా! అందుకే... ఆ పుస్తకం కోసం ఇలా ఓ ఆలయాన్ని నిర్మించి దాన్ని శాశ్వతం చేశారు. అందుకే ఈ గుడిని ‘నృత్తరత్నావళి’ అన్న గ్రంథానికి ‘లక్షిత’(రిఫరెన్స్‌) ఆలయం అంటున్నారు పరిశోధకులు. మనదేశంలో ఇలాంటి లక్షిత ఆలయం ఇంకొకటి లేదు. అందుకే ఈ ఆలయం అడుగడుగునా నాట్యభంగిమలే కనిపిస్తాయి. ముఖ్యంగా ఇక్కడి శివతాండవ శిల్పాలను చూడడానికి రెండు కళ్లూ చాలవు, 24 గంటలూ సరిపోవు.

రామప్ప ఆలయం

అన్నింటా మేటి...

కాకతీయులు ఒకప్పుడు పశ్చిమ చాళుక్యుల సామంతులు. అందువల్ల ఆ కర్ణాటక ఆలయ నిర్మాణ ప్రభావం వీళ్లపైన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నక్షత్ర ఆకారంలాంటి అడుగుభాగం, దానిపైన ప్రధాన ఆలయంతోపాటూ మరో రెండు ఆలయాలని నిర్మించడం(త్రికూటం అంటారు), దక్షిణాది(వేసర) ఉత్తరాది(నాగర) శైలుల్ని మిళితం చేయడం... ఇవన్నీ చాళుక్యుల నుంచి వీళ్లు తెచ్చుకున్నవే. కానీ రామప్ప ఆలయంలో తమదైన ప్రత్యేకతలెన్నో చాటారు. ఆలయ పునాదిని ఇసుకమట్టి(శాండ్‌ బాక్స్‌)పైన నిర్మించడం అందులో మొదటిది. దాని వల్లే 1819లో ఇక్కడ తీవ్రమైన భూకంపం వచ్చినా ఆలయ పైకప్పు పడటం తప్ప ఇంకే నష్టమూ జరగలేదు. ప్రధాన ఆలయంలోని విమానాన్ని అతితేలికైన ఇటుకరాయితో నిర్మించారు. మనం వాడుతున్న ఇటుకల బరువుతో పోలిస్తే ఇది కేవలం మూడోవంతే తూగుతుంది... నీటిలోనూ తేలుతుంది. ఇక, మధ్యలో ఉన్న శిల్పాలన్నింటికీ ‘మెత్తటి’ కొండరాళ్లని వాడారు. లావా గడ్డకడితే ఏర్పడే బసాల్ట్‌ రాళ్లివి. వరంగల్‌లో విరివిగా దొరికే ఈ రాళ్లు శిల్పి రామప్ప చేతుల్లో మైనపు ముద్దల్లా మారాయేమో అనిపిస్తాయి! ముఖ్యంగా ముఖమంటపంలో రవంత ఖాళీ కూడా లేకుండా శిల్పాకృతులతో తీర్చిదిద్దాడు రామప్ప. సాధారణంగా ఒకదానికొకటి ముడిపడినట్టుండే వరస శిల్పాలు... వేర్వేరుగా చూస్తే పెద్దగా అందంగా అనిపించవు. ఇక్కడలా కాదు... ప్రతి శిల్పమూ, దానికి ప్రతి అలంకరణా ప్రత్యేక సౌందర్యంతో మైమరపిస్తుంది. ఇక స్తంభాలపైన చెక్కిన మోహినీ, నాగినీ(మదనికలు)లు... కాకతీయ శిల్పకళ ప్రత్యేకతకి నిలువెత్తు సాక్ష్యాలు. ఆ సన్నటి నడుమూ, నాట్యం చేస్తున్నట్టున్న కాళ్లూ... కాకతీయుల శిల్ప సౌందర్య శైలిగా నిలిచిపోయాయి. ఆ తర్వాత దేశమంతా వ్యాపించాయి! 13వ శతాబ్దంలో మాలిక్‌కపూర్‌ దండయాత్రలో శిధిలమైన ఈ ఆలయాన్ని నిజాం నవాబు మీర్‌ఉస్మాన్‌అలీ పునరుద్ధరించి 1931లో జనసందర్శనకు తలుపులు తెరిచారు.

కావేరి ఒడ్డున... కమనీయ శిల్ప సంపద!

కావేరి ఒడ్డున... కమనీయ శిల్ప సంపద!

మిళనాడు పేరు చెప్పగానే ఎన్నో ఆలయాలు అద్భుత కళారూపాల్లా కళ్లముందు కదులుతాయి. అయితే ఆ దేవాలయాలన్నింటికీ తొలి నమూనాలాంటిది బృహదీశ్వరాలయం. చోళుల కాలంలో రూపుదిద్దుకున్న ఈ ఆలయం తంజావూరులోని కావేరి నది ఒడ్డున కొలువై ఉంటుంది. క్రీస్తుశకం 1004-1009 మధ్య మొదటి రాజరాజ చోళుడు కేవలం ఐదు సంవత్సరాల వ్యవధిలో ఈ గుడిని కట్టించాడు. శత్రురాజుల మీద విజయానికి గుర్తుగా అరుదైన శిల్పాలతో ఈ భారీ ఆలయాన్ని నిర్మింపజేశాడు. చోళపాలకులు ఈ ఆలయానికి ‘రాజరాజేశ్వరం’ అని పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత కాలంలో తంజావూరుని పాలించిన మరాఠా పాలకులు దీన్ని ‘బృహదీశ్వరాలయం’గా మార్చేశారు. నిర్మాణానికి కేవలం గ్రానైట్‌రాళ్లనే వాడటం ఈ దేవాలయ విశిష్టత. గుడి నిర్మాణానికి 1,30,000 టన్నుల రాళ్లను ఉపయోగించారట. అలా మొదటి గ్రానైట్‌ దేవాలయంగా పేరు పొందింది. భారతదేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణాల్లో ఒకటిగా నిలిచింది. పై భాగంలో 80 టన్నుల ఏకశిలతో చేసిన విమాన గోపురం ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. నిజానికి, తంజావూరు చుట్టూ పెద్ద పర్వతాలేవీ ఉండవు. ఈ గ్రానైట్‌ రాళ్లని కొన్ని వందల కిలోమీటర్ల ఉత్తర ప్రాంతం నుంచి అతికష్టంపై తెచ్చారని చెబుతారు. తేవడమే కాదు, క్రేన్‌లేవీ లేని కాలంలో గుడిపైకి తీసుకెళ్లి విమాన గోపురాన్ని నిర్మించడం ఓ వాస్తు అద్భుతమే అని చెప్పుకోవాలి. వాస్తు శాస్త్రాన్ని అనుసరించి కట్టిన ఈ ఆలయానికి వెయ్యేళ్లు దాటినా ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందంటే ఆశ్చర్యపరిచే విషయమే. ఆలయంలోకి వెళ్లగానే గర్భగుడిలో పదమూడు అడుగుల ఎత్తున్న ఏకశిలా శివలింగం దర్శనమిస్తుంది. దీనికి ఎదురుగా ఏకరాతితో నిర్మించిన అతి పెద్ద నందీశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. 20 టన్నుల నల్లని గ్రానైట్‌ రాయితో - అంటే ఏకశిలతోనే ఈ నందిని కూడా నిర్మించడం విశేషం. ఆలయం గోడలపైన అన్ని దేవతల విగ్రహాల్నీ చూడొచ్చు. అష్ట దిక్పాలకుల విగ్రహాలున్న అరుదైన దేవాలయాల్లో ఇదీ ఒకటి. దీంతోపాటు ‘గ్రేట్‌ లివింగ్‌ చోళ టెంపుల్స్‌’ పేరుతో అరియలూర్‌ జిల్లా జయంకొండం దగ్గర ఉన్న గంగైకొండ చోళపురం బృహదీశ్వరాలయానికీ, కుంభకోణం దగ్గర్లో ఉన్న దారాసురంలో కొలువైన ఐరావతేశ్వర దేవాలయానికీ ప్రపంచ వారసత్వ జాబితాలో యునెస్కో చోటిచ్చింది. ఇవి కూడా చోళుల కాలానికి చెందిన ఆలయాలే. మొదటిదాన్ని రాజ రాజచోళుని కొడుకు రాజేంద్ర చోళుడు తన తండ్రిని అనుసరిస్తూ కడితే... రెండోదాన్ని రెండో రాజరాజచోళుడు నిర్మించాడు.

మహాబలిపురం... కళలకు గోపురం!

మహాబలిపురం... కళలకు గోపురం!

ప్రపంచ వారసత్వ సంపద

క్క భారతీయులకే కాదు, ప్రపంచ కళా సంస్కృతికే వారసత్వంగా వచ్చిన కలికితురాయి మహాబలిపురం. అందుకే, 1984లోనే యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.

మహాబలిపురాన్నే మామల్లపురం అని కూడా పిలుస్తారు. తమిళనాడులోని చెంగల్‌పట్టు జిల్లాలో చెన్నైకి 50కి.మీ దూరంలో ఉన్న ఈ చోటు పల్లవరాజుల ఘన చరిత్రకూ కళా వైభవానికీ తార్కాణం. ఇక్కడ... ఒకవైపు కొండలను తొలిచి నిర్మించిన గుహాలయాలు ఆకట్టుకుంటే మరోవైపు ఏక శిలలను చూడచక్కని దేవాలయాలుగా మార్చిన విధానం కళ్లను కట్టిపడేస్తుంది. బంగాళా ఖాతం ఒడ్డున ప్రకృతి అందాల మధ్య కనువిందు చేసే ఈ కట్టడాలను ఆరు నుంచి తొమ్మిదవ శతాబ్దం మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవ రాజులు నిర్మించారు. సహజంగా ఆ చోటులో ఉన్న కొండలనూ బండరాళ్లనూ తొలిచే ఇంతటి అందమైన శిల్ప సౌందర్యాన్ని సృష్టించారంటే అప్పటి శిల్పుల పనితనం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. మహాబలిపురంలోని కట్టడాలు అయిదు ప్రధాన విభాగాలుగా ఉంటాయి.

గుహాలయాలు... మండపాలుగానూ పేర్కొనే ఈ గుహాలయాలను ఒకటో నరసింహవర్మ కాలంలో నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. వీటిలో కోనేరి మండపం, మహిషాసురమర్దిని గుహ, వరాహమండపం చెప్పుకోదగినవి. ఈ మండపాల గోడలమీద ఆనాటి కళా వైభవాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను చాటే శిల్పాలు చెక్కి ఉంటాయి.

గుహాలయాలు

రథాలు... మహాబలిపురంలో మరో ప్రధాన ఆకర్షణ దేవుడి రథాల ఆకారంలో నిర్మించిన అయిదు ఆలయాలు. అందుకే, వీటిని రథాలు అనే పిలుస్తారు. ఆశ్చర్యం ఏంటంటే... ఇవన్నీ ఏక శిలా ఆలయాలే. అంటే ఒక్కో కొండ రాయిని తొలిచి ఒక్కో ఆలయంగా నిర్మించారన్నమాట. రథాలను తలపించేలా అతి సూక్ష్మమైన కళాకృతులతో వీటి గోడలను మలిచిన విధానమూ... ఆ మధ్యలో దేవతా మూర్తులూ రాజుల శిల్పాలను చెక్కిన తీరునూ కళ్లారా చూసి తీరాల్సిందే.

రాతి కళాఖండాలు... ఇక్కడ ఆరుబయట ఉన్న నాలుగు బండరాళ్ల పైన వేరు వేరు పురాణ ఘట్టాలను ఇతి వృత్తంలా చెక్కారు. మహాశివుడి కోసం తపస్సు చేసిన అర్జునుడు పాశుపతాస్త్రం పొందిన ఘట్టాన్ని ఒకేరాతిపై చెక్కిన విధానం చూస్తే ఆనాటి శిల్పుల నైపుణ్యం ఎంత ఘనమైందో అర్థమవుతుంది. వరద ముద్రతో ఉన్న పరమశివుని విగ్రహం శిల్పకారుల పనితనానికి ప్రాణం పోసినట్లుంటుంది.

ఆలయాలు... రాజా రాజసింహవర్మ కాలంలో ముకుందనయనార్‌, ఒలక్కనేశ్వరాలయాలను నిర్మించారు. ఇక్కడ సముద్రానికి ఆనుకుని ఉన్న ఆలయ గోపుర అందాలు ఆనాటి ద్రవిడ నిర్మాణశైలికి అద్దం పడతాయి. వీటితో పాటు, ఒకే రాతి మీద తొలిచిన మెట్లబావి, ఆ చుట్టూ చెక్కిన రకరకాల శిల్పాలు కూడా కనువిందు చేస్తాయి.

బుద్ధుడు నడచిన నేల... మహాబోధి

మహాబోధి

బౌద్ధమతానికి బీజం పడిన చారిత్రక ప్రాంతం... ప్రపంచవ్యాప్త బౌద్ధుల ఆధ్యాత్మిక ఆలయం... కేవలం ఇటుకతో నిర్మితమైన అపురూప నిర్మాణం... అన్నీ కలిస్తే మహాబోధి ఆలయం. గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటి ఈ ఆలయం. మనదేశంలో యునెస్కో గుర్తింపు పొందిన వారసత్వ కట్టడాల్లో అన్నిటికన్నా పాతదీ, క్రీస్తు పూర్వకాలానికి చెందినదీ అయిన ఆలయం ఇదొక్కటే. దాదాపు ఏడువారాలపాటు బుద్ధుడు ఇక్కడ గడిపిన ఆనవాళ్లకు ఆలయ రూపమిచ్చిన ఘనత అశోక చక్రవర్తిది. క్రీ.పూ.3వ శతాబ్దంలో అశోకుడు ఈ గుడిని కట్టించాడట. ఆ తర్వాత క్రీ.శ.5, 6 శతాబ్దాల్లో గుప్తులు దీన్ని పునర్నిర్మించారు. గాంధార శైలిలో స్తూపాలతో అచ్చంగా ఇటుకలతోనే నిర్మించినా, ఇన్ని శతాబ్దాలైనా చెక్కుచెదరకపోవడం ఈ ఆలయ నిర్మాణంలోని గొప్పదనం. అదే దీనిని వారసత్వ సంపద ఖాతాలో చేర్చింది. చాలాకాలం పాటు ఇది హిందూ దేవాలయంగా ఉండేది. మహాబోధి సంఘం వారు సంవత్సరాల తరబడి న్యాయపోరాటం చేసి దేశానికి స్వాతంత్య్రం వచ్చాక దీనిమీద తమ హక్కుని గెలుచుకుని బౌద్ధదేవాలయంగా తీర్చిదిద్దుకున్నారు. అప్పటినుంచి బుద్ధుడు నడయాడిన ఈ నేల... ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలకు వేదికైన పుణ్యభూమిగా ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులూ హిందువులూ సందర్శించే పవిత్ర క్షేత్రంగా ఆదరణ పొందుతోంది.

మహాబోధి

బిహార్‌ రాజధాని పట్నాకి 115కి.మీ.దూరంలో గయ జిల్లాలో ఉంది మహాబోధి ఆలయం. 12 ఎకరాల విశాలమైన ప్రాంగణంలో బుద్ధుడికి జ్ఞానోదయమైన బోధి వృక్షం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఆ చెట్టు కింద బుద్ధుడు ధ్యానం చేసుకున్నచోట శాండ్‌స్టోన్‌తో అశోకుడు నిర్మించిన వజ్రాసనమే కొద్దిపాటి మరమ్మతులతో ఇప్పటికీ కన్పిస్తుంది. దానికి ఒక పక్కగా 55మీటర్ల ఎత్తున ఠీవిగా నిలిచి ఉంటుంది మహాబోధి ఆలయం. గర్భగుడిలో కూర్చుని ఉన్న ఐదడుగుల బుద్ధుడి విగ్రహం బంగారు పూతతో మెరిసిపోతూ ‘జరిగిన పరిణామాలకు ఈ నేల సాక్షి’ అని చెబుతున్నట్లుగా ఒక చేతిని కిందికి చూపిస్తూ ఉంటుంది. ప్రాంగణాన్ని ఆనుకుని బయట లోటస్‌ పాండ్‌ ఉంటుంది. సిద్ధార్థుడు ఆ కొలనులోనే రోజూ స్నానం చేసి చెట్టుకింద కూర్చుని ధ్యానం చేసుకుని బుద్ధుడయ్యాడు. జ్ఞానోదయం అయ్యాక వారం రోజులపాటు బుద్ధుడు కదలకుండా నిలబడి రెప్పవేయకుండా బోధిచెట్టునే చూస్తూ గడిపాడట. అక్కడ కట్టిన స్తూపాన్ని ‘అనిమేషలోచ స్తూప’మంటారు. ఆ తర్వాతి వారం ఆలోచనామగ్నుడై ఆ స్తూపానికీ బోధిచెట్టుకీ మధ్య 18 అడుగులు ముందుకీ వెనక్కీ నడుస్తూ గడిపిన చోటుని ‘రత్నచక్రమ’ అంటారు. ఆయన పాదముద్రల చిహ్నాలను పద్మాల ఆకృతిలో రాతితో నిర్మించారు. ఇలా బుద్ధుడు ఒక్కోచోటా ఒక్కోవారం గడిపినట్లు చెప్పే మొత్తం ఏడు ప్రత్యేక ప్రాంతాలు ఈ ఆలయం ఆవరణలో ఉన్నాయి.

సూర్యదేవునికో ఆలయం... కోణార్క్

సూర్యదేవునికో ఆలయం

ద్భుతమైన శిల్పకళావైభవానికీ ఆకట్టుకునే కళింగ వాస్తు నిర్మాణశైలికీ ప్రతీకగా నిలిచే కోణార్క సూర్యదేవాలయం దేశానికి తూర్పుతీరంలో ఉంది. 70మీటర్ల ఎత్తున పెద్ద రథం ఆకారంలో కన్పించే ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో గాంగవంశానికి చెందిన రాజు నరసింహదేవ-1 పూర్తిగా శాండ్‌స్టోన్‌తో నిర్మించాడు. పన్నెండేళ్లపాటు పన్నెండు వందల మంది కళాకారులు కష్టపడి నిర్మించిన ఈ ఆలయం ప్రపంచాన్ని అబ్బురపరిచే చారిత్రక కట్టడాల్లో ఒకటి. తొలికిరణాలు పడేలా నిర్మించిన ఆలయ నిర్మాణ చాతుర్యం అబ్బుర పరుస్తుంది. తలపై కిరీటంతో సకలాభరణభూషితుడైన సూర్యుని రాతి ప్రతిమ ఆనాటి శిల్పుల కౌశలానికి అద్దంపడుతుంది. విశాలమైన పీఠంపైన రథంలాగా చెక్కి పీఠంలో పన్నెండు జతల చక్రాలను, ప్రవేశమందిరానికి ఎదురుగా ఆ రథాన్ని లాగుతున్నట్లుగా ఏడుగుర్రాలనూ చెక్కారు. వాటిని పన్నెండు మాసాలకూ, ఏడు రోజులకూ సంకేతంగా భావిస్తారు. ఈ చక్రాలపైన పడే సూర్యకిరణాల ఆధారంగా కచ్చితమైన సమయాన్ని చెప్పొచ్చంటారు. మందిరాన్ని తామరపూవు ఆకృతి మీద చెక్కడంతో దీనికి పద్మక్షేత్రమని పేరు. ఆలయానికి ఎదురుగా ఉన్న మరొక పీఠం మీద నిర్మించిన నాట్యమందిరంలో తీర్చిదిద్దిన శిల్పాలు వివిధ వాద్య సంగీతాలతో స్వామికి నృత్యార్చన చేస్తున్నట్లుగా ఉంటాయి. మందిరానికి ఉత్తరంవైపు రెండు ఏనుగుల్నీ, దక్షిణం వైపు రెండు అశ్వాల్నీ చెక్కగా వాటిని చూసి నిజంగానే అవి అక్కడ నిలబడి ఉన్నాయని పొరబడేవారట. ఈ ప్రాంతంతో సూర్యుడి అనుబంధం గురించి పలు కథలు ప్రాచుర్యంలో ఉండటంతో సూర్యభక్తుడైన నరసింహదేవ ఆలయాన్ని ఇక్కడ కట్టించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఆలయాన్ని నిర్మించాలనుకున్నప్పుడు రాజు పన్నెండేళ్లలోగా పూర్తిచేయాలనే షరతు పెట్టాడట. శిల్పులు రాత్రింబగళ్లు కష్టపడినా చివరికి ఒక పని మిగిలిపోయింది. ఆ సమయంలో శిల్పుల బృందానికి నాయకుడిగా ఉన్న బిషు మహారాణా పన్నెండేళ్ల కుమారుడు దాన్ని పూర్తిచేయగా ఆ విషయం రాజుకు తెలిస్తే ఏమవుతుందోనని బిషు భయపడటంతో ఆ అబ్బాయి ఆలయంపైనుంచి దూకి ప్రాణత్యాగం చేశాడట. అందుకే ఇక్కడ ఎలాంటి పూజలూ చేయరని అంటారు. సూర్యుడికి దైవత్వాన్ని ఆపాదిస్తూ నిర్మించిన ఈ దేవాలయంలో మరెన్నో విశేషాలు ఉండటం వల్లే దీనికి యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కింది. అటు రాజుల దురాక్రమణలూ ఇటు ప్రకృతి వైపరీత్యాలూ కలిసి చాలావరకూ ధ్వంసం చేయగా ఒకనాటి వైభవానికి చిహ్నంగా మిగిలి ఉన్న సూర్యదేవాలయం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కి 60కి.మీ.ల దూరంలో ఉంటుంది.

ద్భుతమైన శిల్పకళావైభవం

హంపి... వైభవం చూడతరమా!

హంపి... వైభవం చూడతరమా!

‘శిలలపై శిల్పాలు చెక్కినారూ... మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారూ...’ అన్న పాట వినగానే ఠక్కున స్ఫురించేది విజయనగర సామ్రాజ్యమూ... ఆ వెంటే హంపిలోని కళావైభవమే. బళ్లారి జిల్లాలో తుంగభద్రా తీరంలో నేడు చిన్న పట్టణంగా ఉన్న హంపి, 14 శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజధాని. సుమారు 41.5చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన ఆనాటి శిథిలాలన్నీ అలనాటి శిల్పకళావైభవానికీ వాస్తునిర్మాణానికీ అద్దం పడుతుంటాయి. అందుకే యునెస్కో 1986లోనే హంపిలో శిథిలావస్థలో ఉన్న వందలాది నిర్మాణాల్నీ దేవాలయాల్నీ ప్రపంచ వారసత్వ సంపద జాబితాలోకి చేర్చింది. వీటిల్లో ఒకటి విరూపాక్ష దేవాలయం. పరమశివుడు కొలువైన ఈ ఆలయానికి తూర్పుముఖంగా ఉన్న ఆలయ ప్రధాన రాజగోపురం మీద స్త్రీ పురుషుల శిల్పాలు చాలానే ఉంటాయి. ఆలయ ఆవరణలో హేమకూటం నుంచి ప్రవహించే సన్నని నీటిపాయలో నీరు ఎప్పుడూ ఉంటుందట. లోపలకు వెళ్లాక వచ్చే రెండో గోపురాన్ని కృష్ణదేవరాయలు కట్టించడంతో రాయల గోపురం అంటారట. ఇది దాటాక వచ్చే ఆవరణలో ముఖమంటపం, ఆ తరవాత గర్భగుడి ఉంటాయి. దీనికి చుట్టూ ఉన్న వరండాలో పాతాళేశ్వర, ముక్తి నరసింహ, శ్రీవేంకటేశ్వర, మహిషాసురమర్దనిల ఉప ఆలయాలు ఉంటాయి. గర్భగుడికి కుడిపక్కన ఉన్న గోడకి కృష్ణదేవరాయలు చేయించిన నవరత్నఖచిత బంగారు కిరీట చిత్రపటం ఉంటుంది. ఈ కిరీటాన్ని ప్రభుత్వ ఖజానాలో భద్రపరిచి ఉత్సవ సమయంలో మాత్రం స్వామికి అలంకరిస్తారు. గర్భాలయం వెనక ఉన్న మెట్లదారి పక్కన ఉండే చీకటి గది తూర్పుగోడకి ఏడు అడుగుల ఎత్తులో ఓ రంధ్రం ఉంటుంది. అందులో నుంచి వెలుతురు వచ్చి అది ఎదురుగా ఉన్న గోడమీద పడడంతో బయట ఉన్న రాజగోపురం నీడ తలకిందులుగా కనిపిస్తుంది. దానికి ఎదురుగా ఓ తెల్లని వస్త్రాన్ని అడ్డం పెడితే దానిమీద గోపురం నీడ స్పష్టంగా కనిపించటం ఆనాటి అద్భుత కళాచాతుర్యాన్ని చాటుతుంది. ఆవరణలో ఉన్న సుందర శిల్పాలతో కూడిన ముఖమండపంలోకి ఎక్కే మెట్లకి రెండువైపులా పురాతన తెలుగు భాషలో రాసిన శాసనం ఉంటుంది. విరూపాక్ష ఆలయం ఏడో శతాబ్దానికి ముందే ఉన్నట్లు శాసనాలు చెబుతున్నాయి. అయితే అప్పట్లో ఉన్న చిన్న గుడిని విజయనగర రాజులు అతిపెద్ద ఆలయంగా కట్టించినట్లు చరిత్ర చెబుతోంది. దీని నిర్మాణంలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్యం పతనమయ్యాక దండయాత్రల వల్ల 16వ శతాబ్దంలోనే హంపి శిల్పసౌందర్యం నాశనమైనప్పటికీ విరూపాక్ష దేవాలయంలో ధూపనైవేద్యాలు అవిఘ్నంగా కొనసాగడం విశేషం. హంపి ఈశాన్యంలో ఉన్న విఠల దేవాలయ సముదాయం సైతం అప్పటి శిల్ప కళా సంపత్తికి చూడచక్కని నిదర్శనమే. ఇక్కడ విష్ణుమూర్తి విఠలుడి రూపంలో సేవలందుకుంటున్నాడు. సప్తస్వరాలు పలికే ఏడు సంగీతస్తంభాలు ఈ దేవాలయ ప్రత్యేకత. ఇక్కడే పురందరదాసు ఆరాధనోత్సవాలు జరుగుతాయి. ఇవే కాదు, కదిలే చక్రాలున్న ఏకశిలారథం, పట్టపు ఏనుగుల నివాసం కోసం కట్టించిన గజశాల, యోగనరసింహ విగ్రహం... ఇలా మరెన్నో నిర్మాణాలు ఆనాటి హంపి వైభవాన్ని కళ్లకు కడుతూ ఈనాటి సాంకేతిక నిపుణుల్ని సవాల్‌ చేస్తున్నట్లే ఉంటాయి

అదరహో ఖజురహో!

అదరహో ఖజురహో!

అదరహో ఖజురహో!

భారతీయ సంస్కృతిలోని శృంగారతత్వాన్ని చాటి చెప్పే ఆలయాల్లో ప్రధానమైనది ఖజురహో! 21 చ.కి.మీ. మేర విస్తరించిన ఈ ఆలయ ప్రాంగణంలో హిందూ, జైన దేవాలయాలున్నాయి. యునెస్కో 1986లోనే ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. తాజ్‌మహల్‌ తర్వాత మనదేశంలో ఎక్కువ మంది పర్యటకులు వెళ్లేది ఇక్కడికే!

మధ్యప్రదేశ్‌లోని వింధ్యపర్వతాల మధ్యన ఉండే ఖజురహో ఆలయాల సమూహం క్రీ.శ.950-1050 మధ్య కాలానికి చెందిన నిర్మాణం. చందేల రాజవంశీయులు నిర్మించిన ఈ దేవాలయాలపైన అద్భుత శిల్పకళ దర్శనమిస్తుంది. ఇది ప్రధానంగా 19వ శతాబ్దంలో ఆంగ్లేయుల కాలంలో వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయ ప్రాంగణం కామకేళి శిల్ప సంపదద్వారా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. ఇవి కళాకారుల ఊహల నుంచి గానీ లేదంటే కామసూత్రలో చెప్పిన నియమాల ఆధారంగా గానీ పుట్టినవని చెబుతారు. నలుపు, ఊదా లేదా పసుపు రంగులకు చెందిన వివిధ రకాల వర్ణాలతో కూడిన ఇసుకరాతితో నిర్మితమైన ఈ దేవాలయాలు శివుడు, విష్ణువు, జైన తీర్థంకరులకు చెందినవి. ఒకప్పుడు ఈ ప్రాంగణంలో 85 ఆలయాలు ఉండగా ప్రస్తుతం 25 మాత్రమే ఉన్నాయి. విశ్వనాథ్‌, పార్వతీదేవి, కందారియా మహాదేవ, జగదాంబ, చిత్రగుప్త, పార్శ్వనాథుని ఆలయాలను ఇక్కడ చూడొచ్చు. ప్రతి గుడి గోడలమీదా వాస్తవికతకు దగ్గరగా, మనసుని హత్తుకునేలా, ఆలోచనలు పరవళ్లు తొక్కేలా రూపుదిద్దుకున్న శిల్పాలు దర్శనమిస్తాయి. ఖజురహో ఆలయాల గోడలమీద శిల్పాలు శృంగారాన్ని ఒక రసరమ్య కావ్యంగా చూపిస్తాయి. ఈ శిల్ప సంపద స్త్రీ జీవనానికి సంబంధించిన వేడుకగానూ చెప్పాలి. లేఖ రాస్తున్నట్టు, కళ్లకు వర్ణాలు దిద్దుకుంటున్నట్టు, కురుల్ని దువ్వుకుంటున్నట్టు, నాట్యం చేస్తున్నట్టు, బిడ్డతో ఆడుకుంటున్నట్టు, దీపం పెడుతున్నట్టు... ఇలా మహిళలకు సంబంధించి లెక్కలేనన్ని హావభావాలూ, అంశాలకు అద్దంపట్టేలా ఈ శిల్పాలను చిత్రీకరించారు. ఏటా ఇక్కడ ఖజురహో ఉత్సవాలనూ మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. భక్తికీ రక్తికీ ఆలవాలమైన ఈ శృంగార నగరి శిల్ప సౌందర్యం గురించి మాటల్లో వినేకంటే నేరుగా చూడాల్సిందే. చూశాక ‘అదరహో ఖజురహో’ అనాల్సిందే!

‘అదరహో ఖజురహో’
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.